ఇల్లంతకుంట, ఏప్రిల్ 19: బీజేపీ, ఏబీవీపీ నాయకులు బరితెగించారు. మంత్రి కేటీఆర్ కార్యక్రమాన్ని అడ్డుకోవడమే కాదు.. టీఆర్ఎస్ నాయకులపైనా దాడికి పక్కాగా ప్లాన్చేశారు. ఇందుకోసం స్థానిక నాయకులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఏబీవీపీ, బీజేపీ నాయకులను భారీగా రప్పించారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. కార్యక్రమాలను ముగించుకొని సిరిసిల్లకు బయలుదేరే సమయంలో రైతువేదిక వద్ద ఒక్కసారిగా ఏబీవీపీ, బీజేపీ నాయకులు మంత్రి కాన్వాయికి అడ్డుపడ్డారు. వీరం గం సృష్టించే ప్రయత్నం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే సదరు నాయకులను అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. మం త్రి కాన్వాయికి అడ్డుపడిన బీజేపీ నాయకులపై ఫిర్యాదు చేయడానికి టీఆర్ఎస్ నాయకులు స్టేషన్కు వెళ్లారు. అప్పటికే అక్కడికి భారీగా చేరుకున్న ఏబీబీపీ, బీజేపీ నాయకులు.. టీఆర్ఎస్ నాయకులు స్టేషన్లోకి అడుగు పెట్టడమే ఆలస్యం అన్నట్టు దాడికి దిగారు. టీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు ఎండ్ర చందన్ కారుపై బండ రాయిని విసిరికొట్టారు. కారు ధ్వంసం కావడంతోపాటు కారు నడుపుతున్న ఉపసర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు సాదుల్కు గాయాలయ్యాయి. అక్కడితో ఆగకుండా వాగ్వాదానికి దిగుతూ టీఆర్ఎస్ నాయకులపై దాడికి పాల్పడ్డారు. పోలీస్స్టేషన్లో శాంతియుతంగా ఫిర్యాదు చేయడానికి వస్తే.. తమపై ఎందుకు దౌర్జన్యం చేశారంటూ టీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించినా.. వినకపోగా మరింత రెచ్చిపోయారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి గొడవ సద్దుమణిగేలా చేశారు. ఉమ్మడి జిల్లా నుంచి ఏబీవీపీ, బీజేపీ నాయకులు ఎం దుకు వచ్చినట్టు?, పోలీస్స్టేషన్ సాక్షిగా ఎందుకు దౌర్జన్యానికి దిగినట్టు? అన్న విషయాలను పరిశీలిస్తే.. ఉద్దేశపూర్వకంగానే కుట్ర పన్నిన విషయం అర్థమవుతున్నది. దీనిపై పోలీసులు లోతుగా విచారణ చేపడుతున్నారు.