హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పంచాయతీరాజ్శాఖకు మరో జాతీయ పురస్కారం దక్కింది. 2021 సంవత్సరానికి ఈ-పంచాయతీ పురస్కార్ను దక్కించుకున్నది. కేంద్ర పంచాయతీరాజ్శాఖ ఎకనమిక్ అడ్వయిజర్ డాక్టర్ బిజయ కుమార్ బేహార ఈ విషయాన్ని వెల్లడించారు. పంచాయతీల్లో ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ(ఐసీటీ)ని తెలంగాణ పంచాయతీరాజ్శాఖ విజయవంతంగా అమలుచేస్తున్నదని ప్రకటించారు. ఇటీవలే కేంద్రం ప్రకటించిన పురస్కారాల్లో తెలంగాణ పంచాయతీలు, ఎంపీపీ, జడ్పీలు పన్నెండింటిని దక్కించుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఒక్కో క్యాటగిరీలో మూడు చొప్పున బహుమతులను ప్రకటించగా.. రెండో క్యాటగిరిలో తెలంగాణ మొదటి బహుమతికి ఎంపికైందని రాష్ర్టానికి రాసిన లేఖలో తెలిపారు. రాష్ట్రంలో ఇంటి నిర్మాణ అనుమతులు, ఇంటి పన్నులు, ట్రెడ్ లైసెన్సులు సహా అనేక పనులను ఈ-పంచాయతీ ద్వారా అమలుచేస్తున్నారు. దీంతో ఇండ్ల యజమానులు, లబ్ధిదారులకు తమకు అవసరమైన సేవలను సులువుగా పొందే అవకాశం దక్కింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇంటి అనుమతుల కోసం దాదాపు 30 వేల మంది ఈ-పంచాయతీలో దరఖాస్తు చేసుకున్నారు. ట్రెడ్ లైసెన్సులు, ఇంటి పన్నును చెల్లించారు. రాష్ర్టంలో ఈ-పంచాయతీ పనితీరును పరిశీలించిన కేంద్రం ఉత్తమ పురస్కారాన్ని ప్రకటించింది.
రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మరో పురస్కారాన్ని దక్కించుకోవడంపై ఆ శాఖ మంత్రి ఎర్రబెల్లి హర్షం వ్యక్తంచేశారు. కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే ఇవి సాధ్యమవుతున్నాయని పేర్కొన్నారు. స్వరాష్ట్రంలో గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యాన్ని సాధించేందుకు సీఎం కేసీఆర్ పల్లెప్రగతి కార్యక్రమాన్ని తీసుకొచ్చారని తెలిపారు. గ్రామాల్లో ఈ-పంచాయతీతో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందిస్తున్నారని వివరించారు.