ఏ కొలువులకోసం ఏండ్ల తరబడి తండ్లాడినమో.. ఆ తండ్లాట తీరిపోనున్నది. ఇక మన కొలువులు మనకే దక్కనున్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వులకు చేపట్టిన సవరణలు త్వరలోనే అమల్లోకి రానున్నాయి. ఈ జోన్ల పరిధిలోనే.. 95% స్థానికులకే.. అంటే తెలంగాణ నిరుద్యోగులకే ఉద్యోగాలు లభించబోతున్నాయి. ఇది తెలంగాణ ఫలం.. ఫలితం.
హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి జోనల్ వ్యవస్థలో రాష్ట్రపతి ఉత్తర్వులకు చేపట్టిన సవరణలు త్వరలో అమలులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన ఫైల్ సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లింది. ఫైల్పై సంతకంచేయగానే సవరణ ఉత్తర్వులను అమల్లోకి తీసుకొస్తూ రాష్ట్రప్రభుత్వం గెజిట్ విడుదల చేస్తుంది. అప్పటి నుంచి జోనల్ వ్యవస్థలో చేపట్టిన సవరణలు అమల్లోకి వస్తాయి. దీని ప్రకారం గతంలో 31 జిల్లాలకు ఉన్న జోనల్ ఉత్తర్వులు 33 జిల్లాలకు వర్తిస్తాయి. 2018 ఎన్నికల తరువాత ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటుచేశారు. జోగులాంబ జోన్లో ఉన్న వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లో కలిపారు.
వీటన్నింటికి సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణలు ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఫైల్ పంపింది. దీన్ని పరిశీలించిన కేంద్రం సవరణ ఉత్తర్వులను ఆమోదిస్తూ గెజిట్ విడుదలచేసిన విషయం తెలిసిందే. ఫైల్పై సీఎం సంతకం చేసి గెజిట్ విడుదలవగానే నూతన జోనల్ వ్యవస్థ ప్రకారం రాష్ట్రంలో జరిగే నియామకాలన్నీ తెలంగాణ నిరుద్యోగ యువతకే లభిస్తాయి. త్వరలో ఉద్యోగాలభర్తీ కూడా చేపట్టనున్నారు. కొత్త జోనల్వ్యవస్థలో 95 శాతం స్థానిక రిజర్వేషన్లు, 5 శాతం ఓపెన్ క్యాటగిరీని పొందుపరిచారు. 5 శాతంలోనూ తెలంగాణ నిరుద్యోగ యువత పోటీపడవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో ఓపెన్ కోటా 20, 30, 40 శాతాలుగా ఉంచి తెలంగాణ యువతకు ఉద్యోగాలు దక్కకుండాచేశారు. దీంతో నియామకాల్లో తెలంగాణ యువతకే పూర్తిస్థాయిలో ఉద్యోగాలు దక్కేలా సీఎం కేసీఆర్ అన్నివర్గాలతో సుదీర్ఘంగా కసరత్తు చేసి, ఓపెన్ క్యాటగిరీని 5 శాతానికే పరిమితం చేశారు. దీంతో ఉద్యోగాలన్నీ తెలంగాణ నిరుద్యోగులకే దక్కనున్నాయి.