హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ఆన్లైన్ బోధనలో ప్రాచుర్యంపొందిన బైజూస్ తరగతులు ప్రభుత్వ పాఠశాలల్లోనూ అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లోని 2,578 పాఠశాలల్లో, 1,26,714 మంది విద్యార్థులకు ఈ తరగతులు కొనసాగనున్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పాఠశాలల్లో ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన డిజిటల్ పాఠ్యాంశాలను బైజూస్ సంస్థ ఉచితంగా అందజేయనున్నది. ఈ మేరకు నీతిఆయోగ్, బైజూస్ సంస్థతో ఇటీవలే ఒప్పందం కుదుర్చుకున్నది. దేశవ్యాప్తంగా 112 ఆస్పిరేషనల్ జిల్లాల్లో ఈ తరగతులను నిర్వహించనుండగా.. తెలంగాణ నుంచి నాలుగు జిల్లాలు ఎంపికయ్యాయి. 6 -12 తరగతులకువారికి ఉచిత విద్యనందించడంతోపాటు, బైజూస్ కెరీర్ ప్లస్ ప్రోగ్రాం ద్వారా నీట్, జేఈఈకి హాజరయ్యే విద్యార్థులకు ఉచిత శిక్షణనివ్వనున్నారు. మూడేండ్లపాటు ఈ శిక్షణ అందుబాటులో ఉండనున్నది.