రిషికేశ్, మే 21: ప్రఖ్యాత పర్యావరణ వేత్త, చిప్కో ఉద్యమ నాయకుడు సుందర్లాల్ బహుగుణ (94) కన్నుమూశారు. కరోనా బారినపడిన బహుగుణ రిషికేశ్లోని ఎయిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. గురువారం మధ్యాహ్నం నుంచి ఆక్సిజన్ స్థాయిలు క్రమంగా పడిపోయాయని, ఎంత ప్రయత్నించినా ఆయనను కాపాడలేకపోయామని వైద్యులు తెలిపారు. బహుగుణకు భార్య విమల, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. రిషికేశ్లోని గంగానది తీరంలో పూర్వానంద్ ఘాట్ వద్ద ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు. బహుగుణ మృతిపట్ల రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ తదితరులు సంతాపం ప్రకటించారు. పర్యావరణ పరిరక్షణను ఆయన ఒక ప్రజాఉద్యమంగా మలిచారని, ఈ రంగంలో ఒక గొప్ప అధ్యాయం ముగిసిందని రాష్ట్రపతి అన్నారు. బహుగుణ సేవలు చిరస్మరణీయని, పర్యావరణవేత్తలకు ఆయన స్ఫూర్తిదాయకమని ఉపరాష్ట్రపతి కొనియాడారు. భారతదేశం గొప్ప వ్యక్తిని కోల్పోయిందని ప్రధాని విచారం వ్యక్తంచేశారు.
హిమాలయ ప్రాంతాల పరిరక్షణే ధ్యేయంగా..
హిమాలయ ప్రాంతాల్లో అడవుల నరికివేతకు వ్యతిరేకంగా బహుగుణ అనేక ఉద్యమాలు చేపట్టారు. అటవీ సంరక్షణ కోసం 1970లలో మొదలైన చిప్కో ఉద్యమానికి నేతృత్వం వహించారు. ఇది ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షించింది. అలాగే తెహ్రీ డ్యామ్ నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాటం సాగించారు. 84 రోజులపాటు ఉపవాస దీక్ష చేశారు. ఈ ప్రాజెక్టు కారణంగా అనేక మంది నిర్వాసితులయ్యారు. తెహ్రీ రాజకుటుంబానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టడంతో ఆయన జైలుపాలుకావాల్సి వచ్చింది. హిమాలయాలలో లగ్జరీ టూరిజంను తీవ్రంగా వ్యతిరేకించారు. అక్కడ హోటళ్లను నిర్మిస్తే స్థానిక పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుందని వాదించారు. పర్యావరణరంగంలో అందించిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1981లో పద్మశ్రీ, 2009లో పద్మవిభూషణ్ పురస్కారంతో బహుగుణను సత్కరించింది.
తీరని లోటు: సీఎం కేసీఆర్
బహుగుణ మృతి పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సంతాపం వ్యక్తం చేశారు. ఐదు దశాబ్దాలుగా పర్యావరణ సమస్యలు, చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూ, అంతరించిపోతున్న వృక్ష, జంతు, పక్షిజాతుల రక్షణ కోసం జీవితాంతం కృషి చేసిన బహుగుణ మరణం ప్రకృతి, జీవావరణ, పర్యావరణ రంగానికి తీరని లోటని సీఎం అన్నారు. బహుగుణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అడవుల విధ్వంసానికి వ్యతిరేకంగా చిప్కో ఉద్యమం ద్వారా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు బహుగుణ కృషిచేశారని పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కొనియాడారు.
ఆయన స్ఫూర్తితోనే గ్రీన్ ఇండియా ఛాలెంజ్
బహుగుణ మృతి పట్ల రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ సంతాపం తెలిపారు. ఆయన ఐదు దశాబ్దాలుగా పర్యావరణ పరిరక్షణకు అలుపెరుగని పోరాటం చేశారని గుర్తుచేశారు. హిమాలయాల్లోని అడవుల నరికివేతకు వ్యతిరేకంగా ఆయన చేపట్టిన చిప్కో ఉద్యమం పర్యావరణ పరిరక్షకులకు మార్గనిర్దేశం చేసిందని కొనియాడారు. చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా పోరాడిన మహోన్నత వ్యక్తి అని కీర్తించారు. బహుగుణ వంటి పర్యావరణవేత్తల స్ఫూర్తితోనే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చేపట్టామని తెలిపారు.