యాదాద్రి భువనగిరి జిల్లా.. తుర్కపల్లి మండలం.. గోపాలపురం గ్రామం.. ఒకప్పుడు వానే ఎవుసానికి ఆధారం. బోర్లు వేస్తే ఆగిఆగి పోసే నీళ్లతో అరకొరగా సాగే సేద్యం.. మబ్బులకోసం ఎప్పుడూ ఎదురు చూపులే.. ఏ తృణధాన్యాల వంటి పంటలతోనే ఎవుసం సాగేది. అదీ చేయలేనివాళ్లు.. ఊరొదిలి.. పట్నంపోయి.. కూలోనాలో చేసుకున్నోళ్లే.. తమ ఊరికి నీళ్లొస్తయని ఊరోళ్లు కూడా అనుకోలే. బతుకులు బాగయితని నమ్మకమే లేకుం.. కానీ రావనుకొన్న నీళ్లు రానే వచ్చినయి.. ఎక్కడో కిందికి పోతున్న గోదారమ్మను కాళేశ్వరుడు వెనక్కు లాక్కొస్తే..
కొండపోచమ్మతల్లి.. తెలంగాణ భూముల దాహార్తిని తీరుస్తున్నది. ఇది ఒక గోపాలపురం కథే కాదు.. రాష్ట్రంలోని అనేక గ్రామాల ఆనందహేల.
(గంజి ప్రదీప్కుమార్) యాదాద్రి భువనగిరి, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిన్న మొన్నటివరకు కరువుతో తల్లడిల్లిన పల్లె అది. ఉరకలెత్తే నీటి ప్రవాహాలు లేక.. పంటలు పండేవి కావు. ఈ నేపథ్యంలో కొండపోచమ్మ జలాశయం పెను మార్పు తీసుకొచ్చింది. కాళేశ్వర జలాలను బీడుభూములకు మళ్లించింది. సీఎం కేసీఆర్ భగీరథ ప్రయత్నంతో ఎక్కడో పారుతున్న గోదారమ్మ.. యేడాది కాలంగా కొండపోచమ్మ సాగర్ ద్వారా ఆలేరు నియోజకవర్గంలో రైతాంగానికి కొత్త బతుకునిచ్చింది. మెట్ట, మాగాణి అన్న తేడా లేకుండా రైతులు బంగారు పంటలు పండించుకుంటున్నారు. ఒక్క పంటతోనే సరిపెట్టుకునే రోజులు కనుమరుగై నేడు రెండు పంటలను చీకు చింతలేకుండా పండించుకుంటున్నారు. ఎవుసానికి జీవంపోసిన కాళేశ్వర జలాలు సబ్బండ వర్గాల ప్రజానీకంలో సంతోషాన్ని నింపాయి
సాగే కాదు.. ఉపాధీ పెరిగింది
గ్రామంలో 290 వరకు ఉన్న కుటుంబాలు వ్యవసాయధారంగానే జీవిస్తున్నాయి. గ్రామంలోని 2,199 ఎకరాల విస్తీర్ణంలో 497 ఎకరాల్లో అడవి విస్తరించి ఉన్నది. 1,228 ఎకరాలు సాగుకు యోగ్యంగా ఉండగా.. 2019-20 వానకాలంలో 300 ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. గోదావరి నీళ్లు వచ్చాక ఈ ఏడాది వానకాలంలో సాగు విస్తీర్ణం రెండింతలకు పెరిగి 727 ఎకరాల్లో పంట లు సాగవుతున్నాయి. సాగుకు యోగ్యమైన మిగ తా భూముల్లోనూ పండించేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఒకప్పుడు కంది, మక్కజొన్న వంటి పంటలు సాగుచేసిన రైతులు.. ఇప్పుడు కూరగాయలు, పండ్ల తోటలనూ సాగుచేస్తున్నారు. దిగుబడులు ఊహించని విధంగా వస్తున్నాయని సంబరపడిపోతున్నారు. పొట్టచేతబట్టుకుని ఊరొదిలిపోయిన కుటుంబాలు సొంతూళ్లకు వచ్చి సాగు చేసుకుంటున్నాయి. పెరిగిన మత్స్య సంపదతో ఓవైపు ముదిరాజ్ కుటుంబాలు.. ఉన్న ఊర్లోనే చేతినిండా పని తో కూలీలు సంబరపడుతున్నారు. చాలామంది పాత ఇండ్లను కూలగొట్టుకుని కొత్తవి కట్టుకొంటున్నారు. పది, ఇంటర్, డిగ్రీ చదువులను మధ్యలో మానేసినవారు.. గృహిణులు ఎవరూ ఖాళీగా ఉం డకుండా అటు వ్యవసాయం.. ఇటు ఫార్మా కంపెనీల్లో పనిచేస్తూ నెలకు పదిహేను వేలకు తక్కువ కాకుండా సంపాదించుకొంటున్నారు. పోలీసు కేసు ల సంఖ్య జీరో స్థాయికి పడిపోయింది.
