న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: దేశంలో కరోనా విలయతాండవం సృష్టిస్తున్నది. దీంతో మహమ్మారి కట్టడికి పలు రాష్ర్టాలు లాక్డౌన్, కఠిన ఆంక్షల బాటపట్టాయి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఆరురోజులపాటు లాక్డౌన్ విధిస్తున్నట్టు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించగా.. మహారాష్ట్రలో లాక్డౌన్పై వచ్చే రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్టు ఆ రాష్ట్ర మంత్రి ఒకరు తెలిపారు. ఇదిలా ఉండగా, కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఉత్తరప్రదేశ్లోని ఐదు నగరాల్లో ఏప్రిల్ 26 వరకు లాక్డౌన్ విధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. పంజాబ్, రాజస్థాన్, కేరళ, మేఘాలయ, మణిపూర్ తదితర రాష్ర్టాలు కఠిన ఆంక్షలను ప్రకటించాయి.
దేశ రాజధాని ఢిల్లీలో నాలుగో దశ కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం (ఏప్రిల్ 19) రాత్రి 10 గంటల నుంచి వచ్చే సోమవారం (ఏప్రిల్ 26) ఉదయం 5 గంటల వరకు ఆరురోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేసులతో వైద్యవ్యవస్థపై తీవ్రమైన ఒత్తిడి పడుతున్నదని, ఆ ఒత్తిడిని కొంతవరకు తగ్గిస్తూ.. వైద్య వ్యవస్థ కుప్పకూలకుండా ఉండకూడదనే లాక్డౌన్ విధిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు, మహారాష్ట్రలో కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ విధించడంపై సీఎం ఉద్ధవ్ ఠాక్రే రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని ఆ రాష్ట్ర మంత్రి విజయ్ వడెట్టివార్ సోమవారం తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న రాత్రి పూట కర్ఫ్యూ.. కేసుల కట్టడికి అంతగా ప్రభావం చూపడం లేదన్నారు.
అత్యవసర సేవలపై నిషేధం ఉండదు. ప్రైవేటు కార్యాలయాలు, దుకాణాలు, మాల్స్, వారాంతపు మార్కెట్లు, తయారీ సంస్థలు, విద్య, శిక్షణ కేంద్రాలు, సినిమా హాళ్లు, రెస్టారెంట్లు, బార్లు, ఆడిటోరియాలు, పబ్లిక్ పార్కులు, క్రీడా వేదికలు, జిమ్, స్పా సెంటర్లు, సెలూన్లు, బ్యూటీ పార్లర్లు మూసేస్తారు. 50 శాతం సామర్థ్యంతో ప్రజారవాణాకు అనుమతి. ట్యాక్సీల్లో ఇద్దరికంటే ఎక్కువ మందిని అనుమతించరు. పెండ్లిళ్లకు 50 మందిని, అంత్యక్రియలకు 20 మందికి అనుమతి.
ఉత్తరప్రదేశ్లో కేసులు పెరుగుతున్న ఐదు ప్రధాన నగరాలు ప్రయాగ్రాజ్, లక్నో, వారణాసి, కాన్పూర్, గోరఖ్పూర్లో ఏప్రిల్ 26 వరకు లాక్డౌన్ విధించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. ప్రజల కదలికలపై ఆంక్షలు విధిస్తేనే, వైరస్ గొలుసును విచ్చిన్నం చేసే అవకాశం ఉంటుందని పేర్కొంది.
‘సూదులు, మందులేవీ నాకు పనిచేయవు. ఒక్క పెగ్ పడితే రోగాలన్నీ పోతాయి’.. ఢిల్లీలో ఓ వైన్షాప్ ముందు లైన్లో నిల్చున్న ఓ వృద్ధురాలు అన్న మాటలివి. ఢిల్లీలో లాక్డౌన్ ప్రకటించడంతో మద్యం షాపులు కిటకిటలాడాయి.
రాష్ట్రంలో కఠిన ఆంక్షలు అమలు చేయాలని పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆదేశించారు. రాత్రికర్ఫ్యూ సమయాన్ని రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు పొడిగించారు. బార్లు, సినిమా హాళ్లు, జిమ్, స్పా సెంటర్లు, శిక్షణ కేంద్రాలను ఏప్రిల్ 30 వరకు మూసివేయాలన్నారు. మంగళవారం నుంచి రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్టు కేరళ, మణిపూర్ ప్రభుత్వాలు వెల్లడించాయి. రాష్ట్రంలోని కార్యాలయాలను, మార్కెట్లను మూసివేస్తున్నట్టు రాజస్థాన్ సర్కార్ వెల్లడించింది. బయటి రాష్ర్టాల నుంచి వచ్చే పర్యాటకుల ప్రవేశాలపై మేఘాలయ నిషేధం విధించింది. వచ్చే నెల 4వ తేదీ వరకు పాఠశాలలను మూసివేసింది.
ఢిల్లీలో లాక్డౌన్ ప్రకటించడంతో వేలాది మంది వలస కూలీలు స్వస్థలాలకు బయల్దేరారు. ‘మీకు నేనున్నా. నాపై నమ్మకం ఉంచండి. లాక్డౌన్ను పొడిగించడం’ అంటూ కేజ్రీవాల్ హామీ ఇచ్చినా గతేడాది లాక్డౌన్ అనుభవం నేపథ్యంలో ఢిల్లీలో వలస కూలీలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సొంత ఊర్లకు వెళ్లడానికి బస్స్టేషన్లు, రైల్వే స్టేషన్లకు పోటెత్తారు.