హైదరాబాద్/ సిటీబ్యూరో, మే 22 (నమస్తే తెలంగాణ)/సుల్తాన్బజార్: బ్లాక్ ఫంగస్ రోగులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నది. మ్యుకోరిసిస్ బారినపడ్డవారికి మెరుగైన వైద్యం అందిస్తున్నది. అవసరమైనవారికి ఆపరేషన్లు సైతం నిర్వహిస్తున్నది. ఇప్పటికే బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ కోఠిలోని ఈఎన్టీ దవాఖానను నోడల్ కేంద్రంగా ప్రకటించింది. ఈ దవాఖానలో ఉన్న మొత్తం 200 పడకలు నిండిపోవడంతో అదనంగా 30 పడకలు అందుబాటులోకి తెస్తున్నారు. ఈ వ్యాధి సోకినవారిలో కరోనా నెగెటివ్ ఉన్నవారికి కోఠి ఈఎన్టీ దవాఖానలో, పాజిటివ్ కేసులకు గాంధీలో వైద్యం చేస్తున్నారు. ఇప్పటికే కోఠి ఈఎన్టీలో 9 మందికి విజయవంతంగా శస్త్ర చికిత్సలు నిర్వహించారు. బ్లాక్ఫంగస్ కారణంగా కంటి సమస్యలతో బాధపడుతున్నవారి కోసం సరోజినీదేవి కంటి దవఖానలో ప్రత్యేక ఓపీ విభాగాన్ని ఏర్పాటుచేశారు. ఇక్కడ 24 గంట లూ సేవలు అందిస్తున్నారు. పరీక్షలు నిర్వహించి, ఆపరేషన్లు అవసరమైనవారిని ఈఎన్టీ, గాంధీ దవాఖానలకు తరలిస్తున్నారు. వీరికి అవసరమైన యాంటీ ఫంగల్ ఇంజెక్షన్లు అందించేందుకు ప్రభు త్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఈ ఇంజెక్షన్ల కోసం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొన్నవారికి కోఠి ఈఎన్టీ ద్వారా అప్రూవల్ ఇస్తున్నారు. అవి అందుబాటులో ఉన్న కేంద్రాల సమాచారాన్ని కూడా ఆన్లైన్ ద్వారానే చేరవేస్తున్నారు.
బ్లాక్ఫంగస్ బాధితులందరికీ ఇంజెక్షన్లు
బ్లాక్ ఫంగస్ బాధితులందరికీ అవసరమైన యాంటిఫంగల్ ఇంజెక్షన్లు ఇస్తామని కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వాకాటి కరుణ తెలిపారు. ఈ విషయంలో ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స పొందుతున్నవారు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కోఠి ఈఎన్టీ దవాఖానలోని అప్రూవల్ కేంద్రాన్ని శనివారం కరుణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంజెక్షన్ల లభ్యతపై ఆరా తీసేందుకు ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స పొందుతున్నవారి బంధువులు ఈఎన్టీకి రావడంతో ఆమె వారికి భరోసా ఇచ్చారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికీ, అప్రూవల్ చేసి, అవి లభ్యమయ్యే కేంద్రాలను ఆన్లైన్లోనే సూచిస్తామని వివరించారు.
సరోజినిదేవీలో కంటి పరీక్షలు
బ్లాక్ ఫంగస్కు గురై కంటి సమస్యలతో బాధపడుతున్నవారికి అవసరమైన అన్నిరకాల కంటి పరీక్షలను సరోజినిదేవి కంటిదవాఖానలో నిర్వహిస్తున్నట్టు సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగం తెలిపారు.ఆపరేషన్ అవసరమున్న రోగులను గాంధీ, ఈఎన్టీ దవాఖానలకు తరిలిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇందుకు రెండు బృందాలను ఏర్పాటుచేశామని, ఒకటి సరోజినిలో, రెండోది గాంధీ, ఈఎన్టీ దవాఖానల్లో ఆపరేషన్లు, తదనంతర చికిత్సలు అందిస్తున్నట్టు ఆయన వివరించారు. దవాఖానలో రోజూ ఉదయం 9 గంటల నుంచి, వచ్చిన రోగులందరినీ పరీక్షించే వరకు ప్రత్యేక ఓపీ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.