హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి విద్యార్థులు సాధించిన గ్రేడ్లను ప్రకటించారు. ఈ ఏడాది 2,10,647 మంది 10కి పది గ్రేడ్ పాయింట్లు సాధించారు. రెగ్యులర్ సహా గతంలో ఫెయిల్ అయిన విద్యార్థులు మొత్తం 5,21,073 మంది పాసయ్యారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో పరీక్షలు నిర్వహించే అవకాశం లేకపోవటంతో ఈ ఏడాది ఎస్సెస్సీ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశాలతో అందర్నీ పాస్ చేసిన అధికారులు ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ)-1 మార్కుల ఆధారంగా గ్రేడ్లు రూపొందించారు. గ్రేడ్ల వివరాలను www.bse. telangana.gov. in, results.bsetelangana.org నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని మంత్రి సబిత పేర్కొన్నారు. ఈ ఏడాది హాల్టికెట్లు జారీ చేయకముందే పరీక్షలు రద్దయ్యాయి. మెమోలపై మాత్రం హాల్టికెట్ నంబర్లు ముద్రించనున్నారు.
ఈ ఏడాదే అత్యధికం
ఎస్సెస్సీ బోర్డు చరిత్రోలనే ఇప్పటి వరకు 10కి 10 జీపీఏ పొందిన విద్యార్థులు ఈ ఏడాదే అత్యధికంగా ఉండటం గమనార్హం. మొత్తం విద్యార్థుల్లో 40 శాతానికి పైగా విద్యార్థులు ఈ ఏడాది పదికి పది జీపీఏను సొంతం చేసుకొన్నారు. గతేడాది 1,41,382 మందికి 10 జీపీఏ వచ్చింది. గతేడాది నాలుగు ఎఫ్ఏల ఆధారంగా ఫలితాలు ఇవ్వగా, ఈ ఏడాది ఒక్క ఎఫ్ఏ పరిగణనలోకి తీసుకోవటంతో 10కి 10 జీపీఏ పొందిన వారి సంఖ్య పెరిగినట్టు అధికారులు తెలిపారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల విద్యార్థులు లక్ష మంది ఉండగా, ప్రైవేటు విద్యార్థులు 1.21 లక్షల మంది ఉన్నారు.
10/10 రికార్డులివీ..
11,445 స్కూళ్లకు 535 స్కూళ్లు వందశాతం 10 జీపీఏ సాధించాయి.
వందశాతం 10 జీపీఏ సాధించిన పాఠశాలల్లో ఒక్క మోడల్ స్కూల్, ఆశ్రమ పాఠశాల కూడా లేకపోవటం గమనార్హం.
జిల్లాలవారీగా తీసుకొంటే హైదరాబాద్లో అత్యధికంగా 22,035 మంది, మేడ్చల్ మల్కాజిగిరి 20,556, రంగారెడ్డి 20,119 మంది విద్యార్థులు 10కి 10 జీపీఏను సాధించారు.
సీఎం నిర్ణయం మేరకే అంతా పాస్
కరోనా నేపథ్యంలో పరీక్షలు నిర్వహణ వీలుకానందున సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విద్యార్థులందరినీ పాస్ చేశాం. 2020-21 విద్యాసంవత్సరంలో భౌతిక తరగతుల నిర్వహణ సాధ్యంకాకపోవటంతో డిజిటల్ తరగతులను నిర్వహించిన తొలి రాష్ట్రం తెలంగాణ. విద్యారంగం పట్ల సీఎం కేసీఆర్కు ఉన్న అంకితభావానికి ఇదే నిదర్శనం. విద్యార్థులు మెమోలను సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా పొందవచ్చు. మెమోల్లో తప్పలుంటే ఎస్సెస్సీ బోర్డుకు పంపించాలి. విద్యార్థులు పై తరగతుల్లో మంచి కోర్సులను ఎంపిక చేసుకొని, భవిష్యత్తును బంగారుమయం చేసుకోవాలి.