పశ్చిమబెంగాల్లో నాలుగో విడత ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. శనివారం కూచ్బిహార్లోని సితాల్కుచి ప్రాంతంలో కేంద్ర బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు సీఐఎస్ఎఫ్ బలగాలపై దాడిచేసి, తుపాకులు లాక్కునేందుకు యత్నించారని.. దీంతో స్వీయరక్షణ కోసమే కాల్పులు జరిపినట్టు ఓ పోలీస్ అధికారి తెలిపారు. సితాల్కుచిలోనే మరో ఘటనలో ఓ యువకుడిని దుండుగులు కాల్చిచంపారు. ఈ ఘటనలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హింసాకాండపై సీఐడీతో దర్యాప్తు జరిపిస్తామన్నారు. మరోవైపు, హింసకు తృణమూల్ కాంగ్రెసే కారణమని ప్రధాని మోదీ ఆరోపించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.
కోల్కతా, ఏప్రిల్ 10: పశ్చిమబెంగాల్ రక్తసిక్తమైంది. శనివారం నాలుగో విడుత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ హింసాత్మకంగా మారింది. కూచ్బిహార్ జిల్లా రణరంగాన్ని తలపించింది. కేంద్ర బలగాల కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. సీతల్కుచి ప్రాంతంలో స్థానికులు సీఐఎస్ఎఫ్ బలగాలపై దాడి చేసి వారి తుపాకులు లాక్కునేందుకు ప్రయత్నించినట్టు ఓ పోలీస్ అధికారి తెలిపారు. దీంతో స్వీయ రక్షణ కోసం బలగాలు కాల్పులు జరిపినట్టు వెల్లడించారు. మృతిచెందిన నలుగురూ తమ మద్దతుదారులేనని తృణమూల్ కాంగ్రెస్ తెలిపింది. మాతాబంగా పోలింగ్ కేంద్రం వద్ద ఉదయం ఈ ఘటన జరిగినట్టు సీఐఎస్ఎఫ్ వర్గాలు తెలిపాయి. దీంతో ఆ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం (ఈసీ) వెల్లడించింది. మరోవైపు, సీతల్కుచి నియోజకవర్గంలోనే అంతకుముందు ఓ పోలింగ్ బూత్లో యువ ఓటరును దుండగులు కాల్చిచంపారు. ఈ హత్య వెనుక బీజేపీ హస్తముందని తృణమూల్ ఆరోపించింది. అయితే బాధితుడు తమ పోలింగ్ ఏజెంట్ అని, తృణమూల్ కార్యకర్తలే అతడిని హత్య చేశారని బీజేపీ ప్రత్యారోపించింది. ఇంకోవైపు, వేర్వేరు ఘటనల్లో ఒక టీఎంసీ అభ్యర్థి, నలుగురు బీజేపీ అభ్యర్థులపై దాడులు జరిగాయి. కాగా, శనివారం 5 గంటల సమయానికి 76.16% పోలింగ్ నమోదైనట్టు ఈసీ తెలిపింది.
కాల్పుల ఘటనపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఓటు వేసేందుకు క్యూలైన్లో నిల్చున్న వారిపై కేంద్ర బలగాలు కాల్పులు జరిపాయని ఆరోపించారు. దీనిపై ఆదివారం నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఘటనపై సీఐడీతో దర్యాప్తు చేయిస్తామన్నారు. హింసకు తృణమూల్ కాంగ్రెసే కారణమని ప్రధాని మోదీ ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు.
ప్రజలు పోలింగ్ కేంద్రానికి వెళ్లకుండా 50-60 మంది మూకలు అడ్డుకుంటుండంతో భద్రతా బలగాలు జోక్యం చేసుకున్నాయని, ఈ క్రమంలో చోటుచేసుకున్న ఘర్షణలో ఓ చిన్నారికి గాయమైందని అధికారులు తెలిపారు. దీంతో ఆ మూకలు క్విక్ రెస్పాన్స్ టీమ్ వాహనాలపై దాడికి తెగబడినట్టు వివరించారు. బలగాలు గాల్లోకి కాల్పులు జరిపి ఆ మూకలను చెదరగొట్టాయని తెలిపారు. గంట తర్వాత సుమారు 150 మంది 186వ పోలింగ్ కేంద్రానికి చేరుకుని పోలింగ్ సిబ్బందిపై దాడిచేశారని చెప్పారు. సీఐఎస్ఎఫ్ జవాన్ల తుపాకులను లాక్కునేందుకు యత్నించారన్నారు. దీంతో స్వీయ రక్షణ కోసం కాల్పులు జరిపామన్నారు.