ఊరంతా ట్రాక్టర్లే
సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగడంతో వ్యవసాయం, వ్యవసాయ అనుంబంధ రంగాలతోపాటు ఇతర పనుల కోసం ట్రాక్టర్ల డిమాండ్ పెరిగింది. ఏడాదిక్రితం వరకు ఐదారు ఉన్న ట్రాక్టర్లు.. నేడు పదిహేనుకు పెరిగి ఊరంతా ట్రాక్టర్ల సందడే కన్పిస్తున్నది. వీటికితోడు నాలుగు డోజర్లు వచ్చి చేరినయ్. నిన్న, మొన్నటివరకు డ్రైవర్లుగా పనిచేసినవాళ్లు నేడు ఓనర్లుగా మారారు.
పచ్చగా మారిన ఊరు
గోదావరి జలాల రాక మునుపు ఆలేరు నియోజకవర్గంలోని బొమ్మలరామారం, తుర్కపల్లి మండలాల్లో వర్షాధార వ్యవసాయమే సాగేది. రైతులు చిరు, తృణ ధాన్యాలను మాత్రమే సాగు చేసేవారు. తుర్కపల్లి మండలంలోని గోపాలపురం. ఎత్తైన గుట్టల ప్రాంతంలో మేడ్చల్, సిద్దిపేట జిల్లాల సరిహద్దున ఈ గ్రామం ఉంటుంది. కొండపోచమ్మ నుంచి తొమ్మిది కిలోమీటర్ల మేర కాలువలో ప్రయాణించే జలాలు యాదాద్రి భువనగిరి జిల్లాలో తొలుత తాకేది ఈ గ్రామాన్నే. కాల్వ ద్వారా ఇక్కడి చెరువుల్లోకి చేరిన గోదావరి నీళ్లు బీడు భూములకు సాగు కళను తీసుకొచ్చాయి. గ్రామంలో అతిపెద్ద చెరువు అయిన పోచమ్మ చెరువుతోపాటు మరో ఐదు చిన్నచిన్న చెరువులు, కుంటలు అన్ని కాలాల్లోనూ నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. పెరిగిన సాగుతో ఎటుచూసినా కనుచూపుమేరలో పచ్చదనమే కనిపిస్తున్నది.
ఒకప్పుడు డ్రైవర్.. నేడు ఓనర్
ఫోటోలో కన్పిస్తున్న ఈ యువకుడి పేరు మలబోయిన రవి. వయ సు 20 ఏండ్లు. ఒకప్పుడు ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేసిన రవి నెలక్రితం ట్రాక్టర్ కొనుక్కుని ఓనర్ అయ్యాడు. ఇంటర్ చదివిన రవి స్థానికంగా ఉన్న ఫార్మా కంపెనీలో కొద్దిరోజులు పనిచేసి మానేశాక తనకున్న ఎకరంలో వ్యవసాయం చేసుకొంటున్నాడు. ఊర్లో వ్యవసాయ పనులు ఊపందుకుని ట్రాక్టర్కు పెరిగిన డిమాండ్తో ఉపాధి లభించింది. గోపాలపురంలో ఇలా ఎంతోమంది యువకులకు గోదావరి జలాలు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాయి.