పనజీ: ఇండియన్ టూరిజంలో చాలా మందికి స్వర్గధామంలాంటిది గోవా. అక్కడి బీచుల్లో ఏడాదికి ఒకసారైనా అలా అలా విహరించి రావాలని అనుకోని యువత ఉండదు. కొవిడ్ కారణంగా కొన్నాళ్ల నుంచి బయటి వ్యక్తులపై ఆంక్షలు విధించిన ఆ రాష్ట్రం మెల్లగా వాటిని ఎత్తేస్తోంది. అయితే బయటి టూరిస్టులకు కొన్ని కఠిన నిబంధనలు విధించే యోచనలో ఉంది. కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తప్పనిసరిగా వేసుకోవడంతోపాటు నెగటివ్ ఆర్టీ-పీసీఆర్ రిపోర్ట్ తీసుకురావాల్సిందేనని గోవా పోర్టుల మంత్రి మైకేల్ లోబో స్పష్టం చేశారు.
జులై వరకూ వేచి చూస్తాం. కేసుల సంఖ్య సున్నాకు చేరాలి. ఆ తర్వాత తగిన స్క్రీనింగ్తో టూరిస్టులను అనుమతిస్తాం. అయితే తొలి మూడు నెలల పాటు రెండు డోసుల వ్యాక్సిన్తోపాటు నెగటివ్ ఆర్టీ-పీసీఆర్ రిపోర్ట్ తప్పనిసరి చేస్తాం అని లోబో వెల్లడించారు. అయితే కొవిడ్ కేసులు తగ్గుతున్నా కనీసం రెండు నెలల పాటు జాగ్రత్తగా ఉండాలని, కనీసం నెల రోజుల తర్వాతే టూరిజం ఓపెన్ చేస్తామని అన్నారు. అయితే క్రిస్మస్, న్యూ ఇయర్ కోసం వచ్చే టూరిస్టులకు మాత్రం ఇది వర్తించదన్నట్లుగా ఆయన మాట్లాడారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్లలో మాత్రం ప్రొటోకాల్ మారుతుందని లోబో చెప్పారు.