హైదరాబాద్ సిటీబ్యూరో, మే 9 (నమస్తే తెలంగాణ): భవన నిర్మాణవ్యయం భారంగా మారుతున్నది. నిర్మాణ సామగ్రి ధరలు పైపైకి పోతున్నాయి. కరోనా లాక్డౌన్ కారణంగా ఈ భారం మరింతగా పెరిగిపోయింది. ఏడాదిలోనే 25 నుంచి 30 శాతం వరకు పెరిగిపోయింది. దీంతో ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.8 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా అదనంగా వెచ్చించాల్సి వస్తున్నదని నిర్మాణదారులు, బిల్డర్లు పేర్కొంటున్నారు. గతేడాది జనవరి నుంచి సిమెంటు ధరలు 20 శాతం, స్టీలు 25 శాతం వరకు పెరిగాయి. మేస్త్రీలు, ఇతర కూలీల రేట్లు కూడా ఎక్కువయ్యాయి. ఇసుక, కంకర వంటి సామగ్రి మినహా ఇతరవాటి ధరలు బాగా పెరిగి భారంగా మారిందని బిల్డర్లు వాపోతున్నారు. కొనుగోలుదారులకు ఇచ్చినమాట ప్రకారం ఇండ్ల నిర్మాణాలు భారమైనా పూర్తిచేసి ఇస్తున్నామని ఓ బిల్డర్ తెలిపారు. టైల్స్ ధరలు గతంలో కంటే ప్రస్తుతం ఎస్ఎఫ్టీపై సుమారు రూ.10 వరకు పెరిగాయి. నిర్మాణం భారం కావడంతో బిల్డర్లు చేసేదిలేక ఎస్ఎఫ్టీ ధరను పెంచి అమ్ముతున్నారు. సాధారణ, మధ్యతరగతివారు 150 గజాల స్థలంలో ఓ ఇంటిని గ్రౌండ్ ఫ్లోర్ వరకు 1,200 ఎస్ఎఫ్టీలో నిర్మించాలంటే గతంలో రూ.18 నుంచి 20 లక్షలు కాగా, ప్రస్తుతం అది రూ.25 లక్షలు దాటిపోయింది.
మళ్లీ పెరిగే అవకాశం!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పలు రాష్ర్టాల్లో పాక్షిక, సంపూర్ణ లాక్డౌన్లు విధించారు. దీంతో నిర్మాణ రంగంలో వినియోగించే సామాగ్రిపై ఆ ప్రభావం ఉంటుంది. ఇదే అదునుగా ముడిసరుకు ఉత్పత్తి దారులు మళ్లీ 10 నుంచి 12 శాతం పెరుగవచ్చని బిల్డర్లు అందోళన వ్యక్తంచేస్తున్నారు. నిర్మాణం రంగంలోని ఉత్పత్తుల ధరలను నియంత్రించేందుకు కేంద్రప్రభుత్వం ఉత్పత్తిదారులతో చర్చలు జరుపుతున్నా తగ్గించడానికి వారు ఏమాత్రం ముందుకు రావడంలేదు. ధరలు తగ్గేవరకు ఎదురుచూసే అవకాశం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే భారమైనా నిర్మాణాలు కొనసాగిస్తున్నామని బిల్డర్లు పేర్కొంటున్నారు.
నిర్మాణ వ్యయం ఒక్కసారిగా పెరిగింది
లాక్డౌన్ నుంచి నిర్మాణరంగంలో ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ముఖ్యంగా సిమెంట్, స్టీలు ధరలు ఎక్కువగా పెరిగితే, ఆ భారం ఎస్ఎస్టీపై రూ.200 నుంచి రూ.400 వరకు అదనంగా పెరిగింది. ధరలు తగ్గకపోవడంతో ఆ భారం కొనుగోలు దారులపైనే వేయాల్సివస్తున్నది. భూముల ధరలు ప్రతియేటా క్రమంగా పెరగడం సహజమే అయినా, నిర్మాణ సామగ్రి ధరలు మాత్రం ఒక్కసారిగా పెరగడమే ఈ భారానికి కారణం. ముఖ్యంగా కరోనాకు ముందు బుక్ చేసుకున్న వారికి ఇండ్లు, అపార్టుమెంట్లలో అప్పుడు అంగీకరించిన బడ్జెట్లో నిర్మించి ఇచ్చే పరిస్థితి లేకుండాపోయింది.