మెహిదీపట్నం, జీడిమెట్ల, మే 9: దవాఖానకు వచ్చే ఎంతోమందిని ఆమె ఆదరించారు.. వందలమంది రోగులున్నా అలసిపోకుండా చిరునవ్వుతో పలుకరించారు.. మా బాధ ఇదీ అని చెప్పుకొనే వారందరినీ కంటికి రెప్పలా కాపాడుకున్నారు.. కరోనా విలయతాండవం చేస్తున్నా వృత్తిమీదున్న బాధ్యతతో, రోగులమీద ఉన్న ప్రేమతో సపర్యలు చేశారు.. కానీ, అదే కరోనా మహమ్మారి ఆమెను పగబట్టింది. వేల ప్రాణాలను కాపాడిన ఆమెను కక్షకట్టి మరీ కాటేసింది. నిలోఫర్ దవాఖానలో హెడ్ నర్సుగా పనిచేస్తున్న స్వరూపరాణి (53) కరోనాపై పోరాడి శుక్రవారం తనువు చాలించారు. ఫ్రంట్లైన్ వారియర్గా రోగులకు సేవ చేయటంలో ఆమె ఎన్నడూ వెనక్కి తగ్గలేదు.
కరోనాపై అలుపెరుగని పోరాటం చేశారు. ఎంతోమంది వైరస్ బాధితులకు అండగా ఉంటూ వారిలో ధైర్యం నింపారు. ఇంకెంతోమందిని కాపాడారు. జహీరాబాద్ ప్రభుత్వ దవాఖానలో నర్సుగా ఉద్యోగం ప్రారంభించి, 2013లో నిలోఫర్కు వచ్చారు. ఇక్కడే 2016లో హెడ్నర్సుగా పదోన్నతి పొందారు. అయితే, కొవిడ్ సేవల్లో నిమగ్నమైన ఆమెకు ఏప్రిల్ 21న కరోనా సోకింది. రెండు రోజులు హోం ఐసోలేషన్లోనే ఉన్నా, ఆరోగ్యం క్షీణించటంతో అదే నెల 25న మాసాబ్ ట్యాంక్లోని మహవీర్ దవాఖానలో చేరారు. ఇన్ని రోజులు చికిత్స పొందిన ఆమె, ఈ నెల 7న మృతిచెందారు. ఆమె మరణవార్తతో నీలోఫర్ దవాఖాన వైద్య సిబ్బంది హృదయాలను కలచివేసింది. స్వరూపరాణికి ఇద్దరు కుమారులు, భర్త ఉన్నారు.
గుండెపోటుతో ఆశావర్కర్ మృతి
కరోనా బాధితులకు సేవలు అందిస్తూ ప్రజల ప్రాణాలు కాపాడుతున్న ఓ ఆశ వర్కర్ గుండెపోటుతో మృతిచెందారు. సుభాష్నగర్ డివిజన్ పరిధిలోని సూరారం 60 గజాలు కాలనీకి చెందిన కే అన్నపూర్ణ (52) ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో చనిపోయారు. శనివారం వరకు ఆమె ఇంటింటికీ తిరిగి జ్వరసర్వే నిర్వహించారు.