బీజేపీకి ఓటు ఎందుకు వేయాలో ఒక్క మంచి కారణమైనా చెప్పగలరా? ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నందుకా? వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచుతున్నందుకా? మన దొడ్డు వడ్లు కొనని ప్రభుత్వానికి, ఉద్యోగాలు పీకేస్తూ రిజర్వేషన్లు అందకుండా చేస్తున్న బీజేపీకి ఓట్లు ఎందుకు వేయాలి?
-తన్నీరు హరీశ్రావు, ఆర్థికశాఖ మంత్రి
హుజూరాబాద్, సెప్టెంబర్ 11: బీజేపీ విధానాలను ఆ పార్టీ అనుబంధ భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ కిసాన్ మోర్చా వంటి సంఘాలే తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే..ఆ పార్టీకి మనమేందుకు ఓటెయ్యాలని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులను అమ్మొద్దని, రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలని ఆ సంఘాల నాయకులు డిమాండ్చేసినా మోదీ ప్రభుత్వం లెక్కచేయలేదని విమర్శించారు. దొడ్డువడ్లు కొనని, ఉద్యోగాలు ఊడబీకే బీజేపీకి ఓటెందుకు వేయాలని నిలదీశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణం సమీపంలో కేసీఆర్ ఆటోనగర్కు శనివారం భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ బీజేపీకి ఓటు ఎందుకు వేయాలో ఒక మంచి కారణమైనా ఆ పార్టీవాళ్లు చెప్పగలరా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్కు ఓటు ఎందుకు వెయ్యాలో వంద కారణాలు చెప్పగలమని పేర్కొన్నారు.
రిజర్వేషన్లకు బీజేపీ ఎసరు
ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటుపరం చేస్తున్న బీజేపీ సర్కారు, రిజర్వేషన్లకు ఎసరు పెడుతున్నదని హరీశ్రావు ఆందోళన వ్యక్తంచేశారు. ఎల్ఐసీ వంటి సంస్థలను కొనే ప్రైవేటు కంపెనీలు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వబోవని హెచ్చరించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడమే ధ్యేయంగా బీజేపీ ప్రభు త్వం పనిచేస్తున్నదని మండిపడ్డారు. వంటగ్యాస్ ధరను రూ.1,000 దాటించిన బీజేపీ సర్కారు, సబ్సిడీని రూ.280 నుంచి రూ.40కి తగ్గించిందని ఆరోపించారు. వీటన్నింటినీ బేఖాతర్ చేస్తూ బీజేపీకి ఓటేస్తే వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.1,500 అవుతుందని పేర్కొన్నారు. ఈటల రాజేందర్ బొట్టుబిళ్లలు, గోడ గడియారాలు పంచటం ఆపి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించేందుకు కృషి చేయాలని హితవు పలికారు.
కేసీఆర్ పాలన సంక్షేమ యుగం
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో సంక్షేమ యుగం నడుస్తున్నదని హరీశ్రావు అన్నారు. ఆడబిడ్డల పెండ్లికి రూ.లక్ష ఇచ్చి పేదలను కేసీఆర్ ఆదుకొంటున్నారని తెలిపారు. పేదల కోసం పాటుపడుతున్న టీఆర్ఎస్ వైపు ఉంటారో, ధరలు పెంచుతూ సామాన్యులపై పెనుభారం మోపుతున్న బీజేపీకి ఓటేస్తారో నిర్ణయించుకోవాలని ప్రజలకు సూచించారు. సకల సౌకర్యాలతో కేసీఆర్ ఆటోనగర్ను నిర్మిస్తామని, దీనికోసం టీఎస్ఐఐసీ నుంచి రూ.3 కోట్లు మంజూరు చేశామన్నారు. ‘మేం చెప్పింది చేసి చూపెడుతాం. మాట తప్పడం మాకు తెలియదు. రేపు రా..మాపు రా..అనే ఉద్దెర బేరాలు ఉండవు’ అని హరీశ్రావు స్పష్టంచేశారు. ఇక్కడ లబ్ధి పొందిన 347 మంది కలిసి తలో 20 ఓట్లు వేయిస్తారని ఆశిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా పలువురి లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు.
గెల్లుకు డిపాజిట్ కడుతామనటం సంతోషం
ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ నామినేషన్కు డిపాజిట్ డబ్బులు మోటర్ వర్కర్స్ యూనియన్ కడుతామని చెప్పడం సంతోషంగా ఉందని మంత్రి హరీశ్రావు తెలిపారు. ‘మీరంతా కలిసి నామినేషన్ డబ్బులు చెల్లిస్తామంటే ఇంతకంటే మంచి విషయం ఎక్కడ ఉంటది? తప్పకుండా నామినేషన్ ధరావత్తు కట్టే అవకాశాన్ని మీకే ఇస్తాం’ అని చెప్పారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, కౌన్సిలర్లు కళ్లెపెల్లి రమాదేవి, ప్రతాప మంజుల తదితరులు పాల్గొన్నారు.
రాజేందర్కు కనీస కనికరం లేదు
ఆరేండ్ల కింద వినాయక నిమజ్జనం రోజు ఊరేగింపులో విద్యుత్తు ప్రమాదం జరిగి ఇద్దరు మెకానిక్లు చనిపోయిన్రు. ఆ కుటుంబాలకు సాయం చేయాలని ఈటల రాజేందర్ను కోరితే రూ.5 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఇయ్యలె. ఆయనకు కనీసం కనికరం లేదు. ఆటోనగర్కు స్థలం కావాలని అడిగితే సాధ్యంకాని పనులెందుకు అడుగుతరు సదానందం అని మొఖం మీదనే అన్నడు. దేవుడి దయవల్ల ఈ రోజు మా కోరిక నెరవేరింది. సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్ మా కల నెరవేర్చిన్రు. వారిని జీవితాంతం గుర్తు పెట్టుకుంటం. ఉప ఎన్నికలల్ల గెల్లు శ్రీనివాస్ను గెలిపించి తీరుతం.
ఈటల వెకిలిగా నవ్విండు
ఆటోనగర్కు స్థలం కావాలని అడిగితే ఈటల వెకిలిగా నవ్విండు. ఎన్నడూ మా గురించి ఆయన పట్టించుకోలేదు. సంఘం భవనం కోసం ఐదు గుంటలు జాగ అడిగినా ఇయ్య లె. కానీ, మంత్రి హరీశ్రావు దగ్గరికి పోయి మా సమస్య చెప్పిన నెలలోపే ఆటోనగర్ ఏర్పాటు చేయించిండు. గింత తొందరగా పనైందంటే నమ్మబుద్ధి అయితలేదు. మా కల నెరవేర్చిన టీఆర్ఎస్కే ఓటు వేస్తం. గెల్లు శ్రీనివాస్ను గెలిపించి కానుక ఇస్తం.
గెల్లు నామినేషన్ డబ్బు మేమే కడుతం
ఈటల మంత్రి అయ్యాక ఆటోనగర్ కోసం 200 సార్లు కలిసినం. ఎన్నిసార్లు వెళ్లినా మమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్ ఆటోనగర్కు స్థలం ఇచ్చి మాకు ఆత్మగౌరవాన్ని ఇచ్చారు. టీఆర్ఎస్కు కార్మికులందరం రుణపడి ఉంటం. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కోసం ప్రచారం చేస్తాం. గెల్లు నామినేషన్కు అవసరమైన డబ్బులు కార్మికులందరం చందాలు వేసుకొని చెల్లిస్తాం.