హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణపైనా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. చుక్క నీరు కూడా వృథాకాకుండా, లీకైపోకుండా జాగ్రత్తలకు సిద్ధమైంది. అందుకోసం సాగునీటి పారుదలశాఖను పునర్వ్యవస్థీకరించింది. ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్ విభాగాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఇంజినీర్ ఇన్ చీఫ్ను కూడా నియమించింది. ఆ విభాగమే ఇప్పుడు ప్రాజెక్టుల నిర్వహణకు ప్రత్యేక చర్యలను చేపడుతున్నది. నీటి ప్రాజెక్టులు, కాలువలు, చెరువుల తూములకు సంబంధించి గేట్లు, షట్టర్లు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి.
ఆయా గేట్లలో చిన్న లోపం తలెత్తినా నీరు లీకవుతుంది. నీటి నిల్వ ఉండదు. గేట్ల నిర్మాణం కూడా సంక్లిష్టతలతో, ఖర్చుతో కూడుకున్నది. గేట్ల నిర్మాణానికి సంబంధించిన ప్రామాణిక కొలతలు ఉంటే తప్ప తిరిగి అదే రీతిలో గేట్లను తయారుచేయలేం. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం భారీ, మధ్యతరహా ప్రాజెక్టులకు సంబంధించి 1000 గేట్లు ఉండగా, కాలువలు, తూములకు సంబంధించి 15వేలకు పైగా గేట్లు ఉన్నట్టు అంచనా. ఉమ్మడి పాలనలో అవి పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. చాలాచోట్ల తుప్పు పట్టిన దుస్థితి. పాత గేట్లను తొలగించి కొత్త గేట్లు, షట్టర్లను అమర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం భావించినా సంబంధించిన డ్రాయింగ్స్ లేకపోవటంతో ఆలస్యమైంది. ప్రస్తుతం ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్టులకు సంబంధించిన గేట్లు, కాలువలపై ఉన్న షట్టర్లపై ప్రత్యేక దృష్టిసారించారు. పాత ఆనకట్టలకు అమర్చిన గేట్ల కొలతలు, ప్రమాణాలతో డ్రాయింగ్లను గీయిస్తున్నారు.
ఏ ప్రాజెక్టుపై ఎలాంటి గేట్లను అమర్చారు, వాటి కొలతలు తదితర వివరాలను సేకరిస్తూ ప్రత్యేకంగా డాటా తయారుచేస్తున్నారు. ఈ డ్రాయింగ్స్తో భవిష్యత్తులో గేట్లు దెబ్బతిన్నా క్షేత్రస్థాయికి వెళ్లకుండానే వాటిని తయారుచేయించే సౌలభ్యం కలుగనున్నది. ఇదిలా ఉండగా, గేట్ల డ్రాయింగ్లను సేకరించడమే కాకుండా ప్రాజెక్టుల నుంచి నీరు ఆయకట్టుకు అందుతున్నదా? లేదా? అని క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు లష్కర్లను నియమించాలని అధికారులు భావిస్తున్నారు. 3,300 మంది అవసరం ఉంటారని అంచనా. మొత్తంగా లక్షల కోట్లు వెచ్చించి నిర్మిస్తున్న ప్రాజెక్టులను అంతే పకడ్బందీగా నిర్వహించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతుండటం అభినందనీయం.
నాగార్జునసాగర్లో విద్యుదుత్పత్తి నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రధాన జల విద్యుత్తు కేంద్రంలో గత నెల 29న ప్రారంభించిన విద్యుదుత్పత్తిని శనివారం నిలిపివేశారు. 12 రోజుల్లో 30 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసినట్టు జెన్కో అధికారులు తెలిపారు. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 590 (312.50 టీఎంసీలు) అడుగులకు గాను శనివారం నాటికి 529.20 అడుగుల వద్ద నీరు నిల్వ ఉన్నది. ఎస్ఎల్బీసీ ద్వారా తాగు నీటికి 1,000 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు.