హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇచ్చే ఆయుర్వేద మందుపై వివిధ పరీక్షల్లో సానుకూల ఫలితాలు వచ్చాయి. ఆనందయ్యకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పించారు. ఈ నెల 31న కొవిడ్ ఆయుర్వేద మందుపై లోకాయుక్త విచారణ చేపట్టనున్నది. విచారణకు హాజరుకావాలని నెల్లూరు జిల్లా అధికారులను లోకాయుక్త ఆదేశించింది. కొవిడ్ ప్రొటోకాల్ ఉల్లంఘించకూడదని పేర్కొన్నది. ఆనందయ్య నుంచి ఆయుష్ ఉన్నతాధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఆయుష్ అధికారుల రిపోర్టుల్లో ఈ మందు తయారీలో వినియోగించే పదార్థాల వల్ల ఎలాంటి హానీ జరుగదని, మందు తయారీ కూడా ప్రమాణాలకు లోబడే ఉందని పేర్కొన్నారు. మందు తయారీ విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన తర్వాత ప్రభుత్వానికి తుది నివేదిక ఇవ్వనున్నారు. ఆ వెంటనే మందు పంపిణీపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయనున్నట్టు అధికారులు తెలిపారు.
మందు తీసుకున్న కోటయ్యకు అస్వస్థత
ఆనందయ్య వద్ద కరోనా మందు తీసుకున్న రిటైర్డ్ హెచ్ఎం కోటయ్య పరిస్థితి విషమంగా మారింది. పది రోజులుగా కరోనాతో బాధపడుతున్న కోటయ్య.. రెండు రోజుల క్రితం ఆనందయ్య వద్ద చుక్కల మందు కంట్లో వేసుకున్నారు. మందు వేసుకున్నాక కొంత నయమైనా ఆక్సిజన్ లెవల్స్ శనివారం ఒక్కసారిగా తగ్గడంతో పరిస్థితి విషమించింది. కంటికి ఇన్ఫెక్షన్ కూడా సోకినట్టు వైద్యులు గుర్తించారు. కోటయ్యను కోట దవాఖానకు తరలించారు.