హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): ఏటా రెండుకోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ప్రధాని నరేంద్రమోదీని ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న ఏడు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీచేయాలని డిమాండ్ చేశారు. భారీసంఖ్యలో ఉన్న ఖాళీలను భర్తీచేయలేని బీజేపీకి దేశంలోనే ఎక్కువ ఉద్యోగాలిచ్చిన తెలంగాణపై మాట్లాడే హక్కులేదని మండిపడ్డారు. నిరుద్యోగుల విషయం లో తాను మాట్లాడిన మాటలను వక్రీకరించడం దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు. ధాన్యం సేకరణలో భాగంగా హమాలీల గురిం చి మాట్లాడితే.. దానిని నిరుద్యోగ యువతకు ముడిపెట్టి విషప్రచారం చేశారని పేర్కొన్నారు. తన వ్యాఖ్యలను అపార్థం చేసుకోవద్దని కోరారు.
యువత ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని విజ్ఞప్తిచేశారు. సోమవారం మంత్రుల నివాసంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. బీహార్, యూపీ, తమిళనాడు, గుజరాత్, మహారా ష్ట్ర, కర్ణాటక వంటి రాష్ర్టాల్లో జనాభాలో కేవలం 1.5 శాతంలోపే ప్రభుత్వ ఉద్యోగులుండగా.. తెలంగాణలో మాత్రం 3 శాతం మం ది ఉన్నారని చెప్పారు. ఇంకా భారీసంఖ్యలో ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని, త్వరలోనే నోటిఫికేషన్లు విడుదలవుతాయని, యువత పూర్తి సన్నద్ధంగా ఉండాలని సూచించారు.
అది రాజ్యంగ విరుద్ధం
కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టులను కేంద్రం ఆధీనంలోకి తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. కేంద్రం విడుదల చేసిన గెజిట్ ఏకపక్షమని, అది తెలంగాణకు అన్యాయం చేసేలా ఉన్నదని విమర్శించారు. ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగినా నోరు మెదపరా? అని ప్రశ్నించారు. నదీజలాలపై రాష్ట్రప్రభుత్వం న్యాయపోరాటం చేస్తుందని స్పష్టంచేశారు. రాష్ర్టానికి అందాల్సిన ఎరువుల కోటాపై మంగళవారం ఢిల్లీలో కేంద్ర రసాయనాలు, ఎరువులశాఖ మంత్రిని కలువనున్నట్టు ఆయన తెలిపారు.