మీలో వినూత్న ఆలోచనలు ఉన్నాయా? ఏదైనా సరికొత్త ఉత్పత్తిని సృష్టించాలనుకుంటున్నారా? అందుకు తగిన వేదికను తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేస్తున్నది. ఐటీ రంగంలో అనేక స్టార్టప్స్కు నెలవుగా భాసిల్లుతున్న టీ-హబ్ తరహాలో ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ రంగంలో టీ-వర్స్ను ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటుచేస్తున్నది. సృజనాత్మక ఆలోచనతో వచ్చి ఉత్పత్తిని అభివృద్ధి చేసుకొని వెళ్లగలిగేలా దీన్ని తీర్చిదిద్దుతున్నది. అన్నిరకాల మౌలిక సదుపాయాలు ఒకేచోట ఉండేలా ఐటీ కారిడార్లో దీన్ని నిర్మిస్తున్నది.
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 30 (నమస్తే తెలంగాణ): ఐటీ రంగానికి చిరునామాగా మారిన తెలంగాణను ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ ఉత్పత్తుల రంగంలోనూ అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నది. హార్డ్వేర్ రంగంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ‘టీ-వర్క్స్’ పేరుతో దేశంలోనే అతి పెద్ద ప్రోటో టైపింగ్ సెంటర్ను ఏర్పాటుచేస్తున్నది. 78 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న టీ-వర్క్స్లో 250 రకాల పరిశ్రమలకు అవసరమయ్యే అత్యాధునిక మౌలిక వసతులను, వివిధ రకాల ఉపకరణాలను అందుబాటులోకి తెస్తున్నది. వీటిలో 3డీ ప్రింటర్లు, లేజర్ కట్టర్లు, ప్రింటెడ్ సర్యూట్ బోర్డు తయారీ (పీసీబీ ప్యాబ్రికేషన్) వ్యవస్థలు, యంత్రాల నిర్వహణకు ఉపయోగించే సీఎన్సీ మెషీన్లు, పలు రకాల ఇతర పరికరాలు ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఉత్పత్తుల నమూనాల అభివృద్ధికి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు టీ-వర్క్స్లో ఉంటాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు), స్టార్టప్లు, ఆవిష్కర్తలు తమ ఆలోచనలకు రూపమిచ్చేందుకు ఇది ఎంతో ఉపయోగపడనుంది. కరోనా సమయంలోనూ ఈ భవనాన్ని శరవేగంగా నిర్మిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. మరోవైపు ఇక్కడికి రావాలనుకొంటున్న జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది.
మంత్రి కేటీఆర్ మానసపుత్రిక
ఐటీ రంగంలో స్టార్టప్స్కు గొప్ప వేదికగా టీ-హబ్ను ఏర్పాటుచేయించిన మంత్రి కేటీఆర్.. ఔత్సాహికులే నేరుగా వివిధ రకాల ఉత్పత్తులను తయారుచేసుకునేందుకు వీలుగా అంతర్జాతీయ ప్రమాణాలతో టీ-వర్క్స్కు శ్రీకారం చుట్టారు. ఐటీ కారిడార్లో దాదాపు రూ.44 కోట్ల వ్యయంతో 78 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటవుతున్న ఈ భవన నిర్మాణం పనులు 90 శాతం పూర్తయ్యాయి. ఇక మిగిలింది ఇంటీరియర్ పనులే, వీటిని కూడా త్వరగా పూర్తిచేసి జూన్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు టీ-వర్క్స్ ప్రతినిధులు తెలిపారు.
టీ-వర్క్స్ ప్రధాన ఉద్దేశాలివి..
హార్డ్వేర్ రంగంలో వినూత్న కార్యరూపం కల్పించి ఉత్పత్తుల తయారీకి సహకరించడం, పెట్టుబడిదారులు, సలహాదారులు, మార్గదర్శకులను ఆకర్షించడం, ఈ రంగం అభివృద్ధికి పరిశ్రమలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ శాఖలు ఏకమై పనిచేసేలా వీలుకల్పించాలన్న ధ్యేయంతో రాష్ట్ర ఐటీ శాఖ టీ-వర్క్స్ను ఏర్పాటుచేస్తున్నది. ఎలాంటి లాభాపేక్ష లేని సంస్థగా ఇది పనిచేస్తుంది. ఎలక్ట్రానిక్ రంగంలో పరిశ్రమలకు అనువైన వాతావరణాన్ని సృష్టించడం, హర్డ్వేర్ నమూనాల తయారీకి అత్యాధునిక సదుపాయాలు కల్పించడం, ఉత్పత్తుల అభివృద్ధి క్రమంలో స్టార్టప్స్ను ప్రోత్సహించడం, ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా నిపుణులైన మానవ వనరులను అభివృద్ధి చేయడం టీ-వర్క్స్ ప్రధాన ఉద్దేశాలు.
తక్కువ ధరలో వెంటిలేటర్లు
కరోనా బాధితులకు అవసరమయ్యే వెంటిలేటర్లను అంతర్జాతీయ ప్రమాణాలతో కేవలం రూ.30-50 వేల ధరకే టీ-వర్క్స్ రూపొందిస్తున్నది. ప్రస్తుతం వీటిని పలు దవాఖానల్లో కొవిడ్ చికిత్సకు వినియోగిస్తున్నారు. ఇలాంటి మరెన్నో ఉత్పత్తులను తయారు చేసేందుకు టీ-వర్క్స్ వేదికగా నిలవనుంది. ఇందుకోసం జాతీయ, అంతర్జాయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నది.
విడిభాగాల పంపిణీ సంస్థతో ఒప్పందం
హర్డ్వేర్ రంగంలో కొత్త ఆవిష్కరణలకు అవసరమైన ఎలక్ట్రానిక్ విడిభాగాలు, సెమీ కండక్టర్లు స్థానికంగా లభించడం లేదు. వీటి కోసం ఆవిష్కర్తలు విదేశీ తయారీదారులపై ఆధారడపతుండటంతో నాణ్యతా పరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వాటి దిగుమతిలో ఉన్న అవరోధాలు, కస్టమ్స్ సుంకాలతో తడిసి మోపెడవుతున్నది.ది. ఈ నేపథ్యంలోనే టీ-వర్క్స్ కోసం విడిభాగాల పంపిణీ సంస్థ మౌసర్ ఎలక్ట్రానిక్స్తో తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీంతో ప్రపంచస్థాయి విభాగాలను ఇక్కడకు తెచ్చుకునే అవకాశం కలుగుతుంది. రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈలు, స్టార్టప్స్, సృజనాత్మక ఆవిష్కర్తలకు ఇది ఎంతో ఉపకరిస్తుందని టీ-వర్క్స్ అధికారులు చెప్తున్నారు.