హైదరాబాద్, మే13 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ చర్యలు, ప్రజల సహకారంతో రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ప్రజారోగ్య సంచాలకుడు జీ శ్రీనివాసరావు చెప్పారు. రెండువారాలపాటు విధించిన రాత్రి కర్ఫ్యూ, రెండు రోజుల నుంచి అమలవుతున్న లాక్డౌన్ వల్ల ఆశించిన ఫలితాలు వస్తున్నాయని అన్నారు. హైదరాబాద్తోపాటు, అన్ని జిల్లాల్లో కేసుల తగ్గుదల మొదలైందని తెలిపారు. ప్రతి రోజు 70 వేలకు పైగా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. కొత్త కేసుల సంఖ్య తగ్గడంతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో అడ్మిషన్ల సంఖ్య కూడా తగ్గిందని తెలిపారు. మరణాల రేటు కూడా తగ్గడం మొదలైందని చెప్పారు. కోఠిలోని ప్రధాన కార్యాలయంలో గురువారం డీఎం ఈ రమేశ్రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఉన్న స్టేట్ టాస్క్ఫోర్స్ కమిటీ రాష్ట్రంలోని కొవిడ్ పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నదని తెలిపారు. కరోనా కట్టడికి సంబంధించి వైద్యారోగ్యం, పోలీసు, పంచాయతీ, మున్సిపల్ తదితర శాఖలకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు చేస్తున్నట్టు వెల్లడించారు. 20 గంటల లాక్డౌన్లో సాధించుకున్న ప్రతిఫలం 4 గంటల సడలింపులో కోల్పోయే అవకాశం ఉందని శ్రీనివాసరావు హెచ్చరించారు. అందుకే నిత్యావసరాలు, ఇతర అవసరాల కోసం ఇంటి నుంచి ఒక్కరే బయటికి రావాలని సూచించారు. కొవిడ్ దవాఖానల్లో ఓపీ సేవలు, ఇంటింటా జ్వర సర్వే ఫలితా లు మొదలయ్యాయని చెప్పారు. లక్షణాలు ఉన్న వారిని గుర్తించి, చికిత్స అందిస్తుండటం వల్ల దవాఖానల్లో అడ్మిషన్లు తగ్గుతున్నట్టు తెలిపారు.
బ్లాక్ ఫంగస్ ఆందోళన వద్దు: డీఎంఈ రమేశ్రెడ్డి
కరోనా కష్టకాలంలో ప్రజలకు సేవ చేసేందుకు సామాజిక బాధ్యతగా వైద్యులు ఇతర సిబ్బంది ముందుకు రావాలని డీఎంఈ రమేశ్రెడ్డి కోరారు. ప్రభుత్వం భర్తీ చేస్తున్న పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో రెమ్డెసివిర్ కొరత లేదని చెప్పారు. బ్లాక్ ఫంగస్ కొత్తదేం కాదని, ఎప్పటి నుంచో ఉందని చెప్పారు. రోగనిరోధక శక్తి తగ్గిన వారికి ఇది వస్తుందన్నారు. ఆక్సిజన్ ఫ్లో మీటర్లను శుభ్రపర్చితే ఈ ఫంగస్ వచ్చే ఆస్కారం తక్కువగా ఉంటుందని చెప్పారు. దీని గురించి పెద్దగా ఆందోళనపడాల్సిన అవసరం లేదన్నారు. గాంధీ దవాఖానకు ఈ తరహా మూడు కేసులు రాగా, గాంధీ ఫండ్స్ నుంచి ఔషధాలు తెచ్చి వాడుతున్నట్టు చెప్పారు.
వ్యాక్సిన్ బాధ్యత ప్రభుత్వానిదే
తొలి డోసు తీసుకున్న హెల్త్కేర్ వర్కర్లు, ఫ్రంట్లైన్ వారియర్లు, 45 ఏండ్ల పైబడిన వారికి రెండో డోసు వేయడం ప్రభుత్వ బాధ్యత అని, ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శ్రీనివాసరావు చెప్పారు. కొవాగ్జిన్ తీసుకున్న వారు 4 నుంచి 6 వారాల మధ్య, కొవిషీల్డ్ తీసుకున్న వారు 3 నుంచి 4 నెలల మధ్య రెండో డోసు తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య కాలాన్ని కేంద్రం పొడిగించిందని చెప్పారు. రెండో డోసు తీసుకోవాలనుకున్న వారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఈనెల చివరి వరకు రెండో డోసు పూర్తి చేస్తామని చెప్పారు.
పడకల కొరత రాష్ట్రంలో లేదు
మొదటి వేవ్లో 236 కొవిడ్ చికిత్స అందించే దవాఖానలు ఉంటే.. ఇప్పుడు వాటి సంఖ్య 1,262కు పెరిగిందని శ్రీనివాసరావు చెప్పారు. తొలి దశలో 18,200 పడకలు ఉంటే, ఇప్పుడు 53,568 పడకలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికీ 5,700 ఆక్సిజన్ పడకలు, 2,800కు పైగా ఐసీయూ పడకలు ఖాళీగా ఉన్నట్టు చెప్పారు. పడకల ఖాళీ విషయాలు తెలుసుకునేందుకు 108 పైలట్లకు ఆన్లైన్ యాక్సెస్ ఇచ్చినట్టు చెప్పారు.
ఆక్సిజన్, మందులు దుర్వినియోగం వద్దు…
రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదని శ్రీనివాసరా వు స్పష్టం చేశారు. కేంద్రం నుంచి 450 మెట్రిక్ టన్నులు వస్తుండగా, 430 మెట్రిక్ టన్నులు వా డుకుంటున్నట్టు చెప్పారు. చాలా జాగ్రత్తగా ఆక్సిజన్ను వినియోగించుకోవాలని, దుర్వినియోగం జరగకుండా చూసేందుకు ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసిందని గుర్తు చేశారు. ప్రైవేటు దవాఖానలు రెమ్డెసివిర్ కోసం ప్రజలను పరుగులు పెట్టించడం సరికాదన్నారు.
జ్వర సర్వేతో ముందస్తు చికిత్స
రాష్ట్రవ్యాప్తంగా 25 వేల బృం దాల ద్వారా 70 లక్షలకు పైగా ఇండ్లలో జ్వర సర్వే పూర్తయిందని శ్రీనివాసరావు తెలిపారు. సర్వేలో లక్షణాలు బయటపడినవారిని గుర్తించి 1.59 లక్షల కిట్లను పంపిణీ చేసినట్టు చెప్పారు. ఇది కాకుండా దవాఖానల్లో కొవిడ్ ఓపీ సేవల ద్వారా 5,05,204 మందిని స్క్రీన్ చేసి.. 1,07,329 మందికి హోం మెడిసిన్ కిట్ పంపిణీ చేశామని తెలిపారు. జ్వర లక్షణాలు ఉన్నవారందరికి కొవిడ్ అయినా కాకపోయినా కిట్స్ పంపిణీ చేశామని, వాటిని సక్రమంగా వినియోగిస్తే సీరియస్ పరిస్థితుల దాకా వెళ్లకుండా ఆరోగ్యాలు కాపాడుకోవచ్చని చెప్పారు.