జెనీవా/న్యూఢిల్లీ, ఆగస్టు 9: ‘ఈ చోటి కర్మ ఈ చోటే, ఈ నాటి కర్మ మరునాడే.. అనుభవించి తీరాలంతే.. ఈ సృష్టి నియమం ఇదే’ ఇటీవలి ఓ చిత్రంలోని ఈ గీతం ప్రస్తుత వాతావరణ మార్పులకు, భవిష్యత్తులో సంభవించే ఉత్పాతాలకు సరిగ్గా సరిపోతుంది. ప్రపంచంలోని కొన్ని దేశాలను ప్రస్తుతం కార్చిచ్చులు దహించివేస్తుంటే, మరికొన్ని దేశాలను వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ విపత్కర పరిణామాలకు వాతావరణ మార్పులే కారణమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. భూతాపం కారణంగా 2030నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్కి పెరిగే ప్రమాదమున్నదని వాతావరణ మార్పులపై సమగ్రమైన శాస్త్రీయ సమాచారాన్ని సేకరించే ఐక్యరాజ్యసమితి (ఐరాస)కి చెందిన ఇంటర్గవర్నమెంటల్ ప్యానెల్ అన్ ైక్లెమెట్ చేంజ్ (ఐపీసీసీ) తాజా నివేదికలో వెల్లడించింది. గతంలో ప్రతి వందేండ్లకు ఒక్కసారి చొప్పున పెరిగే సముద్రమట్టాలు ఇకపై ఏటా పెరుగొచ్చని హెచ్చరించింది. పర్యావరణంలో జరుగుతున్న ఈ అనూహ్య మార్పులకు ముమ్మాటికీ మానవుడిదే తప్పిదమని విమర్శించింది. వరదలు, వడగాడ్పులు, అతివృష్టి, కరువు కాటకాలు, మంచు కరుగడం, సముద్ర మట్టాలు పెరుగడం వంటి ఉత్పాతాలను తప్పించుకొని మనం ఎక్కడికీ పోలేమన్న కఠోర సత్యాన్ని కళ్లముందుంచింది.
ఐపీసీసీ నివేదికలోని కీలకాంశాలు
వాతావరణ మార్పుల వల్ల వచ్చే కొన్ని రోజుల్లో పరిస్థితులు మరింత దిగజారనున్నాయి. వరదలు, కార్చిచ్చులు, వడగాడ్పులు ఇలా ఎన్నో ఉపద్రవాలు ముంచుకురావొచ్చు.
2030నాటికి ప్రపంచవ్యాప్తంగా 1.5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరుగనున్నాయి. ఇప్పటికిప్పుడు నష్టనివారణ చర్యలు చేపట్టినప్పటికీ, ఈ గరిష్ఠ స్థాయిని చేరుకోవడం మాత్రం ఖాయం. దీనికి కారణం.. కర్బన ఉద్గారాలు వాతావరణంలోకి ఆ స్థాయిలో ఇప్పటికే విడుదలయ్యాయి.
ఈ శతాబ్దం చివరినాటికి ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 3.3 డిగ్రీల సెల్సియస్ పెరుగొచ్చు. అయితే, ఇది అంచనా మాత్రమే.
వడగాడ్పుల ప్రభావం గతంలో ప్రతి 50 ఏండ్లకు ఒకసారి మాత్రమే కనిపించేది. ఇకపై, ప్రతి పదేండ్లకు అవి బీభత్సం సృష్టించనున్నాయి. వడగాడ్పులే ప్రస్తుతం కాలిఫోర్నియా, గ్రీస్, టర్కీల్లో కార్చిచ్చులకు ఆజ్యం పోశాయి.
కార్బన్డైఆక్సైడ్, గ్రీన్హౌస్ ఉద్గారాలను కట్టడి చేయకపోతే వడగాడ్పులు, కరువుకాటకాలు, కుండపోత వర్షాలు భూగ్రహాన్ని అతలాకుతలం చేస్తాయి.
భూతాపం కారణంగా వేసవిలో ఆర్కిటిక్ వలయంలోని మంచు కరిగి సముద్ర మట్టాలు విపరీతంగా పెరిగిపోతాయి.
భారత్లో విపత్తులు తీవ్రతరం
మిగతా సముద్రాలతో పోలిస్తే హిందూమహా సముద్ర జలాలు వేగంగా వేడెక్కుతున్నాయని నివేదిక పేర్కొంది. దీంతో భారత్పై వడగాడ్పులు, వరదలు విరుచుకుపడే ప్రమాదమున్నదని వెల్లడించింది. సముద్ర మట్టాలు పెరుగడంతో తీరప్రాంతాలు ముంపునకు గురవ్వొచ్చని, అతివృష్టి, అనావృష్టి రెండూ తాండవించవచ్చని హెచ్చరించింది.
ఇవే ప్రధాన కారణాలు
వాతావరణంలోకి టన్నుల కొద్దీ చేరుతున్న కార్బన్డైఆక్సైడ్, మీథేన్ ఉద్గారాలు శిలాజ ఇంధనాలను ఇబ్బడిముబ్బడిగా మండించడం పర్యావరణ పరిరక్షణ చర్యలను గాలికొదిలేయడం
నిపుణులు, దేశాధినేతలు ఏమన్నారంటే?
వాతావరణ మార్పులపై శాస్త్రవేత్తల హెచ్చరికలను పట్టించుకోలేదు. జరుగబోనున్న ఉత్పాతాలను ఇష్టంలేకపోయిన అంగీకరించాల్సిందే. ఇది మానవాళికి రెడ్ అలర్ట్ .
-ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెరస్
ఇది ఊహించిందే. సంక్షోభాన్ని సంక్షోభంగా గుర్తించకపోతే ఎంతో కోల్పోతాం.
-గ్రెటా థన్బర్గ్, పర్యావరణ ఉద్యమకారిణి.
ప్రకృతి రక్షణకు ఆర్థిక వనరులను కేటాయించాలి. దీనికి అందరూ కదిలిరావాలి.
-బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్
నివేదిక ఘాటు వ్యాఖ్యలు
వాతావరణ మార్పులకు కారణం మానవ చర్యలే. ఇందులో ఎలాంటి సందేహంలేదు.
ప్రకృతిని ఈ స్థాయిలో నాశనం చేసిన మనం ఎక్కడికీ పారిపోలేము. మరెక్కడా దాక్కోలేము.
ప్రస్తుతం ఈ భూమిపై మానవసమాజం అంత క్షేమకర పరిస్థితుల్లో లేదు.
పర్యావరణానికి తూట్లు పొడుస్తున్న చర్యలను ఇప్పటికిప్పుడు నిలిపివేయకపోతే, జీవుజాతులు అంతరిస్తాయి. ప్రకృతే కనుమరుగు అవుతుంది.
ఎన్నిసార్లు మొత్తుకున్నా.. ఏ ఒక్క దేశమూ పర్యావరణ పరిరక్షణ చర్యలకు పూనుకోలేదు. కనీసం ఇప్పటికైనా మేల్కొందాం.
-గ్రీన్హౌస్ వాయువులు, కర్బన ఉద్గారాలను తగ్గిస్తే పర్యావరణంలో కలుగుతున్న మార్పులను తగ్గించడమే కాదు, వాయుకాలుష్యాన్ని కూడా నియంత్రించగలం.