సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణలో నాలుగు విప్లవాలు ప్రారంభమయ్యాయి. మత్స్యరంగంలో నీలి విప్లవం, గొర్రెల పెంపకంతో పింక్ విప్లవం, పాడి సంపదతో శ్వేత విప్లవం ప్రారంభంకాగా వ్యవసాయంలో రెండో హరిత విప్లవం మొదలైంది. ఇందుకు ఉదాహరణ రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట. ఒకప్పుడు దుర్భిక్షానికి చిరునామాగా ఉన్న ఆ ప్రాంతం నేడు లక్ష టన్నుల దిగుబడి సాధించింది. రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చే సత్తా వ్యవసాయరంగానికి ఉన్నది.
హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వ్యవసాయం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని, ఒకప్పుడు సంక్షోభంలో ఉన్న వ్యవసాయరంగం నేడు స్వయంసమృద్ధి దిశగా పరుగులు పెడుతున్నదని పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణలో రెండో హరిత విప్లవం మొదలైందని చెప్పారు. రాష్ర్టాభివృద్ధిలో వ్యవసాయానిదే కీలక పాత్ర అని తెలిపారు. వ్యవసాయరంగంపై మంత్రులు నిరంజన్రెడ్డి, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, పువ్వాడ అజయ్, జగదీశ్రెడ్డితో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో తొలిసారి సమావేశమైంది. ఈ సందర్భంగా వ్యవసాయరంగంలో తీసుకురావాల్సిన మార్పులు, నూతన విధానాలపై చర్చించారు. సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణలో నాలుగు విప్లవాలు ప్రారంభమయ్యాయని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. మత్స్యరంగంలో నీలి విప్లవం, గొర్రెల పెంపకంతో పింక్ విప్లవం, పాడి సంపదతో శ్వేత విప్లవం ప్రారంభంకాగా వ్యవసాయంలో హరిత విప్లవం మొదలైందన్నారు. ఇందుకు ఉదాహరణ ఇల్లంతకుంట అని చెప్పారు. ఒకప్పుడు దుర్భిక్షానికి చిరునామాగా ఉన్న ఆ ప్రాంతం నేడు లక్ష టన్నుల దిగుబడి సాధించిందని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే సత్తా వ్యవసాయరంగానికి ఉన్నదని తెలిపారు.
ప్రత్యామ్నాయం వైపు మళ్లాలి
వ్యవసాయం పరిశ్రమగా వర్ధిల్లాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయరంగంలో వస్తున్న మార్పులను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ తెలంగాణలో వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. వేరుశనగకు తెలంగాణ అనుకూలమని, వేరుశనగ ఆధారిత పరిశ్రమలతో మంచి ఉపాధి లభిస్తుందని తెలిపారు. ధాన్యం నుంచి ఇథనాల్ ఉత్పత్తి చేసే పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ.. డిమాండ్ ఉన్న పంటల సాగుపై రైతులు దృష్టిసారించాలని సూచించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్కు వ్యవసాయరంగంపై ప్రత్యేక ఆసక్తి ఉందని, ఆ ఆసక్తే ఈ మార్పునకు దోహద పడిందని చెప్పారు. మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మాట్లాడుతూ.. వ్యవసాయం, సహకార రంగాలు కవల పిల్లలలాంటివన్నారు. అధికారులు, శాస్త్రవేత్తలు రైతులను పంటల మార్పిడివైపు ప్రోత్సహించాలని చెప్పారు. కార్యక్రమంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, వీసీలు ప్రవీణ్రావు, నీరజా ప్రభాకర్, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఆయిల్ఫెడ్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి, ఆగ్రోస్ ఎండీ రాములు తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయం పరిశ్రమ కావాలి
గతంలో వ్యవసాయంపై, రైతుపై చిన్న చూపు ఉండేదని, ఇప్పుడు ఆ భావన కనుమరుగైందని మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తంచేశారు. వ్యవసాయరంగాన్ని పరిశ్రమగా మార్చాలని.. అందుకోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటును పెంచాలని సూచించారు. వ్యవసాయంలో తీసుకురావాల్సిన మార్పులపై ప్రొఫెసర్ స్వామినాథన్, జయతీఘోష్, పాలగుమ్మి సాయినాథ్, సుభాష్ పాలేకర్ను మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు సంప్రదించాలని కోరారు. వ్యవసాయశాఖ అధికారుల బృందం అమెరికాలోని అయోవాలో ఉన్న అగ్రికల్చర్ మ్యూజియంను సందర్శించాలని చెప్పారు. ప్రతి జిల్లాలో 50 నుంచి వంద ఎకరాల్లో ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటుచేసే దిశగా ఆలోచిస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. అదేవిధంగా సాగులో సాంకేతికత, యాంత్రీకరణను పెంచేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. డ్రోన్లు, ఇతర వ్యవసాయ ఆవిష్కరణల వైపు యువతను ప్రోత్సహించాలని సూచించారు. గ్రామాల్లో అందుబాటులో ఉన్న వ్యవసాయ యంత్రాల వివరాలను ఉబరైజేషన్ ప్రక్రియ ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. వేరుశనగ ఆధారిత, టమాటా ఆధారిత ఉత్పత్తుల పరిశ్రమలను ప్రోత్సహించాలని చెప్పారు. మిద్దె తోటలను గణనీయంగా ప్రోత్సహించాలన్నారు. 3 శాతం జనాభా ఆధారపడ్డ అమెరికా వ్వయసాయరంగం ఆ దేశ జీడీపీలో 9 శాతం సంపదను అందిస్తున్న విషయాన్ని మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు.