హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 23 (నమస్తే తెలంగాణ): సీటీ స్కాన్ (కంప్యూటెడ్ టోమోగ్రఫీ స్కాన్).. కొవిడ్ సెకండ్ వేవ్లో బాగా డిమాండ్ పెరిగిన పరీక్ష. అంతేకాదు.. ఒక్క సీటీ స్కాన్ వంద ఎక్స్రేలతో సమానమంటూ భయపడేవారు కొందరైతే, కొవిడ్ పాజిటివ్ అనగానే సీటీ స్కాన్కు ఎగబడేవారు మరికొందరు. ఈ నేపథ్యంలో అసలు సీటీ స్కాన్ అవసరమెంత? ప్రయోజనమెంత? ప్రధానంగా రేడియేషన్ ప్రభావమెంత? అనే అంశాలపై తాజాగా చర్చ జరుగుతున్నది. వాస్తవంగా వైద్యులు సూచించిన రోగులకైతే రిస్క్- బెనిఫిట్ దామాషా ప్రకారం కచ్చితంగా సీటీ స్కాన్ చేయించుకోవడంతోనే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని రేడియాలజిస్టులు సూచిస్తున్నారు. అవసరం లేకున్నా సీటీ స్కాన్ చేయించుకోవడం వల్ల రెండేండ్ల బ్యాక్ గ్రౌండ్ రేడియేషన్ (సాధారణంగా మనపై ఉండే రేడియేషన్ ప్రభావం)ను ఒక్కసారే పొందినట్టవుతుందని కూడా హెచ్చరిస్తున్నారు. కరోనా నేపథ్యంలో సీటీ స్కాన్ అనేది వైద్యుల సలహాతో అవసరం మేరకు మాత్రమే అని నిపుణులు స్పష్టంచేస్తున్నారు.
ఆధునిక యంత్రాలతో తగ్గిన ప్రభావం
సాధారణ ఎక్స్రే కంటే సీటీ స్కాన్ ద్వారా రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉండటం వాస్తవమని రేడియాలజిస్టులు చెప్తున్నారు. సాధారణంగా 50 మిల్లీ సీవాట్స్ రేడియేషన్ ప్రభావం దాటితే అది ప్రమాదకరమని హైదరాబాద్ మెహిదీపట్నం ఆలివ్ దవాఖాన సీనియర్ రేడియాలజిస్టు సునీల్ బొనెల తెలిపారు. ఒక ఎక్స్రే తీయించుకోవడం వల్ల 0.1 మిల్లీ సీవాట్స్ రేడియేషన్ ప్రభావానికి గురైతే, సీటీ స్కాన్ ద్వారా 6 మిల్లీ సీవాట్స్ రేడియేషన్ ప్రభావానికి గురవుతామని చెప్పారు. గతంలో హై డోస్ సీటీ స్కాన్ యంత్రాలు ఉండేవి. వీటితోనైతే ఏకంగా 30- 40 మిల్లీ సీవాట్స్ రేడియేషన్ ప్రభావం ఉండేది. ప్రస్తుతం అధునాతన లో డోస్ యంత్రాలు అందుబాటులోకి రావడంతో ప్రభావం గణనీయంగా తగ్గిందని సునీల్ వివరించారు. ఈ నేపథ్యంలో వైద్యుల సూచన మేరకు సీటీ స్కాన్ అనివార్యమైతేనే ఎలాంటి ఆందోళన చెందకుండా స్కాన్ చేయించుకోవాలని చెప్పారు. ముఖ్యంగా ఈ స్కాన్తో గురయ్యే రేడియేషన్ ప్రభావం కంటే ఈ పరీక్ష ద్వారా వైరస్ తీవ్రతను గుర్తించి ప్రాణాపాయం నుంచి తప్పించడం వైద్యులకు సులువు అవుతున్నందున రిస్క్-బెనిఫిట్ దామాషా ప్రకారం పరీక్ష చేయించుకోవడమే మేలని రేడియాలజిస్టులు సూత్రీకరిస్తున్నారు. కానీ అనవసరంగా తీసుకుంటే మాత్రం రేడియేషన్ ప్రభావాన్ని కొని తెచ్చుకోవడమేనని హెచ్చరిస్తున్నారు. సాధారణంగా మన చుట్టూ ఎంతో కొంత రేడియేషన్ ఉంటుంది. దానిని బ్యాక్ గ్రౌండ్ రేడియేషన్ అంటాం. ఒకవేళ అవసరం లేకున్నా సీటీ స్కాన్ చేయించుకొంటే మాత్రం రెండేండ్ల బ్యాక్ గ్రౌండ్ రేడియేషన్ ప్రభావాన్ని ఒకేసారి పొందే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.
