హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ మొదటి రోజు విజయవంతమైంది. లాక్డౌన్ నిబంధనలు బుధవారం ఉదయం 10 గంటల నుంచి అమలులోకి వచ్చాయి. ఉదయం ఆరు గంటలకే నిత్యావసర వస్తువుల దుకాణాలు, మార్కెట్లు తెరుచుకున్నాయి. దీంతో ప్రజలు తమకు కావాల్సిన నిత్యావసరాలు, కూరగాయలు, పాలు తదితరాలు కొనుక్కొన్నారు. మద్యంప్రియుల కోసం వైన్షాపులను కూడా ఉదయం ఆరు గంటలకే తెరిచారు. నాలుగు గంటలపాటు తెరుచుకొన్న షాపులు, మార్కెట్లు అన్నీ ఉదయం 10 గంటలకు మూతపడ్డాయి. అప్పటివరకూ రద్దీగా ఉన్న రోడ్లు, మార్కెట్ ప్రదేశాలు నిర్మానుష్యమైపోయాయి.
పక్కాగా లాక్డౌన్ నిబంధనల అమలు
లాక్డౌన్ అమలులోకి వచ్చిన వెంటనే ప్రజలు స్వచ్ఛందంగా ఇండ్లకే పరిమితం కాగా, పోలీసులు రోడ్లపైకి వచ్చారు. ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టారు. వాహనాల తనిఖీలు చేప ట్టారు. అనవసరంగా రోడ్లపై వచ్చిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చి ఇండ్లకు పంపించారు. రాష్ట్రవ్యాప్తంగా రాకపోకలు స్తంభిం చాయి. మెట్రో రైళ్లు, బస్సులు 10 గంటల తర్వాత ఆగాయి.
లాక్డౌన్తో సొంత ఊళ్లకు పయనం
లాక్డౌన్ ప్రకటన వెలువడటంతోనే ప్రజలు మంగళవారంనుంచే సొంత ఊళ్లకు పయనయయ్యారు. హైదరాబాద్- విజయవాడ హైవేపై వాహనాలు క్యూ కట్టాయి. ఉదయమే రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ నెలకొన్నది. లాక్డౌన్ తొలిరోజు కావడంతో ఆర్టీసీ అధికారులు కొన్ని ప్రాంతాలకు అత్యవసర బస్సు సర్వీసులను నడిపించారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో 33 శాతం హాజరు
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఎమర్జెన్సీ కింద డిక్లేర్చేసిన విభాగాలు మినహా సచివాలయంతోపాటు అన్ని శాఖల్లో ఉద్యోగులు 33 శాతం మంది మాత్రమే హాజరయ్యారు. కార్యాలయాలకు సందర్శకులను నిలిపివేశారు. రిజిస్ట్రేషన్లశాఖ భూముల క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్లను 10 రోజులపాటు నిలిపి వేసింది. తాసిల్దారు కార్యాలయాలు, రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సందర్శకుల తాకిడి నిలిచిపోయింది.
ఎమర్జెన్సీ విధులకు ఆటంకాలు లేకుండా
ఎమర్జెన్సీ విధులు నిర్వర్తిస్తున్న వారికి ఎలాంటి ఆటంకాలు లేకుండా విధులకు హాజరయ్యేలా పోలీసులు సహకరించారు. దవాఖానలు, మెడికల్ షాపులు, మెడికల్ ఏజెన్సీలు, శానిటరీ సిబ్బంది, నీరు, విద్యుత్తు సరఫరా సిబ్బంది ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా విధులకు హాజరయ్యారు. నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా జరుగుతున్నది. అలాగే నీటి సరఫరాకు ఎక్కడా అంతరాయం రానివ్వలేదు. వైద్యులు, వైద్య సిబ్బంది అంతా సాఫీగా విధులకు హాజరయ్యారు. అలాగే వ్యాక్సిన్ రెండో డోస్ వేసుకోవడానికి వెళ్లే ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలుగలేదు.
నిరాటంకంగా వ్యవసాయ పనులు
వ్యవసాయం, దాని అనుబంధ పనులన్నీ నిరాటంకంగా కొనసాగాయి. ధాన్యం కొనుగోళ్లు యథావిధిగా జరిగాయి. ధాన్యం మిల్లింగ్, ఎఫ్సీఐకి తరలింపు, విత్తనాల ప్రాసెసింగ్ తదితర వ్యవసాయ, దాని అనుబంధ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగాయి.
ఖాళీగా రోడ్లు
లాక్డౌన్ నేపథ్యంలో ఉదయమే బయటకు వచ్చిన పౌరులు 9.30 గంటలలోపే తిరిగి తమ ఇండ్లకు చేరుకొన్నారు. దీంతో ప్రధాన రోడ్లన్నీ బోసిపోయి కనిపించాయి. జిల్లా, మండల కేంద్రాల్లో ప్రజలు ఏ ఒక్కరు బయటకు రాలేదు. వాహనాల రాకపోకలు లేక రహదారులన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి.