వారణాసి, జూన్ 10: కరోనా ఇంతటి కల్లోలం సృష్టిస్తున్న సమయంలో కూడా టీకా వేసుకోవటానికి కొందరు జంకుతున్నారు. కానీ, నూరేండ్లు దాటిన వయోవృద్ధులు మాత్రం వ్యాక్సిన్ వేసుకొని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. దీనికి తాజా ఉదాహరణ.. వారణాసికి చెందిన స్వామి శివానంద. బుధవారం పట్టణంలోని ఓ వ్యాక్సిన్ సెంటర్ వద్దకు ఒంటరిగానే వచ్చిన శివానంద.. అక్కడున్న సిబ్బందికి తన ఆధార్కార్డును చూపించారు. అది చూసి వారు అవాక్కయ్యారు. ఎందుకంటే, దాంట్లో ఆయన పుట్టినతేదీ 8 ఆగస్టు 1896 అని ఉంది. అంటే, ఆయన వయస్సు 125 ఏండ్లన్నమాట. అంతటి వయోవృద్ధుడికి టీకా వేయొచ్చా? లేదా? అంటూ తర్జనభర్జన పడ్డారు. కానీ, స్వామి శివానందే స్వయంగా వారిని ఒప్పించి టీకా తీసుకున్నారు. మళ్లీ ఒంటరిగానే అక్కడి నుంచి ఆయన వెళ్లిపోవటం చూసి అక్కడివారంతా మరోసారి ఆశ్చర్యపోయారు.
ఆకలి సగమే తీర్చుకుంటా
వారణాసిలోని కబీర్ నగర్ కాలనీకి చెందిన శివానంద గురించి తెలిసి విలేకర్లు ఆయనను పలుకరించారు.‘క్రమశిక్షణతో కూడిన దైనందిన జీవితం, సాధారణ ఆహారం.. నేను ఇంతకాలంపాటు జీవించి ఉండటానికి కారణం’ అని శివానంద చెప్పారు. ‘వేకువజామున మూడుకు నిద్ర లేస్తా. స్నానం కోసం గంగానదికి వెళ్తా. ఆ తర్వాత కొద్దిసేపు యోగా చేస్తా. నూనె, మసాలాలు వంటివి అంతగా వాడని సాధారణ ఆహారం తీసుకుంటా. అది కూడా పూర్తిగా తినను. నా ఆకలిలో సగం మాత్రమే తీర్చుకుంటా’ అని తెలిపారు. నిర్ణీత వ్యవధి తర్వాత టీకా రెండో డోసు కూడా తీసుకుంటానని శివానంద తెలిపారు. ఆయనకంటే ముందు.. జమ్ముకశ్మీర్కు చెందిన ధోలీదేవి కరోనా టీకా తీసుకున్న అత్యంత వృద్ధవ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఆమె వయస్సు 120 ఏండ్లు.