హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తలపెట్టిన మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది జూన్లో తరగతులు ప్రారంభించాలన్న లక్ష్యాన్ని ఏర్పరచుకున్న నేపథ్యంలో నవంబర్ 30 నాటికే కళాశాలల ఏర్పాటు పనుల పూర్తికి అధికారులు ముమ్మరం గా కసరత్తు చేస్తున్నారు. మరోవైపు ఈ కాలేజీలకు అనుమతుల కోసం ఒకటి రెండు వారాల్లో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ)కి దరఖాస్తు చేసేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో కొత్త ఏర్పాటుచేయబోయే మెడికల్ కాలేజీలను ఈ ఏడాది అక్టోబర్, నవంబర్లో నేషనల్ మెడికల్ కమిషన్ పరిశీలించవచ్చని వైద్యాధికారులు వెల్లడించారు.
వేగంగా జరుగుతున్న పనులు
ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం, మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉండే దవాఖానలు కనీ సం 20 ఎకరాల స్థలం కలిగి ఉండాలి. వాటిలో 330 కంటే ఎక్కువ పడకలు ఉండాలి. ఇందుకనుగుణంగా సంగారెడ్డి, వనపర్తి, జగిత్యాల, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, కొత్తగూడెం, మంచిర్యాల జిల్లాల్లో దవాఖానలను అప్గ్రేడ్ చేస్తున్నారు. ఒక్క సంగారెడ్డిలో మాత్రం 400 పడకలు ఉండగా, మిగతా అన్నింట్లో పడకలు తక్కువగా ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలో దవాఖాన స్థలాన్ని ఇంకా ఫైనల్ చేయాల్సి ఉండగా, జగిత్యాలలో గోడౌన్స్ స్థలాన్ని వినియోగించబోతున్నారు.
ఎన్ఎంసీ వచ్చే నాటికి పూర్తి
ఎన్ఎంసీ పరిశీలనకు వచ్చే నాటికి ఈ పనులన్నీ పూర్తికావాలి. లెక్చర్ హాల్స్, ల్యాబ్స్, లైబ్ర రీ, డెమో రూమ్స్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ తదితర నిర్మాణాలను ఎన్ఎంసీ పరిశీలిస్తుంది. అవసరమైన ఎక్విప్మెంట్, ఫర్నీచర్ కోసం ఇప్పటికే టెండర్లు ఆహ్వానించారు. సెప్టెంబర్ 10 నాటికి ఇవి ఖరారు కానున్నాయి. అక్టోబర్ 31 నాటికి అవి సమకూరనున్నాయి. ఏడు జిల్లాల్లో మెడికల్ విద్యార్థుల కోసం అద్దె ప్రాతిపాదికన హాస్టళ్ల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ల సహకారం తీసుకోనున్నారు. ఒక్కో కాలేజీ నిర్మాణానికి కనీసం రూ. 500 కోట్లకు పైనే ఖర్చు అవుతుందని వైద్యారోగ్య అధికారులు చెబుతున్నారు. ఈ ఖర్చును తెలంగాణ ప్రభుత్వం భరించనున్నది.
510 కోట్లతో రామగుండం మెడికల్ కాలేజీ
రామగుండంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఓల్డ్ పంప్హౌజ్ సమీపంలోని 15 ఎకరాలను సింగరేణి సంస్థ అప్పగించినట్లు తెలుస్తున్నది. ఏరియా దవాఖాన వద్దనున్న 8 ఎకరాల స్థలాన్ని ప్రస్తుతం ఉన్న 100 పడకలను 330 పడకలకు పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మెడికల్ కాలేజీ నిర్మాణానికి రూ.510 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తుండగా.. ఈ మొత్తాన్ని సింగరేణి దీన్ని సమకూర్చుతుందని అధికారులు తెలిపారు. రామగుండం మెడికల్ కాలేజీ ఏర్పా టు పనులు కూడా ఈ ఏడాది చివరి నాటికి పూర్తి కానున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే జూన్ 2022 నాటికి మొదటి ఏడాది తరగతులు ఇక్కడ ప్రారంభం కానున్నాయి.