న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా వ్యాక్సిన్లు ఇవ్వడం ప్రారంభించి సుమారు ఆరు నెలలు కావస్తోంది. ఇప్పటి వరకూ 24 కోట్లకుపైగా వ్యాక్సిన్లు ఇచ్చారు. అయితే తాజాగా కొవిడ్ వ్యాక్సిన్ల వల్ల కలిగిన దుష్ప్రభావాలు, మరణాలకు సంబంధించిన డేటాను ప్రభుత్వం రిలీజ్ చేసింది. జనవరి 16 నుంచి జూన్ 7 వరకూ డేటా ఇందులో ఉంది. దీని ప్రకారం వ్యాక్సిన్లు వేసుకున్న తర్వాత దుష్ప్రభావాలు కలిగిన వారి సంఖ్య 26200గా ఉంది. అంటే కేవలం 0.01 శాతం మందిపై మాత్రమే వ్యాక్సిన్లు ప్రతికూల ప్రభావాన్నిచూపించాయి. ఇక మరణించిన వారి సంఖ్య 488 అని ప్రభుత్వ డేటా వెల్లడించింది.
గత 143 రోజుల్లో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్న వాళ్లు ప్రతి పది వేల మందిలో ఒక్కరు మత్రమే. ఇక ప్రతి పది లక్షల మందిలో ఇద్దరు మరణించారు. నిజానికి ఈ ప్రతికూల ప్రభావాలు, మరణాలకు కూడా నేరుగా వ్యాక్సిన్లతో సంబంధం లేదు. వ్యాక్సిన్ల వల్ల కలిగే దుష్ప్రభావాల కంటే మంచే ఎక్కువని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇండియాలో ఇప్పటి వరకూ ఇచ్చిన రెండు వ్యాక్సిన్లు కొవిషీల్డ్, కొవాగ్జిన్లలోనూ ఈ ప్రతికూల ప్రభావాల రేటు కేవలం 0.01 శాతం మాత్రమే. ఇందులో 24,703 కేసులు కొవిషీల్డ్కు సంబంధించినవి కాగా.. 1497 కొవాగ్జిన్ వల్ల సంభవించినవి.