హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): కరోనా సోకిన సిబ్బందిని కాపాడుకొనేందుకు పోలీస్శాఖ మరో అడుగు ముందుకేసింది. సిబ్బందికి అవసరమైన చికిత్స సకాలంలో అందేలా, ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే సకాలంలో స్పందించేలా డీజీపీ కార్యాలయంలోని ఐటీసెల్ తెలంగాణ స్టేట్ పోలీస్ ఎంప్లాయీస్ కొవిడ్ కేర్ (టీఎస్పీఈ కొవిడ్ కేర్) యాప్ను అందుబాటులోకి తెచ్చింది. పోలీస్శాఖలో పనిచేసే డాక్టర్లతోపాటు నిపుణులైన ఇతర డాక్టర్లు కలిపి మొత్తం 45 మంది బృందం నిరంతరంగా కొవిడ్ చికిత్సలను పర్యవేక్షిస్తుందని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ సిబ్బందిలో ఇప్పటివరకు 23 వేల మందికిపైగా కరోనా బారిన పడ్డారు. వీరిలో కొందరు ఇంకా చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న సిబ్బంది గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఎంప్లాయి ఐడీ, మొబైల్ నంబర్ను ఎంటర్ చేస్తే మొబైల్కు ఓటీపీ వస్తుంది. తర్వాత వారికి ఎప్పుడు కరోనా సోకిందో తెలుపుతూ పాజిటివ్ రిపోర్ట్ అప్లోడ్ చేయాలి. రోజూ మూడుసార్లు వారి శరీర ఉష్ణోగ్రత, ఆక్సిజన్ లెవల్స్ (ఎస్పీఓటు), షుగర్, బీపీ, ఇతర ఆరోగ్య సమస్యల వివరాలు నమోదు చేస్తూ ఉండాలి. లక్షణాల ఆధారంగా ఇతర అత్యవసర పరిస్థితిని బట్టి యాప్లో అటోమెటిక్గా క్రిటికల్, సివియర్, మైల్డ్, స్టేబుల్ అనే క్యాటగిరీలుగా రోగులను విభజిస్తారు. ఈ వివరాలు డాక్టర్ల బృందానికి యాప్ ద్వారా అందుతాయి. లక్షణాలను బట్టి అవసరమైన మందులు, ఇతర సూచనలు డాక్టర్లు ఇస్తుంటారు. అవసరమైతే నేరుగా డాక్టర్లు రోగులతో మాట్లాడుతారు. సిబ్బందితోపాటు వారి కుటుంబ సభ్యులు కరోనా బారిన పడినా వారికీ డాక్టర్ల బృందం వైద్య సాయం అందిస్తుంది.