అరుదైన కేసుల్లోనే రెండోసారి
కొవిడ్ లక్షణాలు ప్రారంభమైన, పాజిటివ్గా గుర్తించిన మొదటి 5 రోజుల్లో స్కాన్లో ఊపిరితిత్తులపై వైరస్ ప్రభావం అనేది బ్లర్ (గ్రౌండ్ గ్లాసింగ్)గా ఉంటుంది. 5 రోజుల తర్వాత మొజాయిక్ ఫ్లోర్లా కనిపిస్తుంది. ఆ తర్వాత దశలో తెల్లటి సిమెంటు వేసినట్టు ఉంటుంది. ఇక పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంటే ఊపిరితిత్తుల్లో గాలి పూర్తిగా పోయి ఒక రాయిలా తయారవుతుందని రేడియాలజిస్టులు చెప్తున్నారు. అందుకే లక్షణాలు మొదలైన, పాజిటివ్ గుర్తించిన 4- 7 రోజుల్లోపు సీటీ స్కాన్ చేయించుకోవడం వల్ల వైద్యులు వైరస్ తీవ్రతను గుర్తించి, తగిన చికిత్స అందించేందుకు వీలవుతుంది. చికిత్స అనంతరం రెండోసారి సీటీ స్కాన్ అనేది చాలా మేరకు అవసరం ఉండదని, వైద్యులు కూడా పెద్దగా సూచించకపోవచ్చని పేర్కొన్నారు. కొన్ని కేసుల్లో మాత్రం ఆయాసం తగ్గకపోతే విశ్లేషణ కోసం వైద్యులు రెండోసారి సీటీకి సూచిస్తారని అంటున్నారు. మొదటి, రెండో సీటీకి మధ్య కనీసంగా ఆరు వారాల వ్యవధి ఉంటేనే శ్రేయస్కరమని రేడియాలజిస్టు సునీల్ సూచిస్తున్నారు. కొవిడ్ రోగుల్లో ఊపిరితిత్తులపై వైరస్ ప్రభావం చూపితే తిరిగి ఆరు వారాల్లో సాధారణ స్థితికి వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. తదుపరి కూడా రికవరీ కాకుండా ఆయాసం ఉండే కేసులు అరుదుగా ఉంటాయన్నారు.
ఈ నాలుగు సమయాల్లో సీటీ స్కాన్
ప్రధానంగా నాలుగు సమయాల్లో సీటీ స్కాన్ అనివార్యం. ఆర్టీపీసీఆర్ పరీక్ష అందుబాటులో లేనప్పుడు. ఆర్టీపీసీఆర్లో నెగెటివ్ వచ్చి, లక్షణాలతో బాధపడుతున్నప్పుడు. తీవ్ర లక్షణాలతో బాధపడుతూ.. ఆర్టీపీసీఆర్ పరీక్ష ఫలితాలకు 2- 3 రోజుల సమయం పడుతున్నప్పుడు.. బాధితుడు ఆయాసంతో బాధపడుతున్నపుడు.. మాత్రమే వైద్యుల సూచన మేరకు సీటీ స్కాన్ తీయించుకోవాలి. కానీ సొంత వైద్యంలో భాగంగా తీయించుకోవడమనేది మంచిది కాదు.