ప్రాజెక్టుల నిర్మాణం, ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ నిధులను విడుదల చేసి నీటిపారుదలశాఖ కార్యదర్శి ఆధీనంలో బడ్జెట్ ఉంచుతాం. సీజన్కు ముందే గేట్లు, కాలువల మరమ్మతులు పూర్తిచేసి సిద్ధంగా ఉంచాలి. కాళేశ్వరంలో బటన్ వత్తినమంటే చివరి ఆయకట్టు దాకా ఎక్కడా ఆటంకం లేకుండా నీళ్లు పొలాలకు పారాలె.
వేలకోట్లు ఖర్చుచేసి ప్రాజెక్టులు కడుతున్నం. వాటిని రైతు సంక్షేమానికి వినియోగించే వ్యూహాత్మక విధానాలను అవలంబించాలె. ప్రాణహితలో నీటి లభ్యతను అర్థం చేసుకుంటూ.. వచ్చిన నీటిని వచ్చినట్టే ఎత్తిపోసి కాళేశ్వరం రాడార్లో ఉన్న చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు నింపుకోవాలె. రోహిణి కార్తె ప్రారంభమైన నేపథ్యంలో నారుమడులకూ నీటిని అందించాలె.
హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): రైతు పండించే పంట రైతుకు మాత్రమే చెందదు.. అది రాష్ట్ర సంపదగా మారుతుందని గ్రహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. రాష్ట్ర రెవెన్యూకు, అభివృద్ధికి వెన్నుదన్నుగా నిలిచేస్థాయికి తెలంగాణ వ్యవసాయం చేరుకున్నదని పేర్కొన్నారు. కరోనా మొదటివేవ్ సమయంలో రాష్ట్ర జీఎస్డీపీలో వ్యవసాయానిదే 17% వాటా ఉన్నదని చెప్పారు. కాళేశ్వరానికి ప్రాణహిత వరద ప్రారంభంకాగానే నీటిని ఎత్తిపోసి పైనుంచి చివరిదాకా అన్ని చెరువులు, రిజర్వాయర్లు, కాలువలను నింపుకోవాలని సూచించారు. రోహిణికార్తెలోనే నారుమళ్లు సిద్ధం చేసుకుంటే మంచిదనే విశ్వాసంతో రైతులు ఉంటారని.. ఆ నాటికి నారుకు కూడా నీళ్లు అందించేలా ఇరిగేషన్శాఖ సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. నీటిపారుదలశాఖకు ప్రత్యేకంగా రూ.700 కోట్ల బడ్జెట్ను సిద్ధంగా ఉంచుతున్నామని చెప్పారు. జూన్ చివరినాటికి మొదటిదశ చెక్డ్యాంల నిర్మాణం పూర్తికావాలని, నల్లగొండ జిల్లా నెల్లికల్లు లిఫ్ట్ ఇరిగేషన్ అంచనాలను పూర్తిచేసి వెంటనే టెండర్లకు సిద్ధం కావాలని ఆదేశించారు. కృష్ణాబేసిన్లో ప్రభుత్వం ఇటీవల నిర్మించ తలపెట్టిన లిఫ్టులు, గోదావరిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల పురోగతి, వానకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో కాలువల మరమ్మతులు తదితర అంశాలపై సీఎం కేసీఆర్ మంగళవారం ప్రగతిభవన్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. గోదావరి, కృష్ణా బేసిన్లలో నిర్మిస్తున్న చిన్నా పెద్దా ప్రాజెక్టులన్నిటి పనుల పురోగతిని పేరుపేరునా రివ్యూ చేశారు. సాధ్యమైనంత త్వరలో వాటిని వినియోగంలోకి తెచ్చేందుకు అనుసరించాల్సిన కార్యాచరణను అధికారులకు వివరించారు. సాగునీటి ప్రాధాన్యం తెలంగాణకు ఎంతగా అవసరమున్నదో కూలంకషంగా విశదీకరించారు.
చెరువులు నిరంతరం నిండుకుండల్లా
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ వరప్రదాయనిగా మారిన నేపథ్యంలో.. వానకాలం సీజన్ ప్రారంభం కాగానే నీటిని ఎత్తిపోసి, పైనుంచి చివరి ఆయకట్టుదాకా అన్ని చెరువులు, రిజర్వాయర్లు, చెక్డ్యాంలను నింపుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఇప్పటికే 90% చెరువులు, కుంటలు నిండి ఉండటంతో భూగర్భ జలాలు పెరిగాయని.. తద్వారా బోర్లల్లో నీళ్లు పుష్కలంగా లభిస్తున్నాయని చెప్పారు. రోహిణి కార్తె ప్రారంభంలోనే నారుమడి సిద్ధం చేసుకుంటే వరిపంటకు చీడపీడల నుంచి రక్షణ ఉంటుందని, అధిక దిగుబడి వస్తుందని విశ్వాసంతో రైతులు ఉంటారని.. ఈ నేపథ్యంలో నారుమడి సిద్ధం చేసుకునేనాటికే నీటిని అందించడానికి ఇరిగేషన్శాఖ సంసిద్ధం కావాలని సూచించారు.
జూన్ 20 తర్వాత ప్రాణహిత ఉధృతం
‘వేలకోట్లు ఖర్చుచేసి సాగునీటి ప్రాజెక్టులు కడుతున్నాం. వాటిని రైతు సంక్షేమానికి వినియోగించేలా వ్యూహాత్మకంగా విధానాలను అవలంబించాలి. ప్రాణహితలో నీటి లభ్యతను, అది ప్రవహించే తీరును అర్థం చేసుకోవాలి. జూన్ 20 తర్వాత ప్రాణహిత ప్రవాహం ఉధృతంగా మారుతుంది. అప్పడు వచ్చిన నీటిని వచ్చినట్టే ఎత్తిపోసి కాళేశ్వరం రాడార్లో ఉన్న చెరువులు, కుంటలు, రిజర్వాయర్లను నింపుకోవాలి. కాలువల మరమ్మతులు కొద్దిపాటి కొరవలు మిగిలి ఉన్నాయి. వాటిని సత్వరమే పూర్తిచేసుకొని, ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్ చేపట్టాలి’ అని సీఎం కేసీఆర్ చెప్పారు.
జూన్ 30 కల్లా మొదటిదశ చెక్డ్యాంలు
వానకాలం సీజన్లో చెరువులు, కుంటలు, వాగులు, చెక్డ్యాంలను నింపడమే ప్రథమ ప్రాధాన్యంగా భావించాలని సీఎం కేసీఆర్ ఇంజినీర్లకు సూచించారు. నాలుగువేల కోట్లుపెట్టి నిర్మిస్తున్న చెక్డ్యాంలు నీటిని నిల్వచేస్తూ అద్భుతమైన ఫలితాలు అందిస్తున్నాయని తెలిపారు. 50 వేల చెరువులను నిరంతరం నిండుకుండల్లా ఉంచుకోవాలని, 30 జూన్ వరకు మొదటిదశ చెక్డ్యాంలు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఎల్లంపల్లి నుంచి దుమ్ముగూడెం దాకా అక్టోబర్ నెలాఖరు వరకు నీటి లభ్యత ఉంటుందని, వెంటవెంటనే నీటిని ఎత్తిపోసి చెక్డ్యాంలు, చెరువులు, కుంటలు నింపుకోవడం ద్వారా రెండో పంటకు నీటి నిల్వలతోపాటు భూగర్భ జలాలు పెరుగుతాయని చెప్పారు. కృష్ణాబేసిన్లో కూడా ఇదే విధానాన్ని అవలంబించాలని సూచించారు. అదే సందర్భంలో తాగునీటికి లోటురాకుండా చూసుకుంటూ రిజర్వాయర్లలో కనీస నీటిమట్టాన్ని కొనసాగించాలని చెప్పారు. మిషన్ భగీరథ అధికారులతో సమన్వయం చేసుకుంటూ రిజర్వాయర్లలో ఎండీడీఎల్ మెయింటెన్ చేయాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు.
ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండొద్దు
నిరంతరం లైవ్లో, డైనమిక్గా ఉండే ఇరిగేషన్శాఖలో ఏ ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండరాదని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. ఎప్పటికప్పుడు అర్హులకు ప్రమోషన్లు ఇస్తూ ఖాళీలను వెంటవెంటనే భర్తీ చేయాలని సూచించారు. ఇరిగేషన్శాఖకు ఉన్న ప్రత్యేక అవసరాల దృష్ట్యా నియామక ప్రక్రియను బోర్డుద్వారా సొంతంగా నిర్వహించుకునే విధానాన్ని అమలుచేస్తామని తెలిపారు. కిందినుంచి పైస్థాయి దాకా ఖాళీల నివేదికను వెంటనే అందజేయాలని ఈఎన్సీ మురళీధర్రావును ఆదేశించారు. కాలువల నిర్వహణ కోసం త్వరలో లష్కర్లు, జేఈల నియామకాన్ని చేపడుతామని సీఎం తెలిపారు.
వారం రోజుల్లో నెల్లికల్లు టెండర్లు
నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో దేవరకొండ నుంచి కోదాడ వరకు ప్రభుత్వం ఇప్పటికే నిర్మించతలపెట్టిన అన్ని లిఫ్టు పథకాల నిర్మాణ అంచనాలను (ఎస్టిమేట్స్) జూన్ 15 వరకు పూర్తిచేసి, టెండర్లు వేయడానికి సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించి ఇరిగేషన్ అధికారులతో సమన్వయ బాధ్యతలను మంత్రి జగదీశ్రెడ్డి తీసుకోవాలని సూచించారు. ఏ లిఫ్టుకు ఆ లిఫ్టు ప్రకారం అంచనాలను వేర్వేరుగా తయారుచేసి, అన్నింటికీ ఒకేసారి టెండర్లు పిలవాలని చెప్పారు. సదర్మాట్ బరాజ్ నిర్మాణం పనుల పురోగతిపై సీఎం ఆరాతీశారు.
కోటి ఎకరాల మాగాణంగా.. కృషి ఫలించింది
‘తెలంగాణ ఉద్యమం సాగునీరు ప్రధాన లక్ష్యంతో సాగింది. ఒక అవగాహనతో రాష్ట్రంపట్ల చిత్తశుద్ధితో పోరాడినం. తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చుకోవాలని చేసిన కృషి ఫలించింది. కోటికిపైగా ఎకరాలను సాగులోకి తెచ్చుకుంటున్నాం. ఈ నేపథ్యంలో డబ్బులకు వెనకాడబోం. సాగునీటి ప్రాజెక్టుల ఖర్చులో తెలంగాణ దేశంలోనే అగ్రగామి. కరోనా నేపథ్యంలో కలిగే అసౌకర్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా అధిగమిస్తాం. ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులను సమకూరుస్తాం. సాగునీరు, వ్యవసాయం సహా అన్ని రంగాల్లో తెలంగాణ స్వరూపం పూర్తిగా మారిపోయింది. దానికనుగుణంగా అధికారులు పనివిధానాన్ని మార్చుకోవాలి. ఓఅండ్ఎంపై జూన్ మొదటివారంలో ఇంజినీర్ల వర్క్షాప్ నిర్వహించాలి. ఇంజినీరింగ్ పనుల ప్రతిపాదనలను రూపొందించే ముందే జాగ్రత్తగా ఎస్టిమేషన్లు రూపొందించాలి’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సమావేశంలో మంత్రులు జగదీశ్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ఎమ్మెల్సీలు శేరి సుభాష్రెడ్డి, ఎం శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, హన్మంత్షిండే, శానంపూడి సైదిరెడ్డి, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్కుమార్, సీఎం సెక్రటరీ స్మితాసబర్వాల్, ఈఎన్సీ మురళీధర్రావు, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్పాండే, ఈఎన్సీలు హరిరామ్, వెంకటేశ్వర్లు, సలహాదారు పెంటారెడ్డి, కాళేశ్వరం తదితర ప్రాజెక్టుల చీఫ్ఇంజినీర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రూ.700 కోట్లు కేటాయించాం
కాలువల మరమ్మతులు తదితర అవసరాల కోసం ఇరిగేషన్శాఖకు రూ.700 కోట్లు కేటాయించామని సీఎం కేసీఆర్ తెలిపారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ కాలువలు, ప్రాజెక్టుల ఓఅండ్ఎం కోసం కోటి రూపాయలు కూడా కేటాయించలేదని గుర్తుచేశారు. ప్రాజెక్టుల నిర్మాణం, ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్ కింద ఆర్థికశాఖ నుంచి నిధులు విడుదలచేసి.. నీటిపారుదలశాఖ కార్యదర్శి ఆధీనంలో బడ్జెట్ అందుబాటులో ఉంచుతామని చెప్పారు. సీజన్కు ముందే గేట్ల మరమ్మతులు, కాల్వల మరమ్మతులు పూర్తిచేసి సిద్ధంగా ఉంచాలని, కాళేశ్వరంలో బటన్ వత్తినం అంటే చివరి ఆయకట్టు దాకా ఎటువంటి ఆటంకం లేకుండా పొలాలకు నీళ్లు చేరాలని పేర్కొన్నారు.
ధాన్యం దిగుబడిలో రెండో పెద్దరాష్ట్రం
ఇరిగేషన్శాఖ కృషితో తెలంగాణ సాగునీటిరంగం, వ్యవసాయరంగం ముఖచిత్రం మారిపోయిందని.. ఒక్క కాళేశ్వరం ద్వారానే నేడు 35 లక్షల ఎకరాల్లో రెండు పంటలను పండించేస్థాయికి చేరుకున్నామంటే ఆషామాషీ కాదని కేసీఆర్ పేర్కొన్నారు. ధాన్యం దిగుబడిలో పంజాబ్ తర్వాత రెండో పెద్ద రాష్ట్రంగా అవతరించామని చెప్పారు. ‘ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు తెలంగాణ వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసిన ఫలితంగా ఇక్కడి రైతులు రూ.50 వేల కోట్లు ఖర్చుచేసి, 30 లక్షల బోర్లు వేసుకున్నారు. భార్య మెడమీది పుస్తెలమ్మి వ్యవసాయం చేసిన దీనస్థితి. స్వరాష్ట్రంలో కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల కారణంగా భూగర్భ జలాలు పెరిగి, తొవ్వుకున్న బోర్లు నేడు పొంగి పొర్లుతున్నాయి. ప్రభుత్వం ఉచితంగా నాణ్యమైన కరెంటు సరఫరా చేస్తుండటంతో సమృద్ధిగా పంటలు పండిస్తున్నారు. తెలంగాణ సాధించుకున్నప్పుడు ఒక్క టీఎంసీకి కూడా దిక్కులేదు. నేడు గోదావరి మీద కట్టుకున్న ప్రాజెక్టుల్లో నదీగర్భంలోనే 100 టీఎంసీల నీటిని నిల్వచేసుకొనే స్థాయికి చేరుకున్నాం’ అని సీఎం వివరించారు.
రాష్ట్ర రెవెన్యూకు రైతులే దన్ను
రైతు పండించే పంట రైతుకు చెందేది మాత్రమే కాదని, అది రాష్ట్ర సంపదగా మారుతుందనే విషయాన్ని గ్రహించాలని సీఎం కేసీఆర్ సూచించారు. మొదటిదశ కరోనాకాలంలో రైతు పండించిన పంటద్వారా 17% ఆదాయం అందించి, రాష్ట్ర జీఎస్డీపీలో తెలంగాణ వ్యవసాయం భాగం పంచుకున్నదని తెలిపారు. రాష్ట్ర రెవెన్యూకు వెన్నుదన్నుగా నిలిచే స్థితికి తెలంగాణ వ్యవసాయం అభివృద్ధి చెందిందన్నారు. తెలంగాణ వ్యవసాయం దేశాన్నే ఆశ్చర్యపరిచే స్థాయికి చేరుకున్నదని తెలిపారు.
