హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీలు దళితుల అభ్యున్నతి కోసం చేసిన కార్యాచరణ ఏమిటని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ప్రగతిభవన్లో దళితబంధుపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో సీఎం మాట్లాడుతూ ‘రాష్ట్రంలో ఆరు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్, టీడీపీలే అధికారంలో ఉన్నయి. మరి వీళ్లు నిజంగా పేదలకు ఇండ్లు కట్టించి ఇస్తే ఇప్పటికి కూడా ఇండ్లు లేని నిరుపేదలు ఎందుకున్నారు? ఇంత డిమాండ్ ఎందుకున్నది? వాళ్లు నిజంగా ఇండ్లు కట్టి ఉంటే ఇప్పుడు మనం డబుల్ బెడ్రూం స్కీం పెట్టుకునే అవసరమే లేకుండె.
దళితులకు ఏదో ఇచ్చేస్తున్నారు.. ఎంతో లబ్ధి జరిగిందన్న దుష్ప్రచారం చేశారు. దీంతో ఇతరులు ఈర్ష్య పడేలా చేశారు. కానీ, వాస్తవాలు వేరుగా ఉన్నాయి. దళితులకు మేం భూమి పంచినమంటే.. మేం పంచినమని చెప్తున్నరు. మరి ఇంతమంది పంచితే భూమి ఎక్కడికి పోయినట్టు? రాష్ట్రంలో 18,22,291 దళిత కుటుంబాలున్నట్టు ప్రాథమిక సమాచారమున్నది. వీరిలో 9,52,603 మంది వద్దనే భూమి ఉన్నది. దీంట్లో కూడా 3.30 లక్షల మంది వద్ద ఒక్క ఎకరం, ఎకరానికన్నా తక్కువ భూమి ఉన్నది. ఏడులక్షల మంది వద్ద మూడెకరాలలోపు భూమి ఉన్నది. కేవలం 25 వేల మంది వద్ద మాత్రమే 5 ఎకరాలకన్న ఎక్కువ భూమి ఉన్నది. మొత్తం దళితుల వద్ద ఉన్న భూమి 15,39,870 ఎకరాలు మాత్రమే. దీంట్లో అసైన్మెంట్ భూమి చాలా తక్కువ. అన్ని లెక్కలూ తీస్తున్నం.
చాలా చోట్ల కాగితాల మీదనే భూములున్నయి. మొత్తం దళితుల్లో 38% మంది వద్ద మాత్రమే వ్యవసాయ భూమి ఉన్నది. దళితుల కోసం చాలా పథకాలు పెట్టి, వారినే అభివృద్ధి చేస్తున్నారని సమాజంలో జరుగుతున్న చర్చ ఒక దుష్ప్రచారమే. అశావహ దృక్పథానికి బాటలు వేస్తేనే చకటి తెలంగాణ అభివృద్ధికి బాటలు పడతయి. తెలంగాణ ప్రభుత్వం ఏ ఒక వర్గాన్ని విస్మరించలేదు. బ్రాహ్మణులు తదితర అగ్రకులాల్లోని పేదలను గుర్తించి వారిని అభివృద్ధిపరిచే కార్యక్రమాలను అమలుపరుస్తున్నాం. దళిత జాతి అభివృద్దిలో ప్రజాప్రతినిధులు, అధికారులు చాలా గొప్ప పాత్రను పోషిస్తారని ఆశిస్తున్నా. అధికారదర్పంతో కాకుండా సమన్వయకర్తలుగా, కార్యకర్తలుగా పనిచేయాలి. దళితబంధు అమలు తీరును అధ్యయనం చేయడానికి నాయకులు, అధికారులు ఒకట్రెండు రోజులు హుజురాబాద్ నియోజకవర్గ పర్యటనకు వెళ్లిరావాలి. నాలుగు నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు హుజురాబాద్లో పర్యటించేందుకు సీఎస్ సోమేశ్ కుమార్ ఏర్పాట్లు చేయాలి.. అని సీఎం కేసీఆర్ అన్నారు.
క్షేత్రస్థాయిలో అద్భుత స్పందన : కర్ణన్
దళితబంధు పైలట్ ప్రాజెక్టుగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలవుతున్న నేపథ్యంలో, క్షేత్ర స్థాయి అనుభవాలను సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ కర్ణన్ వివరించారు. క్షేత్రస్థాయిలో అద్భుతమైన స్పందన వచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన మండలాలు ఉన్న జిల్లాల మంత్రులు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు సహా ప్రజాప్రతినిధుల సలహాలు, సూచనలను సీఎం కేసీఆర్ స్వీకరించారు. దళితబంధు ద్వారా దళిత జాతి ఆర్థికంగా నిలదొకుకునే దిశగా నడిపించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వక్తలు అభిప్రాయపడ్డారు. సీఎం కేసిఆర్ చేపట్టిన దళితబంధు పథకం దళితులను వ్యాపారవర్గంగా మలుస్తుందని సమావేశం విశ్వాసం వ్యక్తంచేసింది. సీఎం ఆలోచనలకు అనుగుణంగా తాము దళితబంధు విజయవంతానికి క్షేత్ర స్థాయిలో కృషిచేస్తామని సమావేశంలో పాల్గొన్న అధికారులు తెలిపారు.