కొత్తగూడెం, మే 18: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెయ్యిపడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ త్వరలో కార్యరూపం దాల్చనున్నదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. మంగళవారం ఆయన భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పర్యటించారు. ముందుగా భద్రాచలం ఏరియా దవాఖానలో 13 వేల కిలోలీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంటును ప్రారంభించారు. కరోనా రోగులకు స్వయంగా భోజనం అందజేశారు. అనంతరం భద్రాచలం సబ్కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో, పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం సర్కారు దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పిస్తుందని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో కొవిడ్ ఆక్సిజన్ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, పొదెం వీరయ్య, కలెక్టర్ ఎంవీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.