హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): వానకాలం రైతుబంధు పంపిణీకి ప్రభుత్వం సిద్ధమయింది. ఈనెల 15 నుంచి 25వ తేదీ వరకు రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదు జమ కానున్నది. ముందుగా ఎకరం నుంచి మొదలుకొని చివరి ఎకరం భూమిదాకా పంటసాయం పంపి ణీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ సీజన్కు 63,25,695 మంది రైతులను అర్హులుగా గుర్తించారు. మొత్తం 150.18 లక్షల ఎకరాలకు రైతుబంధు అందుతుంది. ఇందుకోసం రూ.7,508.78 కోట్లు అవసరంకాగా, నిధు లను ప్రభుత్వం ఇప్పటికే బ్యాంకులకు అందజేసింది.
కొత్తగా 2.81 లక్షల మంది.. 66వేల ఎకరాలు
గత యాసంగితో పోల్చితే ఈసారి రైతుబంధు అర్హుల సంఖ్య భారీగా పెరిగింది. కొత్తగా 2,81,865 మంది రైతులు లబ్ధిపొందనున్నారు. భూ విస్తీర్ణం కూడా పెరిగింది. కొత్తగా 66,311 ఎకరాలు రైతుబంధు పరిధిలోకి వచ్చింది. ధరణి పోర్టల్ వచ్చాక పార్టీ-బీలోని భూములు పార్ట్-ఏలోకి వచ్చాయి. పెండింగ్లో ఉన్న మ్యుటేషన్లు పరిష్కారమయ్యాయి. పోర్టల్లో అందుబాటులోకి వచ్చిన పలు గ్రివెన్స్లతో కొత్త రైతులు, కొత్త భూములు రైతుబంధు కిందకు వచ్చాయి. ఈ ఏడాది వానకాలం, యాసంగి కోసం సీఎం కేసీఆర్ ఇప్పటికే రూ.14,800 కోట్లు కేటాయించారు. రైతుబంధు సాయం పొందడంలో నల్లగొండ జిల్లా టాప్లో ఉన్నది. జిల్లాలో 4,72,983 మంది అర్హులైన రైతులకు 12.18 లక్షల ఎకరాలకుగాను రూ.608.81 కోట్ల పంటసాయం జమచేయనున్నారు. అత్యల్పంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 39,762 మందికి 77 వేల ఎకరాలకు రైతుబంధు అందనున్నది.
కరోనా కష్టకాలంలోనూ..
దాదాపు ఏడాదిన్నర కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థికవ్యవస్థ అస్థవ్యస్తంగా మారింది. రాబడి భారీగా తగ్గిపోయింది. అయినప్పటికీ రైతుబాంధవుడిగా పేరొందిన సీఎం కేసీఆర్ రైతుబంధు పంపిణీలో వెనుకడుగు వేయలేదు. వరుసగా ఏడోసారి రైతుబంధు కింద అన్నదాతకు పంటసాయం అందిస్తున్నారు. ఇతర రాష్ట్రాలు రైతుల కోసం కేవలం రూ.వంద కోట్లు ఖర్చు చేయడానికే వెనుకాడుతుంటే తెలంగాణలో ఏకంగా రూ.7,508 కోట్లు రైతుల ఖాతాలో జమచేస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నారు. కరోనా విపత్తులోనూ వరుసగా మూడోసారి రైతుబంధు నిధులు పంపిణీ చేస్తున్నారు.
బ్యాంకుల విలీనంతో ఇబ్బంది లేదు..
ఇటీవల ఆంధ్రాబ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, విజయ బ్యాంకు, దేనా బ్యాంకు, ఓరియంటల్ బ్యాంకు, సిండికేట్ బ్యాంకులు ఇతర బ్యాంకుల్లో విలీనమయ్యాయి. దీంతో అందులోని ఖాతాల ఐఎఫ్ఎస్సీ కోడ్లు మారాయి. ఆయా బ్యాంకుల్లో ఖాతాలున్న రైతులు.. తమకు రైతుబంధు పండుతుందో లేదోనని ఆందోళన చెందారు. బ్యాంకుల విలీనంతో సంబంధం లేకుండా రైతుల పాత ఖాతాల్లోకే రైతుబంధు నిధులు జమవుతాయని మంత్రి నిరంజన్రెడ్డి స్పష్టంచేశారు. రైతులెవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. ఎవరికైనా ఇబ్బంది తలెత్తితే ఏఈవోను సంప్రదించాలని సూచించారు.
రైతుబాంధవుడు సీఎం కేసీఆర్
వానకాలం సీజన్కుగానూ ఈనెల 15 నుంచి రైతుబంధు పంపిణీ జరుగుతుంది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో వరుసగా ఏడోసారి రైతులకు పంటసాయం అందుతున్నది. సీఎం కేసీఆర్ రైతు బాంధవుడు.. రైతుల పట్ల ఆయనకున్న ప్రేమ మరే ముఖ్యమంత్రికి లేదు. కరోనా కష్టకాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా రైతుబంధు పంపిణీకి వెనుకంజ వేయలేదు.