హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): ఏపీ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను ఆపివేయాలన్న తమ ఆదేశాలను ఆ రాష్ట్రం పట్టించుకోవటంలేదని తెలంగాణ ప్రభుత్వం జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) దృష్టికి తీసుకెళ్లింది. ఆదేశాలను ఉల్లంఘించి ఏపీపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని ఎన్జీటీలో సోమవారం పిటిషన్ వేసింది. ఏపీ సర్కారు అనుమతి లేకుండా ప్రాజెక్టు పనులు చేపట్టడమేగాక, క్షేత్రస్థాయిలో కేఆర్ఎంబీ, కేంద్ర పర్యావరణ, అటవీశాఖల అధికారులు ప్రాజెక్టు పనులను పరిశీలించకుండా అడ్డుకొంటున్నదని ఆక్షేపించింది. ఈ నేపథ్యంలో రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను స్వయంగా ఎన్జీటీ బృందమే సందర్శించాలని అభ్యర్థించింది. అందుకు కావాల్సిన హెలికాప్టర్, వాహనాలు తదితర వసతులను సమకూర్చుతామని తెలిపింది. పిటిషన్లో కేంద్ర అటవీ పర్యావరణ జల్శక్తి శాఖల కార్యదర్శులు, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి, ఎస్పీఎంఎల్ ఇన్ఫ్రా లిమిటెడ్ ఎండీలను ప్రతివాదులుగా చేర్చింది. ఈ పిటిషన్ను ఎన్జీటీ ఈ నెల 12వ తేదీన విచారించనున్నది.
అడుగడుగునా ఉల్లంఘనే..
ఏపీ ప్రభుత్వం కేంద్ర జల్శక్తి, పర్యావరణ అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ పనులను చేపడుతున్న విషయం తెలిసిందే. దీనిపై గతంలో తెలంగాణ నుంచి ఎన్జీటీలో పిటిషన్ దాఖలైంది. దానిని విచారించిన చెన్నై ఎన్జీటీ బెంచ్ గతేడాది మే 20న ఒక ఉమ్మడి కమిటీని ఏర్పాటుచేసింది. ఏపీ ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఉన్నాయా? ప్రాజెక్టు వల్ల ఏపీ, తెలంగాణకు సమన్యాయం జరుగుతున్నదా? శ్రీశైలం జలాలు ఇరు రాష్ర్టాలకు చెందిన అంశమైనందున కేంద్ర జల్శక్తి, పర్యావరణ అనుమతులతోపాటు మరేవిధమైన అనుమతులు అవసరం అనే అంశాలను తేల్చాలని ఆదేశించింది. కమిటీ నివేదికను సమర్పించాల్సి ఉన్నది. ఆ కమిటీ నివేదిక వచ్చేవరకూ ప్రాజెక్టు పనులను చేపట్టొద్దని ఏపీని ఎన్జీటీ ఆదేశించింది. ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు కావాల్సిన ముంద స్తు ఏర్పాట్లు మాత్రమే చేసుకోవాలని స్పష్టంచేసింది. ఆ తర్వాత ఏపీ నివేదిక సమర్పించగా, దానిపై తెలంగాణ ప్రభుత్వం పలు అభ్యంతరాలు లేవనెత్తింది. దాంతో పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి పనులను చేపట్టకూడదని ఏపీకి ఎన్జీటీ స్పష్టమైన ఆదేశాలిచ్చింది.
ఆ ఉత్తర్వులను ఏపీ బేఖాతర్ చేస్తూ ముందస్తు ఏర్పాట్ల పేరిట ఏకంగా టెండర్లు ఖరారు చేసి ఎస్పీఎంఎల్ ఇన్ఫ్రా లిమిటెడ్ కంపెనీకి పనులను అప్పగించింది. ఆ సంస్థ ప్రాజెక్టు పనులను భారీ యంత్రాలు, వేల మంది కార్మికులతో యుద్ధప్రాతిపదికన నిర్వహిస్తున్నది. ఇదే విషయాన్ని కృష్ణానదీ యాజమాన్య బోర్డు దృష్టికి తెలంగాణ ప్రభుత్వం తీసుకెళ్లింది. ఫిబ్రవరి 24, జూన్ 9, 21న కేఆర్ఎంబీకి లేఖలు రాసింది. క్షేత్రస్థాయి పరిస్థితులను వివరించి ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు కమిటీ వేయాలని కోరింది. కానీ ఆ దిశగా చర్యలు చేపట్టడంలో కేఆర్ఎంబీ విఫలమైందని, ఏపీ ఉద్దేశపూర్వకంగా ఎన్జీటీ ఉత్తర్వులను బేఖాతర్ చేస్తున్నదని తెలంగాణ తన పిటిషన్లో పేర్కొంది. ఈ మేరకు సాగునీటి పారుదలశాఖ ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ రజత్కుమార్ ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు.
పిటిషన్లోని కీలకాంశాలు