హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): పల్లె ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. గ్రామాల్లోని పల్లె దవాఖానల్లో (హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు) 1,677 మంది డాక్టర్ల (మెడికల్ ఆఫీసర్స్-ఎంబీబీఎస్) నియామకానికి పచ్చజెండా ఊపింది. ఇందుకు సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విధివిధానాలను విడుదల చేసింది. అక్టోబర్ చివరినాటికి పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించింది. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నియామక ప్రక్రియ జరుగనున్నది. ఈ కమిటీకి జిల్లా కలెక్టర్లు చైర్మన్గా వ్యవహరిస్తారు. డీఎంహెచ్ఎం, సోషల్ వెల్ఫేర్ డీడీ, టీవీవీపీ అధికారులు సభ్యులుగా ఉంటారు. మెడికల్ ఆఫీసర్ల నియామకానికి ఈ నెల 28న నోటిఫికేషన్ విడుదల కానున్నది.
అదే రోజు నుంచి అక్టోబర్ 12 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తులను పరిశీలించి అక్టోబర్ 26న మెరిట్ లిస్ట్ను ప్రకటించి 27న కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పల్లె దవాఖానల్లో 269 మంది హెల్త్వర్కర్స్, 180 మంది మెడికల్ ఆఫీసర్లు పని చేస్తున్నారు. ప్రతి పల్లె దవాఖానలో అధునాతన సౌకర్యాలు కల్పించనున్నారు. వీలైతే టెలీ కన్సల్టెన్సీ కూడా ఏర్పాటుచేయనున్నారు. ప్రతి పల్లె దవాఖానను దగ్గర్లోని ఉన్నతస్థాయి ప్రభుత్వ డయాగ్నోస్టిక్ సెంటర్కు లింకు చేయనున్నారు. తద్వారా రోగులకు ఉచితంగా ఖరీదైన వైద్య పరీక్షలు చేసే అవకాశం ఉంటుంది.
ఇక ఆ సెంటర్లు పల్లె దవాఖానలు
గ్రామాల్లోని హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల పేరును ‘పల్లె దవాఖాన’గా మార్చుతూ వైద్య ఆరోగ్యశాఖ ఈ నెల 8వ తేదీన ఉత్తర్వులు జారీచేసింది. ఈ దవాఖానల్లోని మిడ్ లెవల్ హెల్త్ వర్కర్స్ పేరును కూడా ‘మెడికల్ ఆఫీసర్స్’గా మార్చింది.