హైదరాబాద్, జులై 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఈ ఏడాది రికార్డుస్థాయిలో ధాన్యం కొనుగోలు చేసినట్టు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రీజియన్ జనరల్ మేనేజర్ అశ్వినీకుమార్గుప్తా తెలిపారు. రాష్ట్రం నుంచి 140.82 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించినట్టు చెప్పారు. ఇందులో ఒక్క యాసంగి సీజన్లోనే 92.07 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు తెలిపారు. వానకాలం సీజన్లో 48.75 లక్షల టన్నులు సేకరించినట్టు వివరించారు. సోమవారం హాకాభవన్లోని ఎఫ్సీఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంతోపాటు, ఇతర రాష్ర్టాల్లోనూ బాయిల్డ్ రైస్ (దొడ్డు బియ్యం) అవసరాలు తగ్గిపోయాయని తెలిపారు. గతంలో తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ర్టాలకు తెలంగాణలో పండిన దొడ్డుబియ్యం పంపిచేవాళ్లమని.. అయితే ఇప్పుడు ఆ రాష్ర్టాల్లో వారికి సరిపోయే స్థాయిలో బాయిల్డ్రైస్ ఉత్పత్తి అవుతున్నదని చెప్పారు. ఈ నేపథ్యంలో రైతులు దొడ్డురకం సాగును తగ్గించి.. వరిలో సన్నాలను పండించాలని సూచించారు.
ఈ ఏడాది తెలంగాణ నుంచి తమిళనాడు, కర్ణాటక, కేరళ, పశ్చిమబెంగాల్, బీహార్, జార్ఖండ్ రాష్ర్టాలకు 47 లక్షల టన్నుల బియ్యంను సరఫరాచేసినట్టు తెలిపారు. ఎఫ్సీఐకి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) అందించేందుకు మిల్లర్లకు సెప్టెంబర్ 30వ తేదీ వరకు గడువు ఇచ్చినట్టు తెలిపారు. కష్టకాలంలో పేదలను ఆదుకొనేందుకు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజన (పీఎంజీకేఏవో) పథకం కింద కేంద్రప్రభుత్వం అందిస్తున్న ఉచితరేషన్ బియ్యం పంపిణీని మరో ఐదునెలలు పొడిగిస్తున్నట్టు తెలిపారు. ఈ పథకం కింద తెలంగాణలో 1.92 మంది పేదలకు లబ్ధి చేకూరుతున్నదని వివరించారు.