న్యూఢిల్లీ, మే 8: కరోనా రెండో దశ ఉద్ధృతితో దేశంలో ఆరోగ్య సంక్షోభం తీవ్రమవుతున్న నేపథ్యంలో దేశ అత్యున్నత న్యాయస్థానం స్వయంగా రంగంలోకి దిగింది. మహమ్మారి నియంత్రణ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని పలు దఫాలుగా తూర్పారబట్టిన సుప్రీంకోర్టు.. పరిస్థితులను చక్కదిద్దేందుకు నడుం బిగించింది. ఆక్సిజన్ అందక కరోనా రోగులు పిట్టల్లా రాలుతున్న దృశ్యాలు నిత్యకృత్యంగా మారడంతో.. రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య శాస్త్రీయంగా, హేతుబద్ధంగా, సమానరీతిలో ఆక్సిజన్ను పంపిణీ చేసే విధానాన్ని రూపొందించేందుకు 12 మంది సభ్యులతో జాతీయ టాస్క్ఫోర్స్ను ఏర్పాటుచేసింది. అలాగే కొవిడ్ చికిత్సకు అవసరమైన ఔషధాలకు కొరత ఏర్పడకుండా చూసేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా ఈ టాస్క్ఫోర్స్ సూచనలు చేయనున్నది. భవిష్యత్లో తలెత్తే అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ర్టాలకు సహకారం అందించనున్నది. మరోవైపు, ఆడిటింగ్ కోసం ప్రతి రాష్ట్రంలో, కేంద్రపాలిత ప్రాంతంలో సబ్ గ్రూప్లను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. దేశ రాజధాని ఢిల్లీకి సంబంధించిన సబ్ కమిటీలో ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా, మ్యాక్స్ హెల్త్కేర్కు చెందిన సందీప్ బుదిరాజాతోపాటు సంయుక్త కార్యదర్శి కంటే పై ర్యాంకు గల ఇద్దరు ఐఏఎస్ అధికారులు (ఒకరు ఢిల్లీ ప్రభుత్వం నుంచి, మరొకరు కేంద్రం నుంచి) సభ్యులుగా ఉంటారు. టాస్క్ఫోర్స్కు కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి కన్వీనర్గా వ్యవహరించనున్నారు.
వసరమైతే తనకు సహాయంగా అదనపు కార్యదర్శి కంటే పై స్థాయి అధికారిని నామినేట్ చేసుకోవచ్చు. కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎక్స్ అఫిషియో సభ్యుడిగా వ్యవహరిస్తారు. టాస్క్ఫోర్స్లోని ఇతర సభ్యులు.. డాక్టర్ బబతోష్ బిశ్వాస్, పశ్చిమబెంగాల్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మాజీ ఉపకులపతి, కోల్కతా, డాక్టర్ దేవేందర్ సింగ్ రాణా, సర్ గంగారామ్ హాస్పిటల్, బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ చైర్పర్సన్, న్యూఢిల్లీ, డాక్టర్ దేవీ ప్రసాద్ శెట్టి, నారాయణ హెల్త్ కేర్ చైర్పర్సన్, బెంగళూరు, డాక్టర్ గగన్దీప్ కాంగ్, ప్రొఫెసర్, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, వెల్లూరు, డాక్టర్ జేవీ పీటర్, డైరెక్టర్, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, వెల్లూరు, డాక్టర్ నరేశ్ ట్రెహాన్, చైర్పర్సన్, మేదాంత హాస్పిటల్ అండ్ హార్ట్ ఇన్స్టిట్యూట్, గురుగ్రామ్, డాక్టర్ రాహుల్ పండిట్, డైరెక్టర్, ఫోర్టిస్ హాస్పిటల్, ములుంద్ (ముంబై), డాక్టర్ సౌమిత్ర రావత్, చైర్మన్అండ్ హెడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, సర్ గంగారామ్ హాస్పిటల్, డాక్టర్ శివకుమార్ సరిన్, సీనియర్ ప్రొఫెసర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్స్, న్యూఢిల్లీ, డాక్టర్ జరీర్ ఉద్వాడియా, ముంబై.
ఆడిట్కు సబ్కమిటీలు..
కరోనా మహమ్మారి విసిరిన (ప్రస్తుత, భవిష్యత్) సవాళ్లను అధిగమించేందుకు టాస్క్ఫోర్స్ అందించే సూచనలు, వ్యూహాలు ప్రభుత్వాలకు దోహదం చేస్తాయని సుప్రీంకోర్టు పేర్కొన్నది. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ లభ్యత, సరఫరాకు విధివిధానాలు రూపొందించాలని, అలాగే సబ్గ్రూప్ల ద్వారా ఆడిటింగ్ నిర్వహించాలని టాస్క్ఫోర్స్కు కోర్టు నిర్దేశించింది. కేంద్రం కేటాయించిన ఆక్సిజన్ సంబంధిత రాష్ర్టానికి చేరిందా? లేదా?.. అందుబాటులో ఉన్న నిల్వలను పారదర్శకంగా, సమర్థంగా పంపిణీ చేస్తున్నారా? లేదా అన్నది సబ్ గ్రూప్లు ఆడిట్ చేస్తాయని తెలిపింది. ప్రతి రాష్ర్టానికీ టాస్క్ఫోర్స్ సబ్ గ్రూప్/కమిటీలను ఏర్పాటుచేస్తుందని తెలిపింది. ఇందులో రాష్ట్రప్రభుత్వానికి చెందిన కార్యదర్శి స్థాయి అధికారి, కేంద్ర ప్రభుత్వానికి చెందిన అదనపు/సంయుక్త కార్యదర్శి స్థాయి అధికారి, వైద్య సదుపాయాల నిర్వహణ విషయంలో అనుభవం కలిగిన ఇద్దరు ప్రభుత్వ వైద్యులు, పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (పెసో) ప్రతినిధి ఒకరు సభ్యులుగా ఉంటారు. వైద్యుల నిర్ణయాలను స్క్రూటినీ చేయడం ఈ ఆడిట్ ఉద్దేశం కాదని, ప్రతి రాష్ర్టానికీ పంపిణీ చేసిన ఆక్సిజన్ వినియోగంలో పారదర్శకత తీసుకురావడమే లక్ష్యమని కోర్టు వివరించింది. కేటాయించిన ఆక్సిజన్ గమ్యస్థానాలకు చేరిందా? లేదా? అని చూడటంతోపాటు ఆక్సిజన్ వినియోగంలో సవాళ్లను అధిగమించేందుకే ఈ చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నది. టాస్క్ఫోర్స్ నివేదిక అందించేంతవరకు కేంద్రం ఆక్సిజన్ కేటాయింపులో ప్రస్తుత విధానాన్నే అనుసరించవచ్చని తెలిపింది. సిఫార్సులు అందా నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నది. మరోవైపు, టాస్క్ఫోర్స్ తక్షణమే పని ప్రారంభించాలన్నది. టాస్క్ఫోర్స్ పదవీకాలాన్ని ప్రాథమికంగా 6 నెలలుగా నిర్ణయించారు.