మహబూబ్నగర్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి), అచ్చంపేట: రాష్ట్రంలో అర్హులకు త్వరలోనే కొత్త రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు అందిస్తామని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కే తారకరామారావు ప్రకటించారు. ఎన్నికల కోడ్ ముగియగానే రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్టు చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే స్ఫూర్తితో రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. ఆయన నాయకత్వంలో మానవీయ కోణంలో పాలన సాగుతున్నదని చెప్పారు. కరోనాతో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని, అందుకే రాష్ట్రంలో అనుకున్న వేగంగా పనులు జరుగలేదని చెప్పారు. ఇకపై అభివృద్ధి వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీలో, నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో వివిధ అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా రెండు ప్రాంతాల్లో నిర్వహించిన సభల్లో పాల్గొన్నారు. జడ్చర్ల మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ.. పట్టణాలు, పల్లె లు ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. సమైక్య రాష్ట్రంలో రూ.200 ఉన్న పెన్షన్ను రూ.2,016కు పెంచామని, 40 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ హయాలో కరెంట్ ఉండేది కాదని.. 24 గంటలు అందిస్తున్నామన్నారు. 18 లక్షల మంది విద్యార్థులకు పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.12,800 కోట్లు డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్థులకు అందిస్తున్నామని తెలిపారు. అంబేద్కర్, పూలే ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద విదేశాల్లో చదువుకునే పేద విద్యార్థులకు రూ.20 లక్షల సాయం ఇస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. జడ్చర్లలో 1,500 డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మా ణం పూర్తయ్యే దశలో ఉన్నాయని, ఇంకా అవసరమైతే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
గతంతో పోలిస్తే జడ్చర్ల రూపురేఖలు మారిపోయాయని, జడ్చర్ల, కావేరమ్మపేట, బాదేపల్లి కలిసి పెద్ద పట్టణంగా మారాయని మంత్రి కేటీఆర్ అన్నారు. జడ్చర్ల సమీపంలోని పోలేపల్లిలో సెజ్ ఏర్పాటు చేయడంతో పట్టణంలో రోడ్లు, వ్యాపార సముదాయాలు, అమాంతంగా పెరిగిపోయాయన్నారు. సెజ్ ఏర్పాటును అప్పట్లో అందరూ వ్యతిరేకించినా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పట్టుబట్టి ఏర్పాటు చేయించారని గుర్తుచేశారు.
దేశం గర్వపడేలా పేదలను ఆదుకునే క్రమం లో సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో పాలన కొనసాగిస్తున్నారని కేటీఆర్ చెప్పారు. అచ్చంపేట ఎన్టీఆర్ స్టేడియంలో విప్ గువ్వల బాలరాజు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడు తూ.. తెలంగాణ రాకముందు రాష్ట్రం ఎలా ఉందో, వచ్చాక ఎంత అభివృద్ధి జరిగిందో ఆలోచించాలని కోరారు. ఎండకాలం వచ్చిందంటే ఎమ్మెల్యేలు, మంత్రులు గ్రామాలకు వెళ్లాలంటే ఎక్కడ ప్రజలు, రైతులు కరెంటు కోసం అడ్డుకుంటారోనని భయపడే వారని గుర్తుచేశారు. అంత జటిలమైన విద్యుత్ సమస్యకు సీఎం కేసీఆర్ ఆరు నెలల్లోనే శాశ్వత పరిష్కారం చూపించారని చెప్పారు. గురుకులాలు స్థాపించి రాష్ట్రంలో 4.5 లక్షల మంది పేద పిల్లలకు కార్పొరేట్ విద్య అందిస్తున్నామన్నారు. ప్రైవేట్రంగంలో 10 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వరంగంలో 1.32 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. అచ్చంపేటలో గత మున్సిపల్ ఎన్నికల్లో లాగే ఈసారి కూడా 20కి 20 వార్డులు గెలుపొంది బీజేపీ, కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయించి, కేంద్రానికి పం పించామని, అందుకే తవ్వకాల నిర్ణయాన్ని కేం ద్రం రద్దు చేసుకుందని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీ రాములు, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, దామోదర్రెడ్డి, ఎమ్మెల్యేలు జైపాల్యాదవ్, ఆల వెంటేశ్వర్రెడ్డి, అబ్రహం, హర్షవర్ధన్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, రాజేందర్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్లు పద్మావతి, స్వర్ణసుధాకర్రెడ్డి, బాలాజీసింగ్, పోకల మనోహర్, హన్మంతరావు, సంగీత, నాటక అకాడమీ చైర్మన్ శివకుమార్, డీసీసీబీ అధ్యక్షుడు నిజాంపాషా, డీసీఎంఎస్ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు.
ఒకప్పటి జడ్చర్లకు.. ఇప్పటి జడ్చర్లకు అభివృద్ధిలో ఉన్న తేడా స్పష్టంగా కనిపిస్తున్నదని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జడ్చర్ల, కావేరమ్మపేట, బాదేపల్లి వేర్వేరుగా ఉండి అభివృద్ధి కష్టమైనా.. స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఈ మూడు పట్టణాలు కలిసి ఇప్పుడు మున్సిపాలిటీగా రూపాంతరం చెందడంతో అభివృద్ధి పరుగులు పెడుతున్నదన్నారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో జడ్చర్లలో టీఆర్ఎస్కు స్పష్టమైన మెజారిటీ ఇవ్వాలని కోరా రు. అప్పుడే మరింత అభివృద్ధి సాధ్యమని చెప్పారు. భవిష్యత్తులో మహబూబ్నగర్, జడ్చర్ల, భూత్పూర్ కలిపి మహానగరంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ..జాతీయ రహదారిపై ఉన్న జడ్చర్ల భవిష్యత్తులో ఎవరూ ఊహించని స్థాయిలో అభివృద్ధి చెందుతుందన్నారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలో కనీవినీ ఎరుగని అభివృద్ధి జరిగిందన్నారు. 20 పార్కులను అభివృద్ధి చేయడంతోపాటు ట్యాంక్బండ్ను సుందరంగా తీర్చిదిద్దామని, రంగనాయకుల దేవాలయాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. పట్టణంలో 1,500 డబుల్ బెడ్ర్రూం ఇండ్లు నిర్మిస్తున్నామని, స్థలం ఉన్న పేదలు సైతం ఇంటిని నిర్మించుకునేందుకు ప్రభుత్వం నుం చి డబ్బులు ఇస్తామని చెప్పారు.