హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): భూ సమస్యలపై ధరణి పోర్టల్ వేదికగా వినతులు వెల్లువెత్తుతున్నాయి. సర్వేనంబర్లు కనిపించకపోవడం, ఆధార్ అనుసంధానం కాకపోవడం, డిజిటల్ సంతకం(డీఎస్)పెండింగ్లో ఉండటం వంటి సమస్యలు ఉన్నవారు దరఖాస్తు చేసుకొనేందుకు ధరణి పోర్టల్లో ఇటీవలే ప్రభుత్వం ప్రత్యేకంగా గ్రివెన్స్ మాడ్యూల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సుమారు 10 రకాల భూ సమస్యలపై నేరుగా కలెక్టర్లకు విన్నవించుకొనే అవకాశం కలిగింది. ఈ మాడ్యూల్లో ఇప్పటివరకు దాదాపు 40 వేల దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. అత్యధికంగా మిస్సింగ్ సర్వే నంబర్లు, డీఎస్ పెండింగ్లో ఉన్న దరఖాస్తులే ఉన్నాయని చెప్పారు. మిస్సింగ్సర్వే నంబర్లకు సంబంధించి ఇప్పటివరకు 11,763 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. ఇవన్నీ మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నవేనని పేర్కొన్నారు. ఇవన్నీ ఆయా జిల్లాల కలెక్టర్ల లాగిన్కు వెళ్లాయని, వాటి పరిష్కార ప్రక్రియ కొనసాగుతున్నదని తెలిపారు. మొత్తంగా ధరణి పోర్టల్ ఆధారంగా ఇప్పటివరకు 4,29,532 లావాదేవీలు జరిగాయి. దీంతో ప్రభుత్వానికి రూ.475 కోట్ల ఆదాయం సమకూరింది.
96 శాతానికిపైగా ‘పెండింగ్’కు మోక్షం
గతంలో రిజిస్ట్రేషన్ చేసుకొని, మ్యుటేషన్ చేసుకోనివారి కోసం పోర్టల్లో ప్రత్యేకంగా కల్పించిన ఆప్షన్ను రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పటివరకు 1.3 లక్షల పెండింగ్ మ్యుటేషన్ దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 1.25 లక్షల దరఖాస్తులను అధికారులు పరిష్కరించారు. సుమారు 96 శాతానికిపైగా దరఖాస్తులకు మోక్షం లభించింది. పోర్టల్లో గురువారం నాటికి 3.39 లక్షల స్లాట్లు బుక్ అయ్యాయి. ఇందులో 3.20 లక్షలు రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరిగాయి. వీటిలో 2.94 లక్షలు క్రయవిక్రయాలు కాగా, 1,597 సక్సెషన్, 24,170 పార్టిషన్ దరఖాస్తులు ఉన్నాయి. సగటున అరగంటలోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తవుతున్నది. వారసత్వం, భాగ పంపకం, నాలా దరఖాస్తులు రికార్డుస్థాయిలో 10 నిమిషాల్లోనే పూర్తవుతున్నట్టు అధికారులు వివరించారు.
కల్యాణలక్ష్మికి 462.5 కోట్లు విడుదల
కల్యాణలక్ష్మి పథకం అమలుకోసం ప్రభుత్వం రూ. 462.5 కోట్లు విడుదల చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో బీసీ సంక్షేమశాఖకు రూ.1,850 కోట్లు కేటాయించింది. ఇందులో భాగంగా తొలివిడతగా రూ.462.50 కోట్లను విడుదలచేస్తూ రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.