కాఠ్మండూ, మే 22: హిమాలయ దేశం నేపాల్ మరోసారి రాజకీయ సంక్షోభంలోకి కూరుకుపోయింది. అటు ప్రధాని కేపీ శర్మ ఓలీ, ఇటు ప్రతిపక్ష కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే స్థితిలో లేకపోవడంతో దేశ అధ్యక్షురాలు బిద్యాదేవి భండారి పార్లమెంట్ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. నవంబర్ 12, 19వ తేదీల్లో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. గురువారం అర్ధరాత్రి అత్యవసరంగా సమావేశమైన క్యాబినెట్.. పార్లమెంట్ను రద్దు చేయాలని సిఫారసు చేసింది. ఈ మేరకు శుక్రవారం అధ్యక్షురాలు పార్లమెంట్ రద్దు ప్రకటన చేశారు. అంతకుముందు ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని ప్రధాని ఓలీ, ప్రతిపక్ష నేత షేర్ బహదూర్ దేవుబా వేర్వేరుగా అధ్యక్షురాలికి వినతి పత్రం సమర్పించారు. అయితే, పలువురు ప్రతిపక్ష సభ్యుల పేర్లను కూడా తనకు మద్దతిచ్చే వారి జాబితాలో ఓలీ అక్రమంగా చేర్చారని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
ఓలీ-భండారి ద్వయంపై ప్రతిపక్షం పోరాటం
పార్లమెంట్ రద్దు నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీనిపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నాయి. ఓలీ-భండారీ ద్వయం నిరంకుశ, ఏకపక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని నిర్ణయించాయి. ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. అధ్యక్షురాలి నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం, అప్రజాస్వామికం, ఏకపక్షమని ధ్వజమెత్తాయి. దేవుబాతోపాటు సీపీఎన్ మావోయిస్ట్ సెంటర్ చైర్మన్ పుష్పకుమార్ దహల్ ప్రచండ, సీపీఎన్ యూఎంఎల్ నేత మాధవ్ కుమార్, జేఎస్పీ-ఎన్ నేత ఉపేంద్ర యాదవ్ తదితరులు సంతకాలు చేశారు. పార్లమెంట్ రద్దును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని నిర్ణయించారు.
149 మంది సభ్యుల మద్దతున్న దేవుబాను ప్రధానిగా నియమించాల్సిందని ప్రతిపక్ష కూటమి నేతలు పేర్కొన్నారు. కాగా పార్లమెంట్ను రద్దు చేయడం ఐదు నెలల్లో ఇది రెండోసారి. అధికార పార్టీలో కుమ్ములాటల నేపథ్యంలో ఓలీ సిఫార్సు మేరకు గతేడాది డిసెంబర్ 21న అధ్యక్షురాలు పార్లమెంట్ను రద్దు చేయగా, సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేసింది. అనంతరం బలపరీక్షలో ఓలీ ఓడిపోయినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆయననే మళ్లీ ప్రధానిగా నియమించారు.