హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పొట్లపల్లి కేశవరావు (60) ఆకస్మికంగా కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ దవాఖానలో వారం రోజులుగా చికిత్స పొం దుతున్నారు. బ్రెయిన్ ట్యూమర్తోపాటు ఇతర ఆరోగ్య రుగ్మతలున్న జస్టిస్ కేశవరావు సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. మధ్యాహ్నమే జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో ఆయన పార్థివ దేహానికి అధికార లాంఛనాల మధ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి. రాష్ట్ర అటవీ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ప్రభుత్వం తరఫున అంత్యక్రియలకు హాజరయ్యారు. జస్టిస్ కేశవరావుకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. భార్య ఉష ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఫైనాన్స్ మేనేజర్గా పని చేస్తున్నారు. జస్టిస్ కేశవరావు మృతిపట్ల సీఎం కే చంద్రశేఖర్రావు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమాకోహ్లీ, ఇతర న్యాయ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. కేశవరావు మృతికి సంతాప సూచకంగా హైకోర్టుతోపాటు రాష్ట్రవ్యాప్తంగా కోర్టులేవీ పనిచేయలేదు.
వరంగల్ వాసి..
జస్టిస్ కేశవరావు 1961, మార్చి 29న వరంగల్ జిల్లాలో పొట్లపల్లి ప్రకాశరావు, జయప్రద దంపతులకు జన్మించారు. ప్రకాశరావు మారెటింగ్ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి పదవీ విరమణ పొందారు. వరంగల్ కాకతీయ డిగ్రీ కళాశాలలో సైన్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కేశవరావు.. 1986లో కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి లా పట్టా పొందారు. అదే ఏడాది ఏప్రిల్లో బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. తొలుత వరంగల్లో న్యాయవాది పింగళి సాంబశివరావు దగ్గర జూనియర్గా చేరి ఆ తరువాత 1991లో ప్రాక్టీస్ను హైదరాబాద్కు మార్చారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి అదనపు అడ్వకేట్ జనరల్ దేశాయ్ ప్రకాశ్రెడ్డి కార్యాలయానికి అనుబంధంగా ప్రభుత్వ న్యాయవాదిగా 1998 అక్టోబర్ నుంచి 2001 అక్టోబర్ వరకు పనిచేశారు. 2010 మార్చిలో సీబీఐ ప్రత్యేక స్టాండింగ్ కౌన్సిల్ గా నియమితులై 2016 ఏప్రిల్ వరకూ కొనసాగారు. 2015లో జీహెచ్ఎంసీ, కులీ కుతుబ్షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి కూడా స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేశారు. 2017 సెప్టెంబర్ 21న ఆయన హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తెలంగాణ హైకోర్టు ఆవిర్భావం తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో సీనియార్టీలో ఐదో స్థానంలో ఉన్నారు.
తెలంగాణ న్యాయవ్యవస్థకే లోటు: సీజేఐ
న్యాయమూర్తిగా జస్టిస్ కేశవరావు అందించిన సేవలు కొనియాడదగినవని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జస్టిస్ కేశవరావుకు నివాళులర్పిస్తూ.. ఆయన 35 ఏండ్లుగా న్యాయ వ్యవస్థతో అనుబంధం కలిగి ఉన్నారని, న్యాయవాదిగా, న్యాయమూర్తిగా గొప్ప సేవ చేశారని తెలిపారు. జస్టిస్ కేశవరావు మృతి ప్రధానంగా తెలంగాణ న్యాయవ్యవస్థకు తీరని లోటని అన్నారు. జస్టిస్ కేశవరావు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
హిమా కోహ్లీ నివాళి
జస్టిస్ కేశవరావు మరణవార్త తెలిసిన వెంటనే హైకోర్టు ప్రధాన న్యామూర్తి హిమాకోహ్లి, తెలంగాణ, ఏపీ హైకోర్టులకు చెందిన ఇతర న్యాయమూర్తులు హబ్సిగూడలోని ఆయన నివాసానికి నివాళలర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, సీపీ అంజనీకుమార్, పలువురు న్యాయమూర్తులు, ఉప్పల్ తహసీల్దార్ గౌతమ్కుమార్ కూడా కేశవరావు భౌతికకాయానికి నివాళులర్పించారు.
మంత్రులు, ప్రముఖుల సంతాపం
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేశవరావు మృతిపట్ల శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, నిరంజన్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ హబ్సిగూడలోని కేశవరావు నివాసానికి వెళ్లి నివాళులు అర్పించారు. కాకతీయ యూనివర్సిటీలో చదువుకున్న రోజుల నుంచి కేశవరావు తనకు ఆప్తుడని తెలిపారు. పలువురు రిజిస్ట్రార్లు, న్యాయశాఖ కార్యదర్శి, యశోద దవాఖానల చైర్మన్ దేవేందర్రావు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, పలువురు ఉన్నతాధికారులు నివాళులు అర్పించి సంతాపం తెలియజేసిన ప్రముఖుల్లో ఉన్నారు. హైకోర్టు రిజ్రిస్ట్రార్ జనరల్ వెంకటేశ్వర్రెడ్డి, రాష్ట్ర లోకాయుక్త సీవీ రాములు, నగరంలోని పలువురు జిల్లా జడ్జీలు జస్టిస్ కేశవరావుకు భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.
అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జస్టిస్ కేశవరావు పార్థివదేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ స్వయంగా హాజరై అధికార లాంఛనాలను పర్యవేక్షించారు. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఇతర పోలీస్ అధికారులు హాజరయ్యారు.
సూటిగా..సౌమ్యంగా.. సహాయకారిగా..
అందరినీ కలుపుకునిపోయే మంచి మనిషిగా జస్టిస్ కేశవరావుకు పేరుంది. న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుకుని న్యాయమూర్తిగా ఎదిగినప్పటికీ ఒకే తీరుగా ఆయన వ్యవహారశైలి ఉండేదని పలువురు సహచరులు గుర్తుచేసుకున్నారు. నిబద్ధత, నిజాయితీలకు మారుపేరుగా ఉండేవారని, సౌమ్యంగా సూటిగా మాట్లాడేవారని, సహాయం చేసే మనస్థతత్వం ఆయనదని కొనియాడారు. జస్టిస్ కేశవరావు మృతికి పలువురు న్యాయవాదులు నివాళులు అర్పించారు.
సీఎం కేసీఆర్ సంతాపం
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేశవరావు మరణం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. న్యాయమూర్తిగా ఆయన పేదలకు అందించిన సేవలను సీఎం స్మరించుకున్నారు. కేశవరావు కుటుంబసభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కేశవరావు భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎస్ సోమేశ్కుమార్ను ఆదేశించారు. జస్టిస్ కేశవరావు మృతిపట్ల సంతాపం తెలిపిన గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్.. దేశం, తెలంగాణ రాష్ట్రం గొప్ప న్యాయమూర్తిని కోల్పోయాయని పేర్కొన్నారు.