నల్లని పాకురు పట్టిన గోడలు అక్షరాలను అద్దుకొన్నాయి. ఆ ఊరిలో ఏ మూల మలుపు తిరిగినా అంకెలు ఎదురై పలకరిస్తున్నాయి. వీధులకు ఇరువైపులా అక్షర మాలలు అల్లుకొంటున్నాయి. ఓ టీచర్ విద్యాబోధనను కొత్తకోణంలో ఆవిష్కరిస్తున్నారు. వీధులనే పాఠశాల గదులుగా, పాతగోడలనే నల్లబల్లలుగా మార్చి విద్యాదానం చేస్తున్నారు. అబ్బురపరుస్తున్న ఈ నూతన బోధన చూడాలంటే పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం పాలితం గ్రామ పరిధిలోని పుట్టపల్లికి వెళ్లాలి.
పెద్దపల్లి, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): విద్యాబోధన ఒక పవిత్ర యజ్ఞం.. నిత్యనూతనం. నిర్విరామం. ఆధునిక విద్యావ్యవస్థలో ఒక్కో ఉపాధ్యాయుడిది బోధనలో ఒక్కో శైలి. విద్యార్థి గ్రాహణ శక్తినిబట్టి బోధనలో వైవిధ్యం ఉంటుంది. రెండేండ్లుగా కరోనా కారణంగా పాఠశాలలు మూతపడటంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆన్లైన్ విద్యకే పరిమితం అయ్యారు. దాంతో బోధనలో టీచర్లకు, నేర్చుకోవటంలో విద్యార్థులకు కాస్త స్తబ్ధత ఏర్పడిందని పలు సర్వేలు చెప్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తయితే ప్రాథమిక స్థాయిలో.. అదీ పల్లె ప్రాంతాల్లో ప్రస్తుతం విద్యాబోధన కత్తిమీద సాములా మారింది. ఎంతో సరళంగా, వైవిద్యంతో బోధిస్తే కాని విద్యార్థులు పాఠాలను వినే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితే భాగ్యలక్ష్మి అనే ఓ ఎస్జీటీ టీచర్కు ఎదురైంది. కానీ ఆమె నిరుత్సాహపడలేదు. విద్యార్థులను ఆకర్షించేందుకు కొత్తగా ఆలోచించారు. ఆ ఆలోచనలోంచి పుట్టిందే వాల్రైటింగ్ టీచింగ్.
గోడలన్నీ అక్షరాలే
పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం పాలితం గ్రామ పరిధిలోని పుట్టపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు టీచర్లు, 16 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రాథమిక పాఠశాలలను తెరిచే అంశంపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో సజ్జనం భాగ్యలక్ష్మి అనే టీచర్ వినూత్నంగా ఆలోచించారు. గ్రామంలో కలియతిరిగి పిల్లలు ఎక్కడెక్కడ ఆటలు ఆడుతున్నారో గుర్తించారు. ఆ ప్రదేశాల్లోని ఇంటి యజమానుల అనుమతి తీసుకొని గోడలపై తెలుగు, ఇంగ్లిష్, గణితం సబ్జెక్టులకు సంబంధించిన పాఠ్యాంశాలను వాల్రైటింగ్స్గా రాయడం మొదలు పెట్టారు. తరగతి గది గుర్తుకొచ్చేలా ఓనమాలు, లెక్కలు, ఇంగ్లిష్ అక్షరమాలను గోడలపై పెయింట్తో రాశారు. దాంతో విద్యార్థులు తాము నిత్యం ఆడుకొనేచోటనే ఆ గోడల ముందు కూర్చొని రాసుకోవడం, చదువుకోవడం మొదలుపెట్టారు. ఊరిలోని వీధులన్నీ తరగతి గదులయ్యాయి. ఆడుతూ పాడుతూ పాఠాలను చదువుతున్నారు. భాగ్యలక్ష్మి ఆలోచనను గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు.
ఆడుతూ పాడుతూ చదువుతారని..
కొవిడ్ కారణంగా విద్యార్థులు పాఠశాలకు దూరమయ్యారు. కానీ వారు చదువుకు దూరం కావద్దని ఆలోచించా. గ్రామంలో ఏం చేస్తున్నారో తెలుసుకొనేందుకు రెండు రోజులు తిరిగా. వారు ఆడుకుంటున్న ప్రదేశాల్లోనే వాల్ రైటింగ్ ద్వారా పాఠాలను రాస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది. అక్కడి ఇంటి యజమానుల అనుమతి తీసుకొని స్వయంగా నేనే గోడలపై వాల్ రైటింగ్ రాశాను. విద్యార్థులు సంబురపడుతున్నారు. చాలా ఆనందంగా ఉన్నది.
-సజ్జనం భాగ్యలక్ష్మి, పుట్టపల్లి, పెద్దపల్లి జిల్లా