భారత అమెరికన్ వైద్యులు ముందుకు
ప్రాజెక్టు మదద్ పేరిట స్వచ్ఛంద కార్యక్రమం
తెలంగాణ నుంచే ప్రారంభం
న్యూయార్క్, మే 23: సెకండ్ వేవ్లో కరోనా మహమ్మారి గ్రామాల్లో ఉద్ధృతంగా విస్తరిస్తున్న వేళ గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులకు అవసరమైన సలహాలు, సూచనలు, సహాయం చేసేందుకు అమెరికాలోని భారత సంతతి వైద్యులు, ఉద్యోగులు ఓ బృందంగా ఏర్పడి స్వచ్ఛందంగా ‘ప్రాజెక్టు మదద్’ పేరిట ఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భారత వైద్యులు కూడా భాగస్వాములు కానున్నారు. వీరు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీలకు, వైద్యులకు కొవిడ్ చికిత్సపై సూచనలు చేయనున్నారు. కొవిడ్ లక్షణాల గుర్తింపు, స్వల్ప లక్షణాలు ఉంటే ఇంటి దగ్గరే చికిత్స, టీకాపై సమాచారం ఇవ్వడం, రోగులు అనవసరంగా ఎక్కువ మందులు వేసుకోకుండా చూడటం లాంటి వాటిపై శిక్షణ ఇవ్వనున్నారు. దవాఖానల్లో బెడ్ల అందుబాటుపై ఎప్పటికప్పుడు వైద్యులకు సమాచారం అందిస్తారు. తొలుత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఈ మదద్ బృందం పనిచేయనున్నది. ఈ టీమ్ మండల స్థాయి ఆర్ఎంపీ సంఘాలతో సమన్వయమై పనిచేస్తుంది. వారంలో రెండు రోజులు జూమ్ ప్లాట్ఫాం ద్వారా వైద్యులతో సమావేశమై సూచనలు చేస్తుంది. మదద్ బృందం ఇప్పటివరకు 150 మంది ఆర్ఎంపీలతో కొవిడ్ చికిత్సపై సమాచారం ఇచ్చింది.