కరోనా కారణంగా కళాశాలలు మూతపడ్డాయి. వైరస్ వ్యాప్తితో ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి. ఇంట్లో ఉండలేక.. బయటకు వెళ్లలేక స్మార్ట్ఫోన్లలోనే కాలం గడుపుతున్నారు. పొద్దస్తమానం వీడియో గేమ్ను ఆడటమే పని. సరిగా తిండి తినేది లేదు, నిద్రపోయేది లేదు. వారిస్తే తల్లిద్రండులపై కోపం, అసహనం. పిల్లల ప్రవర్తనకు కారణమేంటో తెలియక తల్లిదండ్రుల్లో ఆందోళన. ఇదీ నేటి యువత పరిస్థితి. యుక్తవయస్సువారు మానసిక సంఘర్షణకు గురవుతున్నారని, కొవిడ్ నేపథ్యంలో అది మరింత ఎక్కువైందని వైద్యులు వివరిస్తున్నారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): సాధారణంగా యువత తమ అనుభూతులు, అభిప్రాయాలు, వ్యక్తిగత విషయాలను తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యుల వద్దకంటే స్నేహితులతోనే ఎక్కువగా పంచుకుంటారు. అదే సమయంలో జరిగే శారీరకమార్పులు వారివారి మానసిక ప్రవర్తనను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఈ దశలో కోపం, చిరాకు వంటి లక్షణాలు సహజంగానే ఎక్కువగా ఉంటాయి. కరోనా నేపథ్యంలో విద్యాలయాలు, కోచింగ్ సెంటర్లు మూతపడటంతో టీనేజర్లు స్నేహితులతో సన్నిహిత సంబంధాలకు దూరమవుతున్నారు. మరోవైపు సామాజికదూరం నిబంధనలతో కుటుంబీకుల ఆత్మీయ స్పర్శకూ నోచుకోవడం లేదు.
విద్యాలయాలు మూతపడిన నాటినుంచి యువత సోషల్ మీడియాతోనే కాలక్షేపం చేస్తున్నది. అందులో కరోనాకు సంబంధించిన వార్తలు ఎక్కువగా చూస్తుండటమూ వారి మానసికస్థితిపై ప్రభావం చూపుతున్నది. ఒకవైపు వయసురీత్యా వచ్చే మార్పు లు.. మరోవైపు ఆందోళన కలిగించే అంశాలతో తీవ్ర సంఘర్షణ కు గురవుతున్నారు. తల్లిదండ్రులు చిన్నచిన్న పనులు చెప్పినా.. గట్టిగా మందలించినా అసహనానికి గురవుతున్నారు. కొందరైతే తల్లిదండ్రుల మీదనే తిరగపడుతున్నారు. ఎక్కువకాలం ఇదే పరిస్థితి కొనసాగితే ఈ నెగిటివ్ ఎఫెక్ట్ మరింత పెరిగే అవకాశముందని మానసిక వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
వీడియో గేమ్లు, షేర్చాట్, ఫేస్బుక్, యూట్యూబ్ వంటివాటి తో గడుపుతున్న టీనేజర్లు ఎక్కువగా హిక్కోమోరి సిండ్రోమ్ బారి న పడుతున్నారని అధ్యయనాలు తెలుపుతున్నాయి. వీరు సమాజంతోపాటు, ఇతర వ్యక్తులతో కలవడానికి ఎంత మాత్రమూ ఇష్టపడరు. ఇంట్లోనే ఉంటూ ఏకాంత జీవనాన్ని కోరుకుంటారు. ఈ విధమైన లక్షణం నేరపూరిత ప్రవర్తనకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. యువత ఇంటర్నెట్కు బానిసవడంతో ఏకాగ్రత కోల్పోవ డం, వాస్తవిక జీవితంతో పూర్తిగా దూరమ టం, నిద్రలేమి, ఆహా రం సరిగా తీసుకోకపోవడం, దృష్టి, వెన్నెముక సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు.
ఆత్మనిర్బర్ భారత్లో భాగంగా కేంద్ర మానవ వనరుల మంత్రి త్వ శాఖ మనోదర్పణ్ వెబ్సైట్ పేజీని ఏర్పాటుచేసింది. సైకాలజిస్టులు, మానసిక వైద్యనిపుణులతో మానసిక సమస్యలు ఎదుర్కొనే టీనేజర్లకు సలహాలు, సూచనలతోపాటు కౌన్సెలింగ్ను కూడా ఇప్పిస్తున్నది. ఇందుకోసం జాతీయ స్థాయిలో 844 844 0632 టోల్ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తెచ్చింది.
సాధారణంగానే యుక్తవయస్సు పిల్లలు మానసిక సమస్యలతో బాధపడుతుంటారు. శారీరక మార్పుల ను అర్థం చేసుకోలేక, ఏ విషయంపై స్పష్టతలేక ఆందోళనకు గురవుతుంటారు. అలాంటివారు ఎక్కువగా స్నేహితులు, చదువు, ఆటపాటలతో వాటినుంచి ఉపశమనం పొందుతారు. అయితే విద్యాలయాలు మూతతో స్నేహితులు, ఆటపాటలులేక మానసికం గా మరింత కుంగిపోతున్నారు. సోషల్మీడియాను ఎక్కువగా వినియోగిస్తున్నది టీనేజర్లే. అందులో వచ్చే కరోనా కథనాలను చూస్తూ మరింత భయభ్రాంతులకు గురవుతున్నారు. అందుకే వారిపై ప్రత్యేకశ్రద్ధ అవసరం. ప్రణాళికాబద్ధంగా పనులను అప్పగిస్తూ వారి మనసు ఇతర విషయాలపైకి పోకుండా చూడాలి. అవసరమైతే కౌన్సెలింగ్ ఇప్పించాలి. – డాక్టర్ పరికిపండ్ల అశోక్, సైకాలజిస్టు