హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): కరోనా ఉధృతమవుతున్న నేపథ్యంలో మున్సిపల్ విభాగం మరింత అప్రమత్తం కావాలని ఆ శాఖ మంత్రి కే తారకరామారావు ఆదేశించారు. పట్టణాలు, స్థానిక సంస్థల్లో శానిటైషన్పై ప్రత్యేకదృష్టి పెట్టాలని చెప్పారు. పట్టణాల్లో పారిశుద్ధ్యంపై శనివారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు. మున్సిపల్శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్కుమార్, సీడీఎంఏ సత్యనారాయణ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్తో ఫోన్లో మాట్లాడారు. కరోనా తీవ్రరూపందాలుస్తున్న దృష్ట్యా హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటిల్లో యుద్ధప్రాతిపదికన సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారి చేయాలని ఆదేశించారు. మున్సిపల్శాఖ పరిధిలోని ఎంటమాలజిస్టులు అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఉద్యోగులు తప్పనిసరిగా విధులకు హాజరుకావాలని, సెలవులు రద్దు చేయాలని సూచించారు. ఆరోగ్యశాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని కోరారు. కరోనాపై పోరులో మున్సిపల్ సిబ్బంది ముందువరుసలో ఉన్నందున వారందరికీ వ్యాక్సినేషన్ చేయించాలని చెప్పారు. కాగా, జీహెచ్ఎంసీలో ఆదివారం నాటికి ఉద్యోగులకు వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తవుతుందని, మిగిలిన పట్టణ స్థానిక సంస్థల్లో మరో రెండు మూడు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు మంత్రికి వివరించారు. ప్రజలందరు ఎప్పుడూ మాస్కు ధరించేలా చూడాలని కేటీఆర్ అధికారులను కోరారు.
చెత్త తరలింపునకు అదనపు వాహనాలు: అరవింద్కుమార్
సమీక్ష అనంతరం మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్కుమార్ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ కమిషనర్లకు పలు ఆదేశాలు జారీచేశారు. జనాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శానిటేషన్పై దృష్టి పెట్టాలని ఆదేశించారు. సోడియం హైపోక్లోరైట్ను స్ప్రే చేయాలని ఆదేశించారు. చెత్త తొలగింపునకు అవసరమైతే అదనపు వాహనాలను అద్దెకు తీసుకోవాలని సూచించారు. శ్మశాన వాటికల్లో నీరు, లైట్లు, ఇతర సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని, చనిపోయినవారిని దహనం చేయడానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని చెప్పారు. అవసరమైతే పట్టణ ప్రగతి నిధులను వినియోగించుకోవాలని సూచించారు.