హైదరాబాద్ : హరితహారం కార్యక్రమం వల్ల తెలంగాణలో అటవీ శాతం 3.67% పెరిగిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 217.406 కోట్ల మొక్కలు నాటామని తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా హరితహారం కార్యక్రమంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమాధానం ఇచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణలో భాగంగా చేపట్టిన వివిధ కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. తెలంగాణలో అటవీ శాతం 3.67% పెరిగినట్లు సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించడం హరిత హార కార్యక్రమం ద్వారా సాధించిన విజయమే. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి హైదరాబాద్ ను ట్రీ సిటీ ఆఫ్ ఇండియాగా గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు హరిత హారం కార్యక్రమం ద్వారా 230 కోట్ల నాటాలనే లక్ష్యం కాగా ఇప్పటవరకు 217.406 కోట్ల మొక్కలు నాటాము. నాటిన మొక్కల సంరక్షణ, వాటిని బ్రతికించుకోవడంపై ప్రధానంగా దృష్టి సారించాము. నాటిన మొక్కల్లో 85% మొక్కలను బ్రతికించుకోవాలనే ఉద్దేశ్యంతో మున్సిపల్, పంచాయతీ రాజ్ చట్టాల్లో సవరణ చేయడం జరిగింది. గ్రామ పంచాయతీల్లో, మున్సిపాలీటీల్లో మొక్కలు నాటి సంరక్షించేందుకు వార్షిక బడ్జెట్ లో 10% హరిత బడ్జెట్ గా ప్రత్యేకంగా కేటాయిస్తున్నాము అని తెలిపారు.
అనుబంధ ప్రశ్నలకు సమాధానమిస్తూ… తెలంగాణలో మొత్తం భౌగోళిక విస్తీర్ణం 2.77 కోట్ల ఎకరాలు కాగా, ఇందులో 66.66 లక్షల ఎకరాల విస్తీర్ణంలో అటవీ భూమి ఉంది. మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణాలో 24.05 శాతం అడవులు ఉన్నాయి. భారతదేశంలో ఉన్న 21.34 శాతం అడవితో పోలిస్తే… తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి కొంత మెరుగ్గానే ఉంది అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు.