హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం కుడిగట్టులో విద్యుదుత్పత్తి కోసం అనుమతి కోరుతూ లేఖరాసిన ఏపీ ప్రభుత్వం తీరుపై, కేఆర్ఎంబీ వ్యవహారశైలిపై తెలంగాణ ప్రభుత్వం ఘాటుగా స్పం దించింది. ఒకవైపు అనుమతులు లేకుండానే కృష్ణాజలాలను అక్రమంగా తరలిస్తూ, మరోవైపు పూర్తిగా తన అజమాయిషీలోనే ఉన్న శ్రీశైలం కుడిగట్టు విద్యుత్తు కేంద్రం నుంచి కరెంట్ ఉత్పత్తికి అనుమతివ్వాలని ఏపీ కోరడం, దానిపై అభిప్రాయం తెలపాలని తెలంగాణ ప్రభుత్వానికి కేఆర్ఎంబీ లేఖ రాయడం విడ్డూరమని ఆక్షేపించింది. తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబీకి గురువారం లేఖ రాసింది. ఏపీ తీరును ఈఎన్సీ మురళీధర్ తీవ్రంగా తప్పుపట్టారు. పోతిరెడ్డిపాడునుంచి నీటిని అక్రమంగా నీటిని మళ్లిస్తూ బోర్డు ఎదుట మాత్రం ఏపీ.. లౌక్యం ప్రదర్శిస్తున్నదని చురకలంటించారు.
విద్యుదుత్పత్తికి మాకేం అభ్యంతరం లేదు
శ్రీశైలం కేవలం విద్యుత్తు ఉత్పత్తి కోసం నిర్మించిన ప్రాజెక్టు మాత్రమేనని, పునర్విభజనచట్టం ప్రకారం శ్రీశైలం కుడిగట్టు విద్యు త్తు కేంద్రం నిర్వహణ బాధ్యత పూర్తి గా ఏపీదేనని తెలంగాణ స్పష్టంచేసింది. కుడిగట్టు విద్యుత్తు కేంద్రం నుంచి ఏపీ ప్రభుత్వం కరెంటు ఉత్పత్తి చేసుకోవడంలో తమకె లాంటి అభ్యంతరం లేదని స్పష్టంచేసింది. అదేవిధంగా ప్రస్తుతం తెలంగాణలో ఎత్తిపోతల పథకాల నిర్వహణ, బోరుబావుల కిం ద వ్యవసాయానికి కరెంటు ఎంతో అత్యవసరమని, ఆ అవసరాలను తీర్చుకునేందుకు నాగార్జునసాగర్, పులిచింతల నుంచి కూడా పూర్తిస్థాయి విద్యుదుత్పత్తికి అవకాశం కల్పించాలని కోరింది.
బేసిన్ అవతల మళ్లింపును అడ్డుకోండి
బేసిన్ అవసరాలు తీరిన తర్వాతే బేసిన్ అవతలి ప్రాంతాలను నీటిని తరలించాలని బచావత్ ట్రిబ్యునల్ స్పష్టం చేసిందని తెలంగాణ గుర్తుచేసింది. అయినప్పటికీ జూలై 26 నాటికే హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ ద్వారా ఏపీ నీటిని తరలించడం మొదలుపెట్టిందని కేఆర్ఎంబీ దృష్టికి తీసుకెళ్లింది.ఎట్టిపరిస్థితుల్లో పోతిరెడ్డిపాడు నుం చి నీటి తరలింపునకు ఏపీకి అనుమతులు ఇవ్వవద్దని నొక్కిచెప్పింది. ప్రాజెక్టులవారీగా కేటాయింపులు పూర్తయ్యేవరకూకృష్ణా జలాలను 50ః50 నిష్పత్తిలోనే వినియోగించుకుంటామని, అదేతమకు అంగీకారమని మరోసారి కేఆర్ఎంబీ దృష్టికి తీసుకెళ్లింది.
ఏపీ చెప్పేవన్నీ అసత్యాలే: తెలంగాణ ఆగ్రహం
శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి కరెంటు ఉత్పత్తి చేయడంపై ఏపీ సర్కారు లేవనెత్తుతున్న అభ్యంతరాలన్నీ అసత్యాలేనని తెలంగాణ కొట్టిపారేసింది. అక్రమంగా బేసిన్ అవతలి ప్రాంతాలకు జలాలను తరలించుకుపోవాలని చూస్తున్నదని మండిపడింది. కరెంటు ఉత్పత్తి చేయడం వల్ల చెన్నై నగరానికి తాగునీటి సరఫరా ప్రభావం పడుతుందనే ఏపీ వాదన పూర్తిగా అసత్యమని, అయినా కావాలనే కేంద్రాన్ని, బోర్డును తప్పుదోవ పట్టిస్తున్నదని ఆక్షేపించింది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి సాగునీటిశాఖ ఈఎన్సీ మురళీధర్ గురువారం మరోలేఖను రాశారు. తెలంగాణ జెన్కో చేపట్టిన విద్యుత్ ఉత్పత్తిపై ఏపీ లేవనెత్తిన అభ్యంతరాలను తిప్పికొట్టారు. బోర్డు దృష్టికి పలు అంశాలను తీసుకెళ్లారు. శ్రీశైలం ప్రాజెక్టు జలవిద్యుదుత్పాదనకోసమేనని పునరుద్ఘాటించారు. 264 టీఎంసీల నీటిని నిల్వ చేసి, కరెంటు ఉత్పత్తి చేస్తూ ఆ నీటిని నాగార్జునసాగర్ ఆయకట్టు అవసరాలకు సరఫరా చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
760 అడుగుల నుంచి కూడా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకోవచ్చని 2012లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం జీవోను కూడా జారీ చేసిందని వెల్లడించింది. ఏపీ ఉదహరించిన 69, 107, 233, 3 జీవోలన్నీ కృష్ణా జలాలను అక్రమంగా బేసిన్ అవతలి ప్రాంతాలకు తరలించేందుకేనని ఆగ్రహం వ్యక్తంచేసింది. శ్రీశైలం నుంచి కరెంటు ఉత్పత్తి చేయడం వల్ల చెన్నై, రాయలసీమ తాగునీటి అవసరాలను తీర్చడంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఏపీ చేస్తున్న వాదనలు సత్యదూరమని కొట్టిపారేసింది. ఉత్పత్తి చేసిన విద్యుత్తును 50:50 నిష్పత్తిలో పంచుకోవాలని పునర్విభజన చట్టంలో ఎక్కడా లేదని స్పష్టం చేసింది. భౌగోళికంగా తెలంగాణకు ఎత్తిపోతల పథకాలు తప్ప వేరే మార్గం లేదని, అందుకు కరెంటు అత్యవసరమని, అందుకోసమే ఉత్పత్తి చేస్తున్నామని, దీనిపై ఏపీ అభ్యంతరాలు అర్థరహితం, అసత్యాలని పునరుద్ఘాటించింది.