హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): బ్యాచ్లర్ ఆఫ్ ఆర్ట్స్ తీసుకున్నా గణితం చదవొచ్చు. బీఎస్సీలో చేరినా జాగ్రఫీ ఎంచుకోవచ్చు, జియాలజీ తీసుకోవచ్చు, కావాలంటే సైకాలజీ చేయొచ్చు. అది మీ ఇష్టం. బకెట్ ఆఫ్ కోర్సెస్ విధానంతో సంప్రదాయ కోర్సులకు కాలం చెల్లినట్టే. ఇకనుంచి కోర్సు ఏది తీసుకున్నా ఇష్టమైన సబ్జెక్టును ఎంచుకొనే అవకాశం కలుగనున్నది. డిగ్రీ కోర్సుల్లో మూసపద్ధతులకు స్వస్తిపలికి చాయిస్ బేస్ట్ క్రెడిట్ సిస్టం(సీబీసీఎస్) విధానాన్ని ఉన్నతవిద్యామండలి అమలుచేస్తున్నది. ఇందులో కోర్సుల ఎంపిక కోసం ప్రత్యేకంగా బకెట్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఫలితంగా కొత్త కొత్త కాంబినేషన్లు అందుబాటులోకి వచ్చి సీట్లు, కోర్సులు గణనీయంగా పెరుగుతున్నాయి.
సాధారణంగా కాలేజీల సంఖ్య తగ్గితే సీట్లు, కోర్సులు తగ్గాలి. కానీ, గత మూడేండ్లలో కాలేజీల సంఖ్య తగ్గినా, సీట్లు, కోర్సుల సంఖ్య మాత్రం పెరుగుతున్నది. ఈ ఏడాది 73 కాలేజీలు తగ్గినా గతేడాదితో పొల్చితే ఈ ఏడాది 1000 సీట్లు పెరిగాయి. అటు విద్యార్థులు ఇంగ్లిష్ మీడియాన్ని తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. డిగ్రీ మొదటి విడుతలో 1,67,130 మంది సీట్లు పొందగా, 1,47,036 మంది ఇంగ్లిష్ మీడియంలోనే చేరారు. తెలుగు మీడియంలో 18,889, ఉర్దూ మీడియంలో 1,192, హిందీ మీడియంలో 13 మంది విద్యార్థులే ప్రవేశాలు పొందారు.
ఒక్కో బకెట్లో కొన్ని సబ్జెక్టులు కలిపి ఉంటాయి. విద్యార్థి ఒక్కో బకెట్ నుంచి ఒక సబ్జెక్టును ఎంపిక చేసుకోవచ్చు. ఉదాహరణకు బీఏలో గతంలో గణితం చదువుకునే అవకాశం లేదు. కానిప్పుడు బకెట్ సిస్టంలో బీఏలో సైతం గణితాన్ని అభ్యసించే అవకాశాన్ని కల్పించారు. కొత్త కోర్సులు అందుబాటులోకి రావటంతో గతంలో కోర్సుల సంఖ్య 174 ఉండగా, ఇప్పుడా సంఖ్య 501కు చేరుకున్నది.
తెలంగాణ ఉన్నత విద్యామండలి అధికారులు వర్తమాన మార్కెట్ అవసరాలకు తగ్గట్టు కొత్త కోర్సులకు అనుమతిస్తున్నారు. ఫలితంగా కాలేజీలు సంఖ్య తగ్గుతున్నా సీట్లు, కోర్సుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ప్రస్తుతానికి నడుస్తున్న కాలేజీలే కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. కొత్తగా ప్రవేశపెట్టిన కోర్సుల్లో డాటా సైన్స్ కోర్సులో చేరేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఫిషరీస్, డెయిరీ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫైనాన్షియల్ అకౌంటెన్సీ, ఆంత్రప్రెన్యూర్షిప్ స్కిల్స్, బీఎస్సీ ఫారెస్ట్ తదితర కోర్సులను సైతం ఉన్నత విద్యామండలి అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో డిగ్రీ కోర్సులపై విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు.
కోర్సులు, సీట్ల పెరుగుదల వివరాలు ఇలా..
సంవత్సరం – సీట్లు – కోర్సులు
2019 – 3,83,514– 174
2020 – 4,07,390 – 501
2021- 4,08,345– 501
పలు కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం(బీఆర్ఏఓయూ)లో బకెట్ విధానాన్ని అమలుచేయాలని యూనివర్సిటీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. డిగ్రీ కోర్సుల్లో ఈ విధానాన్ని అమలుచేయనున్నారు. వైవిధ్యతకు ఆస్కారమిచ్చేలా బీఏ, బీకాం, బీఎస్సీలో కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. బీఏ జాగ్రఫీ, ఫిలాసఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఈ-గవర్నెన్స్, అంత్రపాలజీ, సోషల్ వర్క్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ తదితర కోర్సులను కొత్తగా ప్రవేశపెట్టనున్నారు.
ఈ విద్యాసంవత్సరం నుంచే ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ సర్టిఫికెట్ కోర్సును సర్టిఫికెట్ కోర్సు రూపంలో నిర్వహించనున్నారు. ఉపాధి అవకాశాలు దొరికే అవకాశముండటంతో ఈ కోర్సును నిర్వహించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ సూచించారు. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఎన్ఎస్డీసీ) సూచనల మేరకు పలు నైపుణ్యాభివృద్ధి కోర్సులను సైతం ప్రవేశపెట్టే దిశగా వర్సిటీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.