హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటున్నదని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో కొవిడ్ రోగుల కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసిందని కేంద్రానికి వివరించారు. బుధవారం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి హర్షవర్ధన్ అన్ని రాష్ర్టాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ రాష్ర్టాల్లో కరోనా పరిస్థితి, కట్టడి కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీశ్రావు.. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, నియంత్రణ చర్యలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలను ప్రశంసించిన కేంద్ర మంత్రి హర్షవర్ధన్.. తెలంగాణలో కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతున్నదని ఈ సందర్భంగా సంతృప్తి వ్యక్తంచేశారు. రాష్ర్టానికి అవసరమైన ఆక్సిజన్, రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు, వ్యాక్సిన్లు, టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్లు తదితర కరోనా సంబంధిత కోటాను పెంచి, సత్వరం సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.
బెడ్ల సంఖ్య మూడు రెట్లకు పెంచాం
మొదటివేవ్ సమయంలో ఉన్న మౌలిక వసతులను రెండోవేవ్ నాటికి గణనీయంగా పెంచామని మంత్రి హరీశ్ తెలిపారు. 18,232గా ఉన్న బెడ్ల సంఖ్యను సీఎం కేసీఆర్ ముందుచూపుతో మూడురెట్లు 53,775కు పెంచినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని ముందుగానే అరికట్టేందుకు వైద్యారోగ్యశాఖ ఇంటింటికీ తిరిగి జ్వర సర్వే నిర్వహిస్తున్నదని వివరించారు. అంగన్వాడీ, ఆశ వర్కర్లు, ఏఎన్ఎం సిబ్బందితో కూడిన 27,039 బృందాలు ప్రతి ఇంటికీ వెళ్లి జ్వర పరీక్షలు నిర్వహిస్తున్నాయని, అనుమానితులకు కరోనా కిట్లను ఉచితంగా అందజేస్తున్నాయని తెలిపారు. ఇప్పటివరకు 60 లక్షల ఇండ్లల్లో జ్వర పరీక్షలను నిర్వహించినట్టు కేంద్రమంత్రికి హరీశ్రావు వివరించారు.
పక్కరాష్ర్టాల నుంచి పెరిగిన రద్దీ
హైదరాబాద్ మెడికల్హబ్గా మారిన నేపథ్యంలో.. తెలంగాణలోని కరోనా రోగులతోపాటు ఇతర రాష్ర్టాలనుంచి బాధితుల రద్దీ విపరీతంగా పెరిగిందని హరీశ్రావు వివరించారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ తదితర రాష్ర్టాలనుంచి కరోనా రోగులు హైదరాబాద్ వచ్చి చికిత్స పొందుతున్నారని తెలిపారు. దీంతో రాష్ట్రంలో కొవిడ్ పాజిటివ్ లెక్కల్లో తేడా వస్తున్నదన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు జనాభా ప్రాతిపదికన కాకుండా.. రాష్ట్రంలో ప్రతిరోజూ నమోదవుతున్న పాజిటివ్ కేసుల బెడ్ల సంఖ్య ఆధారంగా మందులు, ఆక్సిజన్ తదితర కేటాయింపులు జరపాలని కోరారు. ఆక్సిజన్ సరఫరాతోపాటు, రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు, వ్యాక్సిన్ల కోటాను పెంచి తక్షణమే సరఫరా చేయాలని విజ్ఞప్తిచేశారు. రాష్ర్టానికి కేటాయించిన 450 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను 600 మెట్రిక్ టన్నులకు పెంచాలని కోరారు. ఒడిశా వంటి దూర ప్రాంతాలనుంచి కాకుం డా, దగ్గరలో ఉన్న ఏపీ, మహారాష్ట్ర నుంచి ఆక్సిజన్ క్రయోజనిక్ ట్యాంకర్లను కేటాయించాలని కోరారు. రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను 20 వేలకు పెంచాలని మరోసారి విజ్ఞప్తిచేశారు. ఎయిర్ అంబులెన్సుల ద్వారా అత్యవసర చికిత్సకోసం ఇతర ప్రాంతాలనుంచి కరోనా రోగు లు తెలంగాణకు తరలివస్తున్నారని, రోజుకు 810 మాత్రమే అందచేస్తున్న టోసిలీజుమాబ్ మందులను 1500కు పెంచాలని విజ్ఞప్తిచేశారు. ప్రతిరోజూ 2 లక్షల టెస్టింగ్ కిట్లు సరఫరా చేయాలని కోరారు.
1.29కోట్ల వ్యాక్సిన్లు అవసరం
రెండో డోస్ కొవిడ్ టీకాను నూటికి నూరు శాతం అమలుచేస్తున్నామని, ఈ నేపథ్యంలో 45 ఏండ్లు పైబడినవారికి వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు 1.29కోట్ల వ్యాక్సిన్ల అవసరం ఉన్నదని మంత్రి హరీశ్రావు తెలిపారు. ఈ నెల చివరి వరకు 13 లక్షల వ్యాక్సిన్లు అవసరమున్నదని, వెంటనే సరఫరా చేయాలని కోరారు. అలాగే 2వేల వెంటిలేటర్లు తక్షణమే అందజేయాని విజ్ఞప్తిచేశారు. తెలంగాణ చేసిన విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి హర్షవర్ధన్ వివరాలన్నింటినీ నమోదు చేసుకున్నారు. రాష్ట్ర అవసరాల రీత్యా తక్షణమే సరఫరాకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చా రు. వీడియో కాన్ఫరెన్స్లో సీఎం కార్యదర్శి, కొవిడ్ ప్రత్యేకాధికారి రాజశేఖర్రెడ్డి, హెల్త్ డైరెక్టర్ జీ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్రెడ్డి, టెక్నికల్ అడ్వయిజర్ డాక్టర్ గంగాధర్ పాల్గొన్నారు.