కుమ్రంభీం ఆసిఫాబాద్/ సిద్దిపేట, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ)/కెరమెరి: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా తెలంగాణకు చెందిన ఇద్దరు టీచర్లు ఎంపికయ్యారు. కేంద్ర ప్రభుత్వం బుధవారం మొత్తం 44 మందికి అవార్డులు ప్రకటించగా, అందులో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని సావర్ఖేడ్ మండలపరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న కడార్ల రంగయ్య, సిద్దిపేట ఇందిరానగర్ జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం పయ్యావుల రామస్వామి కూడా ఉన్నారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతంలో సేవలందిస్తున్న ఉపాధ్యాయుడికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం విశేషం. కడార్ల రంగయ్య పదకొండేండ్లుగా సావర్ఖేడ్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అంకితభావంతో సేవలందిస్తున్నారు.
2010 డీఎస్సీలో ఉపాధ్యాయుడిగా ఎంపికై సావర్ఖేడ్ పాఠశాలను ఉన్నతంగా తీర్చిదిద్దారు. మారుమూల గ్రామ పాఠశాల అయినప్పటికీ గుణాత్మక విద్యనందిస్తూ విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రైవేట్ బడులకు దీటుగా విద్యా బోధన అందించడంతోపాటు పరిసరాల పరిశుభ్రత, క్రమశిక్షణకు చిరునామాగా నిలిపారు. తన పిల్లలను కూడా తాను చదువు చెప్పే బడిలోనే చదివిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల నుంచి విద్యార్థులు తాను పనిచేస్తున్న పాఠశాలకు తరలివచ్చేలా చేశారు.
రామస్వామి ఎనలేని కృషి
సిద్దిపేట ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో ‘అడ్మిషన్స్ ఫుల్’ అని ఏటా గేటు వద్ద బోర్డు పెట్టే పరిస్థితి రావడానికి ఆ పాఠశాల హెచ్ఎం రామస్వామి కృషే కారణం. ఆరేండ్ల క్రితం 300 మంది విద్యార్థులున్న ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో ఇప్పుడు 1,200 మంది విద్యార్థులు చదువుతున్నారు. మంత్రి హరీశ్రావు.. పాఠశాలను సకల హంగులతో, కార్పొరేట్ పాఠశాలకు దీటుగా తీర్చిదిద్ది రామస్వామిని మరింతగా ప్రోత్సహించారు. డిజిటల్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, అటల్ టింకరింగ్ ల్యాబ్ కోసం భవనం, గూగుల్ ఫ్యూచర్ క్లాస్ సదుపాయం, సోలార్ పవర్ యూనిట్, మోడల్ వంటశాల, వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయించారు. రామస్వామి ప్రత్యేక చొరవతోనే ఈ పాఠశాలలో ప్రతి రికార్డు ఆన్లైన్లోనే నిక్షిప్తమై ఉన్నది. 2017 నుంచి ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో విద్యారంగంపై జరిగిన సెమినార్లలో ప్రధానోపాధ్యాయుడు రామస్వామి పాల్గొంటున్నారు.
హరీశ్రావు అభినందనలు
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన కడార్ల రంగయ్య, రామస్వామిని ఆర్థిక మంత్రి హరీశ్రావు అభినందించారు. రంగయ్య, రామస్వామి తమ ఉపాధ్యాయ వృత్తిని సామాజిక సేవలో భాగంగా భావించి సేవలందించినందుకు ఈ గౌరవం దక్కిందని చెప్పారు. ఈ ఇద్దరు ఉపాధ్యాయుల పనితీరు, సంకల్పానికి ఈ అవార్డు నిదర్శనమని ప్రశంసించారు.