నిజామాబాద్ కలెక్టరేట్ మైదానంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలు నిర్వహించిన ఆటో షో గ్రాండ్ సక్సెస్ అయింది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు జరిగిన ఈ ప్రదర్శనకు విశేష స్పందన వచ్చింది. మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండే మారుతి సుజుకీ ఆల్టో కారు మొదలుకొని విలాసానికి పెట్టింది పేరైన మెర్సిడెజ్ బెంజ్ కార్ల వరకు.. బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ టూవీలర్ల నుంచి బెనెల్లీ లాంటి సూపర్ బైక్ల వరకు పలు కంపెనీల వాహనాలను ఒకేచోట అందుబాటులో ఉంచడంతో ఎంతో మంది ఈ షోను సందర్శించారు. తమకు నచ్చిన వాహనాలను టెస్ట్ డ్రైవ్ చేసి వాటి ప్రత్యేకతలు, రుణ సదుపాయాలపై ఆరా తీశారు. ఈ మూడు రోజుల్లో మొత్తం 60 వాహనాలు అమ్ముడుపోయాయి.
ఖలీల్వాడి, సెప్టెంబర్ 26: నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటో షో విజయవంతమైంది. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ మైదానంలో మూడు రోజులపాటు జరిగిన ఈ షో ఆదివారంతో ముగిసింది. మొత్తం 60 ద్విచక్ర వాహనాలు, కార్లు అమ్ముడుపోయాయి. చివరి రోజు ఆదివారం కావడంతో ఉదయం నుంచే ఆటో షో ప్రాంగణం సందర్శకులతో కిటకిటలాడింది. జిల్లా నలుమూలల నుంచి ఎంతోమంది సందర్శకులు తమ కుటుంబసభ్యులతో కలిసి వచ్చి కార్లు, ద్విచక్ర వాహనాల మోడళ్ల వివరాలను సేకరించారు. బైకులు, కార్లను టెస్ట్ డ్రైవ్ చేసి వాటి ప్రత్యేకతలు, రుణ సదుపాయాలపై ఆరా తీశారు. వీరిలో చాలామంది అక్కడే వాహనాల బుకింగ్లు, కొనుగోళ్లు జరిపారు.
ఒకే వేదికపై అన్ని మోడళ్ల కార్లు, బైక్లను అందుబాటులో ఉంచడంపై సందర్శకులు హర్షం వ్యక్తం చేశారు. ఆటో షోలో వివిధ కంపెనీలకు చెందిన 14 ఫోర్ వీలర్ల స్టాళ్లు, 6 ద్విచక్రవాహన స్టాళ్లు ఏర్పాటు చేశారు. టూవీలర్ల క్యాటగిరీలో ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రత్యేకంగా రెండు స్టాళ్లు ఏర్పాటయ్యాయి. వీటిలో బిగాస్ కంపెనీ ప్రదర్శించిన బ్యాటరీ వాహనాలకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఆ కంపెనీ అందుబాటులో ఉంచిన నాలుగు రకాల వాహనాలను టెస్ట్ డ్రైవ్ చేసేందుకు ఎంతోమంది సందర్శకులు, ముఖ్యంగా మహిళలు చాలా ఉత్సాహం చూపారు. వీటితోపాటు హీరో ఎలక్ట్రిక్ వెహికల్స్కు సైతం మంచి ఆదరణ లభించింది.
లక్కీడ్రా విజేతలకు బహుమతులు
చివరి రోజైన ఆదివారం ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ నగర మేయర్ నీతూ కిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జగన్నాథం విక్రమ్ తదితరులు సందర్శించారు. దర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ సైతం ఆటో షోను సందర్శించి బైక్ నడుపుతూ అందరినీ అలరించారు. కొనుగోలుదారుల లక్కీడ్రాలో విజేతగా నిలిచిన మహ్మద్ అబ్దుల్ హైమద్ ఫోన్ను గెలుచుకున్నారు. ఆయనతోపాటు లక్కీ విజిటర్స్గా నిలిచిన శ్రీరాం, స్వప్నకు బాజిరెడ్డి గోవర్ధన్ బహుమతులను ప్రదానం చేశారు. ఆటో షోలో పాల్గొన్న షోరూముల నిర్వాహకులకు జ్ఞాపికలను అందజేశారు.