యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘కిరాయి కారు నడుపుతూ చాలీచాలని సంపాదనతో బతుకుతున్నం. ఇక సొంతగా వాహనం కొనుక్కుంటా’.. ‘పొట్టచేతబట్టుకుని హైదరాబాద్లో సెంట్రింగ్ కూలీగా ఉన్నా.. ఇకపై ఓనర్ని అయిత’.. ‘ఇక మా జీవితాలు బాగుపడతయి.. కొత్త జీవితం మొదలు పెడుత’.. ఇవీ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి దళితుల మాటలు! బుధవారం సాయంత్రం నుంచే ఇక్కడి దళిత కుటుంబాలకు ఫోన్ మెసేజ్లు వెల్లువెత్తాయి. గురువారం నాటికి 66 దళిత కుటుంబాల ఖాతాల్లో రూ.పది లక్షల చొప్పున రూ.6.60 కోట్లు జమ అయ్యాయి. మిగతా పది కుటుంబాల ఖాతాల్లో ఒకటి రెండు రోజుల్లో డబ్బులు జమకానున్నాయి. వాసాలమర్రి గ్రామంలో అర్హులైన దళితులందరికీ దళితబంధు పథకం వర్తింపజేస్తానని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేర్చారు.
దళితుల ఖాతాల్లో దళితబంధు నిధులు జమచేసి ప్రభుత్వ నిబద్ధతను నిరూపించారు. గత నెల 4న దత్తత గ్రామం వాసాలమర్రిలోని మొత్తం 76 దళిత కుటుంబాలకు దళితబంధు పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జమ అయిన నిధుల్లో రూ.10 వేల చొప్పున మొత్తం రూ.6.60 లక్షలతో రక్షణ నిధిని ఏర్పాటు చేస్తారు. దళిత బంధు పథకం అమలు తీరుతెన్నుల కోసం ప్రత్యేకాధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి నేతృత్వంలో అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించారు. గ్రామంలో ఉన్న 76 దళిత కుటుంబాల ఇండ్లకు వెళ్లి యూనిట్లకు సంబంధించి సమగ్ర వివరాలు సేకరించారు. 108 యూనిట్ల ఏర్పాటుకు లబ్ధిదారులు సుముఖత వ్యక్తంచేశారు. క్షేత్రస్థాయి పర్యటనకు తీసుకెళ్లి డెయిరీకి సంబంధించిన వాటిపై అవగాహన కల్పించారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు వచ్చి చేరింది. తమ ఖాతాల్లో రూ.10 లక్షలు జమ అయినట్టు వచ్చిన సందేశాలను చూసుకొని లబ్ధిదారులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. దళిత వాడల్లో మరోసారి దండోరా మోగింది. బతుకమ్మ ఆటలతో సంబురాలు అంబరాన్నంటాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు నిర్వహించారు. గులాల్ చల్లుకుని, స్వీట్లు తినిపించుకుని తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఇచ్చిన నిధులను సద్వినియోగం చేసుకుంటామని పలువురు దళితులు పేర్కొన్నారు.
ఆటో డ్రైవర్గా కొత్త జీవితం మొదలుపెడుత..
కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్న. దళితబంధు నిధులతో ఆటో కొనుక్కుని కొత్త జీవితాన్ని మొదలుపెడత. నా కొడుకుకు సైతం భవిష్యత్తులో ఈ ఆటో ఉపయోగపడుతది.
ఒంటరి జీవితానికి ఆసరా..
నాకు కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు తొమ్మిదేండ్లుగా హైదరాబాద్లో ఆటో నడుపుతున్నాడు. కూతురు వేరే ఊరిలో సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నది. ఛిన్నాభిన్నమైన మా కుటుంబానికి దళితబంధు కొండంత భరోసానిస్తున్నది. పది లక్షల డబ్బుతో ఆటోను కొని కొడుకుకు ఉపాధి కల్పిస్తా. మిగిలిన డబ్బుతో బర్రెలు కొని కూతురుకు ఆసరా కల్పిస్తా. సీఎం కేసీఆర్ మేలును జన్మజన్మలకు మరువం.
-చిన్నూరి అన్నమ్మ
డ్రైవర్ నుంచి ఓనర్నైత
డిగ్రీ వరకు చదువుకొన్న త ర్వాత కొన్నాళ్లు కూలి పనులకు పోయిన. మూడేండ్ల నుంచి కారు అద్దెకు తీసుకొని నడుపుకొంటున్న. వచ్చే కొద్ది సంపాదనతో భార్య, ఇద్దరు పిల్లలను సాకడం కష్టంగా మారిం ది. దళితబంధు కింద ఖాతాల్లో డబ్బు జమ అయినట్లు బుధవారం రాత్రి 10 గంటలకు సెల్ఫోన్కు మెసేజ్ వచ్చింది. ఆ డబ్బుతో బొలెరో వాహనం కొనుక్కొని సొంతంగా నడుపుకుంటా.
సెంట్రింగ్తో సొంతూరిలోనే ఉపాధి..
నాకు ముగ్గురు కొడుకులు. ఒక కూతురు. కొడుకులు హైదరాబాద్కు వెళ్లి సెంట్రింగ్ కూలిచేస్తున్నారు. దళిత బంధు పది లక్షల నిధులతో ఉన్న ఊర్లోనే కొడుకులకు సెంట్రింగ్ పనులతో ఉపాధి కల్పించుకుంట. దీంతో మా జీవితాలు బాగుపడతాయి. ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. సీఎం కేసీఆర్ సార్కు సదా రుణపడి ఉంటాం.
కూతురు, అల్లుడికి కోళ్లఫారం పెట్టిస్తా
నాకు భార్య లేదు. కూతు రు, అల్లుడు నా దగ్గరే ఉంటున్నరు. బర్రె పాలమీదనే జీవ నం సాగుతున్నది. అల్లుడు సెం ట్రింగ్ పనులకు వెళ్తున్నారు. 10 లక్షల దళితబంధు నిధుల తో కోళ్లఫారం పెట్టి అల్లుడు, కూతురికి ఉపాధి కల్పిస్తా. మిగతా డబ్బుతో బోరు వేసుకుని ఎకరం ముప్పావు గుంట భూమిలో పంటలు పండించుకుంటా.