దేవాదుల వరంగల్ జిల్లాకే అంకితం
ఎస్సారెస్పీ పునరుజ్జీవం ద్వారా సూర్యాపేట, తుంగతుర్తి చివరి ఆయకట్టుదాకా నీటికొరత లేకుండా చేశామని సీఎం కేసీఆర్ తెలిపారు. హుస్నాబాద్, పాత మెదక్, ఆలేరు, భువనగిరి, జనగామకు మల్లన్నసాగర్ వరంలా మారనున్నదని అన్నారు. వచ్చే ఏడాది జూన్ కల్లా సీతమ్మసాగర్ నిర్మాణం పూర్తవుతుందని, ఈ ప్రాజెక్టు పూర్తయితే ఖమ్మం జిల్లా బంగారుతునకగా మారుతుందని తెలిపారు. దేవాదుల ప్రాజెక్టును నూటికి నూరుశాతం వరంగల్ జిల్లాకే అంకితం చేస్తామని చెప్పారు. ఇదేవిధంగా మిగతా జిల్లాల్లోనూ కృష్ణా, గోదావరి బేసిన్లలో సాగునీటిని అందించే ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణ వ్యూహాన్ని ఖరారు చేయాలని సూచించారు. సంగారెడ్డి జిల్లా సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్టు పనుల పురోగతిని సీఎం అడిగి తెలుసుకున్నారు. సత్వరం డీపీఆర్లు తయారు చేయించాలని ఆదేశించారు. మల్లన్న సాగర్ మిగిలిన పనులను వేగవంతం చేయాలని చెప్పారు. ఆర్మూర్, బాల్కొండ లిఫ్టుల పనులు, నల్లగొండ జిల్లాలోని బునాదిగానికాల్వ, ధర్మారెడ్డి కాల్వ, పిలాయిపెల్లి కాల్వల పనుల పురోగతిని సీఎం అడిగి తెలుసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిస్థితి, వాటి పనుల పురోగతిపై ఆరా తీశారు. స్టేటస్ రిపోర్టు అందచేయాలని ఆదేశించారు. సమ్మక్క బరాజ్ నిర్మాణం పనులు పూర్తయిన నేపథ్యంలో సాంకేతిక బృందాన్ని పంపి, దాని నిర్వహణకు సంబంధించి ఇంజినీర్లకు ట్రైనింగ్ ఇవ్వాలని ఆదేశించారు. మేజర్ లిఫ్టులు, పంపులు ఉన్న దగ్గర స్టాఫ్క్వార్టర్ల నిర్మాణం చేపట్టి, తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. కాంట్రాక్టర్ల క్యాంపుల కోసం భూసేకరణ నిలిపివేయాలని చెప్పారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం మూడో పంప్హౌజ్ పనులు సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. మైలారం ట్యాంకునుంచి సూర్యాపేట తుంగతుర్తి దిక్కుగా కాళేశ్వరం నీటిని తీసుకుపోయే డీబీఎం 71 కాలువ లైనింగ్ పనులను చేపట్టాలని సూచించారు. హల్దీవాగు ప్రాజెక్టు కాలువ ఆధునీకరణ పనులను చేపట్టి, 7 వేల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించాలని, తూర్పు అదిలాబాద్లోని మంచిర్యాల, కాగజ్నగర్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో 2 లక్షల ఎకరాలకు నీరందించేందుకు నిర్మించనున్న లిఫ్టుల కోసం ఆయకట్టు సర్వే చేపట్టడానికి వాప్కోస్ సంస్థతో సంప్రదింపులు జరపాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.